Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-132 వ సమావేశం
-- కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి) --
vikshanam-132

ఒక వైపు సూర్యోదయం(భారత దేశంలో) మరొక వైపు చంద్రోదయం(అమెరికా/ కాలిఫోర్నియా). ఈ రెండింటి నడుమ కవితోదయం (కవి సమ్మేళనం). ఈ సమన్వయం లో మెరుస్తున్న కవి తారకలు (కవులు).  ఈ విధమైన ప్రకృతి వీక్షణలో ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైనది వీక్షణం 132 వ సాహితీ సమావేశం. జూమ్ (Zoom) వేదికగా మధుర స్వాగత వచనాపలుకులతో సంస్థ సంస్థాపక అధ్యక్షురాలు డా. కె గీతామాధవి ఆధ్వర్యంలో ప్రతీ నెల జరుగు విధంగా ఈ 13.08.23 వ తేదీన చాలా ఆసక్తికరంగా ప్రారంభం అయినది. ముందుగా డా. గీతామాధవి సభకు విశేష సంఖ్యలో విచ్చేసిన ప్రధాన ప్రసంగకర్త ప్రొ. సిహెచ్. సుశీల గారిని /అతిథులు/కవులు/సాహితీవేత్త లందరికీ స్వాగతం పలుకుతూ, ఈ సమావేశంలో ఇటీవలే దివంగతులైన శ్రీ రమణ గారి గురించి వారి రచనలను గూర్చి ప్రసంగించ వలసిందిగా ప్రొ।। సుశీలమ్మ గారిని కోరుతూ, వారిని సభకు పరిచయం చేయవలసిందిగా శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారిని కోరినారు.

ప్రొ. సిహెచ్. సుశీల గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరు లో సుదీర్ఘ కాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలు లో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ ల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.

వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగం లో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు. విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో "కవిసంధ్య"(శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ఈ మాసం మంచి కవిత’  శీర్షిక నిర్వహించారు. వీరి రచనలు:

1.స్తీవాదం - పురుష రచయితలు 2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర 3. విమర్శనాలోకనం (విమర్శ వ్యాసాలు) 4. విమర్శ వీక్షణం (విమర్శ వ్యాసాలు)

పరిచయ అనంతరం ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు సభకు నమస్కరిస్తూ శ్రీరమణ గారి సాహిత్యం గూర్చి ప్రసంగం కొనసాగించారు.

"శ్రీరమణ గారు అర్థశతాబ్దం పాటు అలుపూ సొలుపూ లేకుండా అనేక మైన రచనలు విలక్షణమైన, విశిష్టమైన రీతిలో విస్తృతంగా వ్రాసి తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన మాటల్లోని చెణుపులు గాని, విసుర్లు గాని ఆంధ్రప్రజల్ని ఉర్రూతలూగించినాయి.

ఆయన గుంటూరు జిల్లా తెనాలి వరాంగపురము అగ్రహారములో మధ్యతరగతి కుటుంబములో 1952 సెప్టెంబెర్ 21 వ తేదీన జన్మించారు. అప్పుడు ఆయనకు పెట్టిన పేరు వంకమామిడి రాధాకృష్ణ. వారి తాతగారు (అమ్మ తండ్రి) మగపిల్లలు లేక దత్తత తీసుకోవడం వలన ఆయన ఇంటి పేరు కామరాజు రామారావు. చిన్నప్పట్నుంచి ఆయనకు వ్యాస రచనలు అంటే ఇష్టం. పుస్తకాలు బాగా చదివే వారు. వ్యాస రచనలు వ్రాసే సమయంలో ఎప్పుడూ మొదటి బహుమతి ఆయనకే వచ్చేది. ఆ సమయం లో రామకృష్ణ మిషన్ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రధమ బహుమతి రావడంతో ఈయనను గెస్ట్ గా హిమాలయా పర్వతాలకు తీసుకు వెళ్ళడం జరిగింది. తరువాత, చాలా చిన్న వయస్సులోనే కొంచం ధాఠీగా... రమణమహర్షి గారి విశ్వాసం వల్లనో, ముళ్ళపూడి వెంకట రమణ గారి సాహిత్య అభిలాష వల్లనో తనకు తానే శ్రీరమణ అనే కలం పేరుతో రచనలు చేసి ధైర్యంగా ఆంధ్రప్రభ పత్రికకు పంపించారు. అది చూసి నండూరి రామ్మోహనరావు గారు చాలా ఆనందపడి అతన్ని పిలిపించి, చాలా చురుకైన కుర్రవాడు, పదునైన కలం అని, ఇతనిచేత వ్రాయించాలని అభిలషించి మా పత్రికలో నీవు వ్రాయాలి, అన్నప్పుడు కాలమ్స్ వ్రాస్తా అని చెప్పారు. కాలమ్స్  వ్రాయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో, లేక ఈరోజు ఏం జరిగిందో, చూసి దాన్ని మర్నాడు దానికి సరిపోయేటట్లుగా, అది సాహిత్యం కావచ్చు, రాజకీయం కావచ్చు, వాటికి చణుకులు అద్దుతూ అందర్నీ ఆకర్షించే విధంగా వ్రాయడమంటే చాలా కష్టం. ఆయన ధైర్యంగా కాలమ్స్ వ్రాస్తానన్నారు, అప్పట్నుంచి బ్రహ్మాండంగా కాలమ్స్ వ్రాస్తూ ఒకేసారి రెండు, మూడు పత్రికలకు వ్రాయడం జరిగింది. రంగుల రాట్నం అనే దాంట్లో అనేక మంది కవులను గురించి లేదా రాజకీయాల గురించి  హాస్యంగా వ్రాయటం జరిగింది.

అలాగే శ్రీరమణ గారు అనగానే మనకు పేరడీలు గుర్తుకు వస్తాయి. అంతకు ముందు పేరడీలు అనగానే జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి) గారు గుర్తుకు వస్తారు. అసలు పేరడీ మనది కాదు. మనకు వ్యంగ్యం ఉంది. పేరడీ అంటే హాస్యపూర్వకంగా చేసే వ్యంగ్యం. ఇది ఆంధ్ర సాహిత్య ప్రభావం వల్లనే వచ్చింది. జరుక్ శాస్త్రి గారు, ఒక్కొక్క రచయితని తీసికొని, ఆయన ఇలా వ్రాస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రమే వ్రాశారు. అయితే శ్రీరమణ గారు ఒక క్రొత్త ప్రయోగం చేశారు. రచయితలు అందరూ కలిస్తే వారి రచనలు ఎలా ఉంటాయి. ఒక గులాబీ పువ్వుని రచయితలు అందరూ ఎలా వర్ణిస్తారు? అనే హాస్య రచన చేయటం జరిగింది. దాంట్లో మనం సుప్రసిద్ధుల వచన పచనం, అంటే వాళ్ళు వచనం ఎలా వ్రాస్తారు? వారి యొక్క వచనం వ్యంగ్యంగా ఎలా ఉంటుంది అని వ్రాశారు. పీఠికా పాటవం. వారు పీఠికలు ఎలా వ్రాస్తారు? అనేది వ్రాశారు. విశ్వనాధ సత్యన్నారాయణ శాస్త్రి గారు కవులనందర్నీ పొగుడుతున్నట్టే ఉంటారు, కానీ ఇతడు కూడా ఒక కవియేనా? కవియని అందరూ అంటూ ఉంటారు అని వ్యంగ్యంగా అంటారు. కొంతమంది సినిమా సమీక్షలు వ్రాశారు. ఒక్క పేరు మారిస్తే చాలు, మిగతా అంతా ఒకేలా ఉంటుంది. దర్శకుడు తన ప్రతిభను చూపించాడు, అలాగే కధానాయకుడు, కధానాయిక వారి శక్తి మేరకు నటించారు లాంటి పడికట్టు పదాలతోటి కొంతమంది వ్రాస్తూ ఉంటారు. దాంట్లో కూడా ప్రముఖులు వ్రాస్తే ఎలా ఉంటుంది? అని వ్రాశారు.

వీటన్నిటి కంటే అద్భుతంగా, అందర్నీ నవ్వించే "రైలుబండిలో వైతాళికులు". రైలుబండిలో వైతాళికులు ఎవరు? రైలుబండిలో ఒక కంపార్టుమెంటులో విశ్వనాధ సత్యన్నారాయణ శాస్త్రి గారు, కాటూరి వారు, పింగళి వారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, పిలకా గణపతి శాస్త్రి గారు, మొక్కపాటివారు, తల్లావర్ఝుల శివశంకర శాస్త్రి గారు, జలసూత్రం గారు, వీళ్లంతా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది? టి.టి. వచ్చి టిక్కెట్ అడిగి నపుడు వాళ్ళ సంభాషణ ఎలాఉంటుంది అనేది ఒక అద్భుతమైన హాస్య, వ్యంగ్య రచన. వీళ్లందరి పట్లా ఇతనికి అభిమానం, గౌరవం ఉంది. వీళ్ళంటే అతనికి ప్రాణం. అయినా కూడా వారి గూర్చి వ్యంగ్యంగా వ్రాశారంటే, వాళ్ళని ఎంత లోతుగానో చదివి ఉండాలి, వాళ్లపై ఎంత భక్తి తోనో, వాళ్ళ నాడిని పట్టుకొని వ్రాశారు. విశ్వనాథవారు ఎలా వ్రాస్తారు, శ్రీ శ్రీ ఎలా వ్రాస్తారు, అలా అందరి రచనలను అధ్యనం చేసి, వాళ్ళ వాళ్ళ పుస్తకాలు బాగా చదివి, రచనా శైలిని పట్టుకొని వ్రాశారు. టికెట్ కలెక్టర్ వచ్చారు. వచ్చి, పైన పడుకొని ఉన్న కృష్ణశాస్త్రి టికెట్ అడిగి మీరు క్రిందికి దిగి రండి అన్నారు. వెంటనే అతను 'దిగి రాను దిగి రాను పైనుంచి నేను' 'విప్పి వేసుదురుగాక నాకేటి సిగ్గు' అన్నారు. అయితే టిక్కెట్స్ చూపించండి అన్నారు. ఆయన రెండు టికెట్లు చూపించారుట. రెండు టికెట్లు ఎవరికండి అని అడగగా ఒకటి నాకు, రెండవది నా ఊహా ప్రేయసి ఊర్వశి కి అని చెప్పారుట. ఎక్కడున్నారు అని అడిగితే నా కలం, నా ఊహల్లో అని చెప్పారుట. అయ్య బాబోయ్ అని ప్రక్కనే ఉన్న శ్రీ శ్రీ గారిని చూసి, ఎవరండి మీరు అని అడిగితే, 'భూతాన్ని యజ్ఞోపవీతాన్ని' అనే పద్యాన్ని చెప్పారుట. కాస్త తెలుగులో చెప్పండి అన్నారుట. అంటే ఇప్పటి వరకు సాహిత్యం నన్ను నడిపిండి, ఇక్కడ్నుండి సాహిత్యాన్ని నేను నడుపుతాను. కావచ్చండి, ఇది సర్కార్ వారు నడుపుతున్నారు. ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు. అంతలో విశ్వనాధ సత్యన్నారాయణ గారి వద్దకు వచ్చి టికెట్ అని అడిగారు. ఆయన లేదు. అదేమిటండి లేదు అంటారు అంటే, అల నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు అనే పద్యం చెప్పారుట. అదేంటి టికెట్ లేదంటారు అలా నడిచేరుట. ఇంతకీ టిక్కెట్స్ అన్నీ ఎక్కడి ఉన్నాయి అంటే, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి గారి వద్ద ఉన్నాయి. అతను ట్రైన్ బయలుదేరాక వేరే కంపార్ట్మెంట్ ఎక్కారు. ఇలా కవుల్నందర్నీ అడుగుతూ, చిట్టా చివరికి ఒక స్టేషన్ లో ఆగి నప్పుడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు జలసూత్రం గారు. ఇవిగోనండి టిక్కెట్స్ అన్నారు. ఇంతకీ చలం ఏరి అని చూస్తే, ఏమోనండి ఇంతకుముందు ఐదుగురు ఆరుగురుతో స్త్రీలతో కలసి స్టేషన్ లో దిగిపోయారు. ఐతే చలం గారు స్త్రీలకు అండదండగా దిగిపోయారేమో, వారికి రక్షణ కోసం దిగిపోయారేమో, వాళ్ళ మనసు ఉంది, వాళ్ళకు ఆలోచన ఉంది అని వాళ్ళ వెంటపడ్డారేమో, తెలియదు. ఇలా సాగిపోతుంది. ఇది చదివితే ఎవరికీ నవ్వు రాకుండా ఉండదు. "

ఇవాళ మనం ఇటీవలే మరణించిన శ్రీ రమణ గారి రచనలను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాము అని వారి ఫోటో చూపిస్తూ సుశీల గారు ఇలా కొనసాగించారు.

ఆయన రోజూ కాలమ్స్ వీక్లీల్లో గాని, ఆదివారం అనుబంధంలో గాని అనేకం వ్రాశారు. అంతేకాకుండా రేడియో ప్రసంగాలు కూడా చాలా రచించారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆయన యొక్క కథలు. ఈయన 1997 నుంచి 1999 వరకు 100 వారాల పాటు ఆంధ్రప్రభ  వీక్లీ లో "శ్రీఛానల్" అనే ఫీచర్ని నిర్వహించారు. ఇది కూడా చాలా అద్భుతమైన హాస్య ప్రసంగాలు. కీ।।శే।।శేఖర్ అనే ఆయన చాలా ఇష్టంగా వీటికి బొమ్మలు వేసేవారు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారు సంపాదకులుగా ఉన్నప్పుడు, ప్రతీ వారము 2 పేజీల్లో హాస్యాన్ని వ్రాయాలని అన్నప్పుడు శ్రీ ఛానల్ లో అన్నీ వ్రాశారు. అన్నీ చమత్కారాలు, చమత్ కారాలు, చమత్ ధారలు అని అంత అద్భుతంగా వ్రాశారు. అందులో కోణంగి రాతలు, నేమ్ ట్రాపింగ్, గులాబీ మొగ్గలు, వినయం, మహాకవులు మాతృప్రేమలు, తల్లులు కొడుకు ఎంత గొప్పవారయినా వారి ప్రేమను, వారిపట్ల వారి క్షేమం పట్ల తల్లులు ఆలోచిస్తూ ఉంటారు.

'పదండి ముందుకు పదండి పోదాం, పోదాం పోదాం పైపైకి' అని శ్రీ శ్రీ గారు అన్నప్పుడు, వాళ్ళ అమ్మగారు బాబోయ్ పైకి వెళ్తున్నాడేమో అని 'వెళ్తే వెళ్ళు గాని కాస్త త్రాడు నిచ్చెన తీసుకొని వెళ్ళు నాయనా', జారిపడిపోతావేమో, అని అందట వాళ్లమ్మ. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు 'నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరపు' అన్నప్పుడు, వాళ్లమ్మ "సిగ్గు నీకు లేకపోవచ్చు నాయనా, చూసేవాళ్లకి ఉంటుందిగా, కాస్త లాగు చొక్కా వేసుకొని వెళ్ళు" అన్నదట వాళ్ళమ్మ. ఆవిడకి తెలుసు ఇంత పెద్ద కవియని. అలాగే 'అమృతం కురిసిన రాత్రి' వ్రాసినటువంటి తిలక్ గారు 'అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు నేనువచ్చి తలుపు తెరచి ఇల్లు విడచి ఎక్కడికో దూరంగా మైదానం లోకివెళ్ళి నిల్చుంటాను' అనే దానికి వాళ్లమ్మ 'పన్లేకపోతే సరి ఒంటరిగా అర్ధరాత్రి ఎక్కడికో పోయి నించోవడమెందుకు, అసలే ఆరోగ్యం అంతంత మాత్రం' అందట. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇట్లాంటివన్నీ కూడా ఎవరికివారం చదివి ఆనందించాలి. మనకి నవ్వు రాకుండా ఉండదు. కానీ వీళ్లందరూ అంటే ఇతనికి చాలా చాలా ఇష్టము. అందుకే వాళ్లందరి గురించి వ్రాయటమే కాకుండా, ఎలా వ్రాశారనేది కాకుండా, వాళ్ళ అమ్మలు ఎలా స్పందిస్తారు, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది వ్రాశారు.

అలాగే హాస్యజ్యోతి, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 1978 నుండి 1980 వరకు వ్రాశారు. ఇందులో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళ హాస్యమెలా ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. కొన్ని తను విన్నారు, కొన్ని ఎవరో చెబితే విన్నారు. అవన్నీ కూడా చిన్న చిన్న జోక్స్ లాగా హాస్యజ్యోతి లో ఆయన వ్రాయటం జరిగింది.

అట్లాగే ఆయన సృష్టించిన వెంకట సత్య స్టాలిన్ అనే క్యారక్టర్ గురించి ఇక్కడ తప్పక చెప్పుకోవాలి. వెంకట సత్య స్టాలిన్ అంటే నాకు కన్యాశుల్కంలో గిరీశమే గుర్తుకు వస్తారు. గిరీశానికి ప్రపంచంలో తెలియని విషయమంటూ లేదు. ఏదడిగినా కూడా చెప్తాడు. కచేరీలా నాకు తెల్సండి, జడ్జిగారు నన్ను పిలిచి అడిగారు. వాళ్లమ్మాయికి నేనే ట్యూషన్ చెప్పాను అంటాడు. నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అంటాడు గిరీశం. మనం ఈ వెంకట సత్య స్టాలిన్ మాటలు వింటూంటే నిజంగా మనకి ఎడ్యుకేషన్ వస్తుందనిపిస్తుంది. వీళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు. నాలుగు రోడ్ల కూడళ్ళలో గాని, మెకానిక్ షాపుల వద్ద గాని. ఒక పదిమంది కూడినదగ్గర వీళ్ళు తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్టాలిన్ ఎంత గొప్పవాడంటే, నేను మోతీలాల్ ని కలవడానికి వెళ్లాను. అప్పుడు చిన్నపిల్లవాడు, జవహర్ అనే పిల్లవాడు తోటలో ఆడుకుంటున్నాడు. నేను వెళ్ళి చక్కగా ఉన్నావని చెప్పి, అక్కడ ఉన్న గులాబీని తీసి అతని కోటుకు గ్రుచ్చాను. అప్పట్నుంచీ అతను తన కోటూకి గులాబీ గ్రుచ్చుకొంటూ ఉన్నాడు, అని చెప్తాడు ఒకదాంట్లో. ఇంకోదాంట్లో, ఇందు. ఇందు పాపం ఆడుకొంటూ ఉంది. ఎవరు ఈ ఇందు అంటే ఇందిరాగాంధీ. మొన్న విజయలక్ష్మీ, 16 ఏళ్ల చిన్నపిల్ల. బాగా వ్రాస్తోంది ఈ మధ్య. నాకు పంపించి సలహాలు అడిగింది, అంటాడు. ఎవరంటే విజయలక్ష్మీ పండిట్.  ఇంతేగాకుండా ఆర్మ్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్  చంద్రగ్రహం పైకి వెళ్ళేటప్పుడు, వాళ్లమ్మగారు భయపడుతూ, ఈయన్ని అర్జంటుగా పిలిపించి. ఏవండీ మా అబ్బాయి వెళ్తున్నాడు ఒంటరిగా, చంద్రలోకం లోకి, మీరు ఆశీర్వచనాలు ఇవ్వాలండీ అని కన్నీళ్లతో దండం పెట్టుకుందిట, అని చెప్తాడు ఈ వెంకట సత్య స్టాలిన్. అంటే ఈ ప్రపంచంలో ఈయనికి తెలియనివాళ్లు ఎవరూ లేరు, వాళ్లందరితోనూ ఇతనికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు. అంతకు ముందు అంటే మనకి స్వతంత్రం రాకముందు, అంటే గవర్నర్ జనరల్స్ కూడా, నిర్ణయాలు తీసికొనేటప్పుడు స్టాలిన్ ని పిలచి అభిప్రాయాలు అడుగుతూంటారుట.  అవన్నీ కూడా వ్రాసుకొచ్చాడు. అవి చూస్తూంటే, చాలా మంది గొప్పలు కొట్టు కొంటూంటారు చూశారా, వాళ్ళకి ప్రతినిధే ఈ వెంకట సత్య స్టాలిన్. అతను మాట్లాడేటటువంటి మాటలు కాలాలతో సంబంధం లేదు. 18 శతాబ్దానికి వెళ్తాడు, 19 వ శతాబ్దానికి వెళ్తాడు, ఈ తరంలోకి కూడా వస్తాడు. ఇటువంటి అద్భుతమైన క్యారక్టర్ ని సృష్టించారు ఈయన.

అంతే కాకుండా పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు మధురవాణి వస్తే ఎలా మాట్లాడుతుందో 'మిసిమి' పత్రికలో వ్రాసేవారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు మిసిమి పత్రికలో వ్రాస్తూన్న తరువాత చిట్టచివర ముగింపు చేసేటప్పుడు, అతను కన్యాశుల్కం లో మధురవాణి మాటలు ఇన్నాళ్లు వ్రాసేవారు కదా ఇప్పుడు మధురవాణి వచ్చి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో అని శ్రీ రమణగారిని అడిగితే స్పెషల్ గా వ్రాశారు. అది 'రచన' పత్రికలో వచ్చింది. అది రచన వాళ్ళు అడిగి మరీ వ్రాయించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ లో ఎట్టాగో మధురవాణే గెలుస్తుంది. సుబ్రహ్మణ్య శర్మగారు మధురవాణి ధాటికి తట్టుకోలేకపోతారు. అని అద్భుతంగా వ్రాశారు.

ఇక ఆయన కథల్లోకి వెళ్దాము. అతను నవ్వించి నవ్వించి హాస్యం తోనూ కళ్ళనీళ్లు తెప్పించగలరు. అలాగే కథల్లో హాస్యం ఉంటుంది కానీ, ఎక్కడో సెంటిమెంట్ చొప్పించి ఎక్కడో మనసు తడి అయి ఆ తడితో కళ్ళనీళ్లు తెప్పించేటట్లు వ్రాయగలరు. వాటిల్లో అద్భుతమైన కథ 'బంగారు మురుగు'. బంగారు మురుగు లో బామ్మగారికి తన మనుమడంటే చాలా ఇష్టం. ఆమె 10 ఏళ్ల వయసులో పెళ్లయినపుడు ఒక బాదం చెట్టుని తెచ్చుకొని వాళ్లింటిముందు నాటుతుంది. ఆ బాదం చెట్టు పెద్దదయిపోతుంది. ఆమెకు మనుమడు పుట్టినప్పుడు ఆ చెట్టు దగ్గరికి తీసుకొని పోయి అనేకమయిన కథలు చెప్తూంటే, ఈ పిల్లవాడికి  ఆ బామ్మంటే ఒక పెద్ద అండ. బామ్మ తనకు తోడుగా ఉందని చాలా ధైర్యంగా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటారు. కానీ, బామ్మ దగ్గరకొచ్చి అతను అన్నీ అడుగుతూ ఉంటాడు. చేగోడీలు గుర్తున్నాయా మనకు. పీచు మిఠాయిలు గుర్తున్నాయా, జీళ్ళు గుర్తున్నాయా? మొత్తం నేటివిటీ. తెలుగువారి నేటివిటీ అంతా కూడా శ్రీరమణ గారి పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈయన గ్రామీణ వాతావరణంలో పెరిగారు. ఆ వరాహపుర అగ్రహారములో ఉన్న అందరితోటి అతనికి స్నేహం ఉంది. అన్నీ వృత్తులవారితోటి స్నేహం ఉంది. అందరూ ఎలా మాట్లాడతారో, వారి మాండలికం ఏమిటి? వారి యాస ఏమిటి? పట్టుకొని ఆయన కథల్లో చెప్పారు తప్ప, ఆయన మీద ఏదో ముద్ర వేసేసి, ఇద్దరు వర్గాలలో ఒక వర్గానికే చెందినవారని చెప్పడం చాలా తప్పు.

బంగారుమురుగులో ఆ బామ్మ ఎంత సనాతన ధర్మం కలిగినటువంటి, ప్రాచీన ఆలోచనలతోటి ఉంటుంది కానీ, ఒక వైపున ఆమెకి మనవడంటే విపరీతమయినటువంటి ప్రేమే కాకుండా, అనాచారంగా చేస్తున్నటువంటి ఈ ఆచారవంతులు అంతే ఇష్టం ఉండదు. మేము ఆచారవంతులం, మాకు అన్నీ తెలుసు, మేము అరిషడ్వర్గాలను జయించేశాము, మేము వేదాలన్నీ పఠించాము, ఉపనిషత్తులన్నీ పఠించాము అని బేకారి పనులు చేసేటువంటి దౌర్జన్యాలు గాని, ఆ పటాటోపమ్ ముందు శిష్యులు, వెనుక శిష్యులు, ఒక పల్లకీ లాంటి దాంట్లో రావడము, సింహాసనంలోకూర్చోవడము, ప్రసాదాలు ఇవ్వడము లాంటివి ఆమెకు చిరాకుగా ఉండేది. కానీ, ఈ బామ్మ కొడుకు కోడలికి కొంచము గురువులంటే ఇష్టం. కాబట్టి వాళ్ళని తరచూ పిలిపించి చాలా డబ్బులు బాగా ఖర్చు పెట్టడం చేసేవారు. ఒక గురువుగారు వచ్చారంటే ఊరు ఊరు అంతా వస్తారు కాబట్టి, వారికి ఫలహారాలు, భోజనాలు వంటివి అన్నీ ఏర్పాటు చేయాలి. బామ్మగారికి ఇవన్నీ నచ్చవు. కానీ కొడుకుల ఇష్టంకదాని ఊరుకొంది. కానీ ఒకరోజు గురువుగారు వచ్చినపుడు, పిల్లవారందరూ శుచిగా వచ్చి ప్రసాదం కోసం చేయి చాస్తే, ఈ పిల్లవాడు ఏమీ తెలియక నాకో.. ప్రసాదం అని అడుగుతాడు ఒంటిమీద చొక్కాతోటి వచ్చి. గురువుగారి వద్దకు ఒంటిమీద బట్టలతో వచ్చి ప్రసాదం అడగటం అనేది చాలా అపచారము. చొక్కాతోటి వచ్చి ప్రసాదం అడుగుతావా? అని అక్కడున్న సాంప్రదాయవాదులు, గురువుగారు కన్నెర్ర చేసి, ఆ పిల్లవాడికి బట్టలు విప్పేసి నగ్నంగా అక్కడ నించో పెడతారు. ఎందుకంటే అపచారం చేసేశాడు. అప్పటివరకూ ఊరుకొన్న తండ్రి ఆ పిల్లవాడ్ని ప్రక్కకు తీసికెళ్ళి, బాగా కొడతాడు. అప్పుడు బామ్మ వచ్చి 'ఒరేయ్ దీక్షితులు, ఇటురా' అని పిలుస్తుంది. అతను గురువుగారి ప్రధాన శిష్యుడు. ఏమిటి అరిషడ్వర్గాలను జయించేది, భగవద్గీతను వర్లిస్తే లాభం లేదు. దాన్లోని సారాన్ని తెలుసుకోవాలి. అని చెప్పి, నేను చెప్పేను అని చెప్పు మీ గురువుకి, గురువుగారి శాపాలు నన్నేమీచేయవు. అప్పాలుమీద, అరిసెలుమీద ప్రేమ వాదులుకోలేనివారు, మరి అరిషడ్వర్గాలను ఏమి వదులుకుంటారు? అని అంటుంది.. అంటే మనకు బామ్మలో ఎంత సనాతన ధర్మముందో, అంతగా మనవడి నే కాదు, ఊర్లో మనుషులందర్నీ ప్రేమిస్తుంది ఆవిడ. ఆమెలో ఒక అద్భుతమైన ప్రేమ మూర్తిని చూస్తాము. అయితే పిల్లవాడు పెరిగి పెద్దయిన తరువాత, పెళ్ళి చేయాలనుకొన్నప్పుడు, సొంత కూతురు వచ్చి తన కూతుర్ని ఇస్తానంటే, మేనరికం వద్దని, ఆమె ఇంట్లో ఒక గృహిణిగా ఇమడలేదని చెప్పి, సొంత కూతురు కూతుర్ని కూడా వద్దంటుంది. తరువాత చిన్నప్పుడు పాఠాలు చెప్పిన నరసింహం మాష్టారు, ఒక సంబంధం తీసుకు వస్తే,(ఆ అమ్మాయి పేరు గాయత్రి) చాలా చక్కగా ఉంది, కళగా ఉంది, పెద్ద అందం కాకపోయినా, అలాగే చాలా చక్కగా వినయంగా అన్ని పనులు చేసుకునేటట్టుంది అని, ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకో అని చెప్తుంది. సరే, పెద్దవాళ్లు, పెద్దవాళ్లు మాట్లాడుకొనేటప్పుడు, వాళ్ళకి మూడుకాసులు బంగారం పెట్టాలని అడుగుతారు. ఇంట్లో ఆస్తులన్నీ గురువులకు ఆర్పణం చేశాక, ఇంటిలో డబ్బులేమీ లేవు. అప్పుడు, ఈమె చేతికి ఒక అందమైన లావుపాటి మురుగు ఉంది. అది చాలా ఖరీదు చేస్తుందని అందరికీ తెలుసు. ఆ మురుగు ఎవ్వరికీ ఇవ్వదు. ఆమె కూతురి కళ్ళు కూడా ఆ మురుగు మీదనే ఉంటాయి. ఎన్ని సార్లు అడిగినా సొంత కూతురికి కూడా ఇవ్వదు, ఆ బంగారు మురుగు. అందరి కళ్ళూ ఆ మురుగుపైనే ఉంటాయి.

తరువాత పెళ్ళి అయినపుడు, ఈ అబ్బాయి ఏమీ నిర్ణయించుకోలేకపోతాడు. ఏమి చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో, మనవడి దగ్గరికి వస్తుంది ఆ 80 ఏళ్ల బామ్మ. వచ్చి, నాయనా దాంపత్యమంటే ఏమో కాదు. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకొంటే, నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకొంటే, ఆ పిల్ల నోరు పండాలి. అంత అన్యోన్యంగా ఉండాలి దాంపత్యం అని చెబుతుంది. అంటే, ఇక్కడ బామ్మ అద్వైతం చెబుతోందా, తెలిసి చెబుతోందా, తెలియక చెబుతోందా? భార్యా భర్తలు ఇద్దరు వేరుకాదు, ఒకటిగా ఉండాలి అని చెబుతోంది. అలాగే ఆమె తత్వం ఏమిటంటే , నాది అనుకొంటే దుఃఖం. కాదు అనుకొంటే సుఖం.  ఇంతకు మించి భగవద్గీతలో ఏమీ లేదుకదా?

అలా కొన్నాళ్లకి, ఆ బామ్మ 90 ఏళ్ల వయసులో చనిపోయింది. అందరూ వచ్చి ఆ మురుగు తీసి, అమ్ముదామని కంసాలి వద్దకు తేసికెళ్ళి చూస్తే, అది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. ఏమయిందంటే, పెళ్లప్పుడు కాస్త బంగారం ఇవ్వాలి కదా ఆడపిల్లకి అని చెప్పారు కదా! అప్పుడు మంచి సంబంధం చెడిపోతుందనే ఉద్దేశ్యముతో, ఆ బంగారు మురుగు అమ్మేసి, ఈ రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటుంది. ఇది చేసిన వారు ఆ మాష్టారు గారు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి ద్వారా అందరికీ తెలిసింది. నాయనా నేనెక్కడికీ వెళ్లను. మళ్ళీ నీకు కూతురుగా పుట్టి, ఈ ఇంటికే వస్తాను అంటుంది. అతను కళ్ళ నీళ్ళతో, ఆమె వస్తుంది, గాయత్రి కడుపునే పుడుతుంది. ఆ బంగారం మురుగు నేనే చేయిస్తాను అనుకొంటాడు.

ఇంత అద్భుతమైన బామ్మని చూస్తూంటే, ఆమె చాదస్తంగా ఉండొచ్చు. కాకపోతే మనవడు అడిగాడని తన దగ్గర ఉన్న డబ్బంతా జీళ్ళకు, పీచు మిఠాయిలకే ఖర్చు పెట్టడమే కాకుండా, పూజా మందిరంలో ఉన్న కంచు గంటను కూడా తాకట్టు పెట్టేస్తుంది. అయితే, ఆమెకు పూజ, దేముడు అందరూ ఉన్నారు? కానీ, ఎక్కడ ఉన్నాడు దేముడు? కంచు గంటలో లేడు, చిన్నారి పిల్లవాడి బొజ్జలో ఉన్నారు అంటుంది.

దానికి మర్నాడు కొడుకు, కోడలు వచ్చి, నువ్వు దేముడి మందిరంలో ఉన్న కంచు గంటను కూడా అమ్మేశావా? అనుకుంటారు. ఇది ఎలా తెలిసింది అంటే, ఒకనాడు ఐస్ ఫ్రూట్స్ అమ్మే అబ్బాయి వచ్చి, అమ్మ నాకు గంట ఇచ్చారు. ఇంకా నేను ఆమెకు కొంత డబ్బులు ఇవ్వాలి. అందు నిమిత్తము ఈ జీళ్ళు, పీచు మిఠాయిలు తీసుకోండి అని అతనొచ్చి చెప్పాడు. అది తెలిసి కొడుకు అడిగితే 'దేముడు ఎక్కడో లేడు, చిన్నారి పిల్లవాడి బొజ్జలో ఉన్నాడు' అంటుంది. మరి ఈమె తెలిసి మాట్లాడుతోందో లేక తెలియక మాట్లాడుతోందో తెలియదు. అంత ప్రేమ స్వరూపమైన బామ్మని ఈ బంగారు మురుగు కథలో మరచిపోలేము.

అలాగే ఇంకొక అద్భుతమైన కథ. వరహాల బావి. ఒక పల్లెటూరులో అందరూ అంటే, అన్నీ కులాలవారు, మతాలవారు కలసి మెలసి బతుకుటూ ఉంటారు. ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది, అక్కడకు బ్రాహ్మలందరూ వెల్తూంటారు. ఆ ప్రక్కనే ఒక దర్గా ఉంది, అక్కడకు ముస్లిమ్స్ అందరూ వెల్తూంటారు. ఆ మధ్యలో ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు దగ్గర వరహాలమ్మ అనే ఆవిడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉంది. ఆమె ఎక్కడ్నుంచి వచ్చిందో, ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆవిడ ఊర్లో అందరికీ తల్లో నాలుకలా ఉంది. ఎవరింట్లో ఏ పని పడినా ఆమె వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. చక్కగా ఆడపిల్లలందరికీ గోరింటాకు పెడుతుంది. పూలజడలు అల్లుతుంది. రోజూ ప్రొద్దున్నే రాట్నం వాడుకుటూ ఉంటుంది. ఆ రాట్నం తోనే ప్రజలందరూ లేస్తారు, తమ తమ పనులు చేసుకుంటారు. ఆమెకు ఉండే మరో స్పెషల్ ఏమిటంటే, కంట్లో నలక పడితే చాలా చులాగ్గా తీసివేస్తుంది. ఇది మనం వినలేదు కానీ పల్లెటూళ్ళల్లో ఉంది ఉంటుంది. నాలుకపై తేనె చుక్కను వేసుకొని, కళ్ళు బాగా తెరచి ఆ నలకను తీసేస్తుందిట. ఒకరోజు పన్నులు వసూలు చేద్దామని ముస్లిం జాగీద్దారు గారు వస్తారు. అన్నీ ఊర్లల్లో పన్నులు వసూలు చేసికొంటూ, ఈ ఊరు వచ్చేసరికి ఆయన కంట్లో నలక పడుతుంది. ఆ నలకకు ఆయన చాలా బాధ పడుతూ ఉంటే, ఆ పరివారమంతా చాలా కంగారు పడుతూ ఉంటారు. అనుకోకుండా ఆ రావిచెట్టు దగ్గరికి వచ్చినపుడు, ఆయనను ఏమయింది నాయనా యని అడుగుతుంది. నలక పడిన విషయం తెలుసుకొని, ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళి, నాలుకపై తేనె చుక్క వేసుకొని ఆ నలకను తీసివేయగా, ఆయన కృతజ్ఞతగా తన తలపాగాను ఆమె పాదాల వద్ద ఉంచి, తన రొంటిలో నుంచి ఒక బంగారు వరహాల మూటను ఆమెకి ఇచ్చి, కాళ్ళకు మ్రొక్కి వెళ్లిపోతారు. ఈ విషయం అందరికీ తెలిసి, ఆహా మన వరహాలమ్మ ఎంతగొప్పది. జాగీద్దారు కంట్లో నలక తీసేసిందని అనుకుంటారు. అలా ఉండగా రాట్నం చప్పుడు ఒకరోజు ఉదయం వినబడలేదు. ఏమయిందని చెప్పి ఊర్లో వారందరూ చూస్తే, రాట్నం మీద ఒరిగి ఉంటుంది వరహాలమ్మ. అయ్యో అయ్యో వెళ్ళిపోయిందని సానుభూతి పవనాలు వీచీనా, జాగీద్దారు గారు ఇచ్చిన వరహాల మూట కోసం వెదుకుతున్నారు. ఎక్కడా దొరకదు. త్రవ్వటం మొదలు పెట్టారు. అలా త్రవ్వుతూ ఉండగా, ఆ బంగారు నాణేల మూట దొరుకుతుంది. అప్పుడు మాకు దొరికిందంటే, మాకు దొరికిందనే వాదులాటలో, అంతవరకు లేని మతాల సమస్య మొదలయింది. ఆ ఊరికి ఉన్నది ఒక్కటే, నీటి సమస్య. ఆ ఊర్లో బావిలేదు. నీరు పడదు. నీటి ఎద్దడి వచ్చినపుడు చాలా చాలా దూరం వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊర్లో ఒక గాజులబత్తు ఉంటాడు. అతను అందరి ఇళ్ళకీ వెళ్ళి అందరికీ గాజులు వేస్తూ ఉంటాడు. ఎప్పుడయితే, ఆ ధనం బయట పడిందో, అప్పుడు కులాలు,మతాల గొడవ ప్రారంభమయి, మా శివాలయం దగ్గర దొరికాయి కాబట్టి మావి అన్నారు హిందువులు. మా ముస్లిం జాగీద్దారు ఇచ్చేడు కాబట్టి మావి అంటారు ముస్లింలు. అలా ఇరువర్గాలు కొట్లాడుకొంటూ, కర్రలు పైకి లేచే సమయానికి, అప్పటిదాకా త్రవ్విన ఆ గుంటలోంచి జల బయటకు వచ్చింది. ఏమిటి నీళ్ళు వస్తున్నాయి అని రుచి చూస్తే, అవి మామూలు రుచిగా లేవు. కొబ్బరి నీళ్లంత రుచిగా ఉన్నాయి. అప్పుడు, ఆ ఊరి కరణం గారు, అక్కడి పంతులుగారికి చెప్తారు. కొట్లాడుకోవద్దు, మన ఊరికి ఉన్న సమస్య నీరే కదా! ఈ డబ్బులతోటి ఇక్కడ ఒక పెద్ద చప్టా కట్టిద్దామని ప్రతిపాదన చేస్తారు. ఆ విషయానికి అందరూ సంతోషించి, అందరూ కలిశారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సామగ్రి తెచ్చుకొని ఒక పెద్ద బావిని కట్టించుకున్నారు. ఆ బావి అంటే అందరికీ ప్రాణం. ఎందుకంటే అందరికీ ప్రాణాధారమైన మంచినీటిని ఇస్తోందిగా! చివరికి ఏమయిందంటే, ఆ ఊర్లో ఏ శుభకార్యమయినా ఆ బావి దగ్గరికి వచ్చి దండం పెట్టుకోని, ఆమెకు మ్రొక్కులు చెల్లిచుకుంటూ వెళ్లుతూ ఉంటారు. ఆఖరికి, ఆ ఊరు ఎదంటే, వరాలమ్మ బావి ఉన్న ఊరు అనే పేరు వచ్చేసింది. ఇక్కడితో ఈ కథ అయిపోతే ఒక మంచి కథ అయి ఉండేది. అయితే మనుషుల యొక్క మనస్తత్వాలు చెప్పే శ్రీరమణ గారు, కొన్నాళ్లయిన తరువాత ఒకరోజు, ఒక హిందువు ఆవును తోలుకొంటూ వచ్చాడు. అది అక్కడ ఉన్న ఒక పెద్ద తొట్టి వద్దకు నీళ్ళు త్రాగాలని వచ్చింది. అప్పుడు ఒక ముస్లిం (ఖాసిం) ఒక గుర్రాన్ని అక్కడకు తీసుకు వస్తాడు. రెండూ ఒకేసారి త్రాగాలని ప్రయత్నించి నపుడు, ఒకదాని తల ఒకటి కొట్టుకున్నాయి. అవి బాగానే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏయ్ అంటే ఏయ్ అని మాటలు రెచ్చిపోయాయి. అలా ఒక తగాదా మొదలై మరల కర్రలు లేచాయి. మళ్ళీ కొట్లాట మొదలైంది. ఇంతలో ఈ గాజుల బట్టు వచ్చాడు. అంతకుముందు ఒక చిన్న తాబేలుని ఆ బావిలో వేశాడు. అది ఆ నీళ్ళలో చాలా పెద్దదయింది. ఆ తాబేలుని చూసేందుకు పిల్లలందరు ఆ బావి దగ్గరకు వస్తారు. ఇంతలో ఆ తగాదా చాలా పెద్దదయి, హిందూ, ముస్లిం కొట్లాటగా మారి, ఆ ఊరువారే కాదు, ప్రక్క ఊరికి ప్రాకి వారుకూడా వస్తారు. ఎంత సముదాయించినా ఎవ్వరూ తగ్గరు. ఇలా ఉండగా ఆగండ్రా, ఆగండ్రా, కొట్టుకో వద్దంటూ ఆ గాజులబట్టు బావిలో దూకేస్తాడు. అతనికి ఎవ్వరూ లేరు పెళ్ళి కూడా అవలేదు. అప్పుడు మరల అందరిలో మానవత్వం లేస్తుంది. కష్టం వచ్చినపుడు మనుషులందరూ కలుస్తారు. ధనం చూసినపుడు స్వార్ధం వస్తుంది అనుకొంటారు. అందరూ త్రాళ్లు, నిచ్చెనలు వేసి, లోపలికి దిగి మొత్తం మీద కష్టబడి ఆ గాజులబట్టుని బయటకు తీసుకువచ్చారు. చెంపలు వేసుకున్నారు. ఈ వరాహాల బావి మనందరిదీ అనుకొన్నారు. మనుషుల్లో స్వార్ధం లేకపోతే, ఐకమత్యంగా ఉంటే సహాయకారి అనే సందేశంతో ఈ అద్భుతమైన కథ ముగుస్తుంది.

తరువాత నాలుగో ఎకరం. ఈ కథ చిట్ట చివర రచన, విహంగ వీక్షణం సంపుటి కోసం ప్రత్యేకంగా వ్రాశారు. 2019 లో, ఇదే శ్రీరమణ గారి చివరి కథ కావచ్చు. అప్పటికి మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా వచ్చేసింది. వ్యాపార ధరలు బాగా పెరిగిపోయాయి. అప్పటివరకు పొలము అంటే  అందరికీ అన్నం పెట్టేటటువంటిది. భూమాత అనే భక్తి ఉంది రైతు అనే వాడు పొలాన్ని ప్రాణంగా చూసుకొంటూ ఉండేవాడు. తరతరాల వారసత్వ సంపదగా, వ్యవసాయం పట్ల, భూదేవి పట్ల చాలా సంతోషంగా ఉండేవారు. రాఘవయ్య అనే అద్భుతమైన క్యారక్టర్. వారి కుమారుడు సాంబశివరావు, అతని స్నేహితుడు కూడా ఆ దగ్గర్లో గల ఊర్లో కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు. అయితే సాంబశివరావు అక్కడ జూనియర్ కాలేజీ లో పని చేయలేక నేను మా ఊరు వెళ్లిపోతాను, నాకు మా ఊరు మీద బెంగగా ఉంది అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. రాఘవయ్యకు మంచి ఎద్దులు ఉండేవి, అవి వ్యవసాయానికె కాకుండా, సంక్రాంతికి ఎద్దుల పోటీలో వాటికి ప్రతీ సారీ బహుమతి వస్తూనే ఉంటుంది. అలా ప్రథమ బహుమతి వచ్చే వాటికి వెండి కోణాలు పాదాలకు వేసేవారు. అటువంటి సందర్భములో, విలువలుతో కూడిన రాఘవయ్య దగ్గర ఉండి ఒక నాగలిని దుంపను కూడా చెక్కిస్తాడు. ఇక్కడ శ్రీరమణ గారు తన పల్లెటూరి వాసనలను పోగొట్టుకో లేదు. ఆయన పల్లెటూరిలో గల అన్నీ వృత్తులవారి గురించి చక్కగా పరిశీలించి వ్రాసేవారు. మానవత్వాలని, మానవ సంబంధాలని, మనుషులమధ్య జరుగుతున్న సంభాషణలని పట్టుకొనే వారు, ఆయన జ్ఞాపకాల్లో పల్లెటూరు ఉన్నది. అతనికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఆయన చనిపోయేటప్పుడు చాలా మంది వ్రాశారు. ఎప్పుడో చూసిన నన్ను ఎటువంటి భేషజము లేకుండా చాలా చక్కగా పలుకరించేవారని. ఆయనకు పల్లెటూర్లో అన్నివిషయాలు తెలుసు. నాగలి చెక్కేటువంటి విధానం చెబుతారు. నాగలి దుంపను చెక్కటామంటే మాటలా? ఓదేముణ్ణి చెక్కడమే. అంటే నాగలి దేముడు. నిజమేగా, నాగలి లేకపోతే, పొలం దున్నకపోతే, పంట ఎలావస్తుంది. ఇప్పటి ఈ కంప్యూటర్ యుగం వాళ్ళకి అన్నం బియ్యం ద్వారా వసుందని తెలుసు కానీ, దాని వెనుక రైతుపడే కష్టం గూర్చి తెలియదు. ట్రాక్టర్ రావడం మంచి పనికి అని అనుకుంటున్నాము గాని, ఇది రాక ముందు రైతుకు నాగలితో పొలం దున్నడమే చాలా ఇష్టం. పొలాన్ని దున్నేతప్పుడు పొందే ఆనందం ఈ ట్రాక్టర్ల వల్ల పొందలేము. అలాగే రాఘవయ్య అనే ఆయన పిల్లలకి ఎంతో మంచి చెబుతూ ఉండేవాడు. ఆయన సాంబశివరావు అనే కొడుకు తోటి, సాంబా, భూమ్మీదకి వచ్చాక కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతోడికి కొన్ని బాకీలుంటాయి. వాటిని తీర్చాల. ఎగేయ్యకూడదయ్యా. ఎంతైనా మనం మనుషులం కదా! అన్న మాటల్లో చాలా సత్యం ఉంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. మనకి అందరికీ తెలుసు గత 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బాగా పుంజుకొని, దాని వల్ల కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నాయని, అయితే పచ్చని పంటలు పండే పొలాలు దేవలప్మెంట్కి ఇచ్చేసి, పెద్ద పెద్ద భవంతులు లేస్తున్నాయని. ఇంత ఆనందంగా సాగుతున్న సమయంలో, ఈ ఊరు మీద ఒక కార్పొరేట్ కళ్ళు పడ్డాయి. వారు వచ్చి పొలం కొంటామంటే, సంవత్సరం మొత్తం వ్యవసాయం చేసి అరా కోరా మిగలటమో లేక అప్పులపాలవటమో అయ్యే ఈ రైతులకి లక్షలు కోట్లు ఇస్తామంటే సహజంగానే ఆశ పుడుతుంది. అందరూ ఈ లక్షల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలా అలా ఈ మాటలు సాంబశివరావు చెవిన పడ్డాయి. అప్పుడు నాన్న వద్దకు వచ్చి, నాన్నా మనం కూడా ఈ పొలాన్ని డెవలప్ మెంటుకి ఇచ్చేద్దాము అని. ఆ కార్పొరేట్ కంపెనీ వారు, మేము డబ్బులు ఇవ్వడమే కాదు, ఇక్కడ కంపెనీలు, రెసిడెన్షియల్ కాలేజీలు పెడతాము, మీ పిల్లలు ఇక్కడనే చదువుకోవచ్చు. అలాగే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పరుస్తాము. దీనివల్ల పల్లెలు పట్టణీకరణకు దారి తీస్తాయి. దీనివల్ల పెద్దలకు ఇష్టం ఉండకపోవచ్చు గాని, పిల్లలకి ఆశ పుట్టి ఆకర్షితులు అవుతున్నారు. ఆ విధంగానే సాంబశివరావు కూడా నాన్నతో చెబుతాడు. వీలకున్నది నాలుగు ఎకరాలు. అందులో మూడు ఎకరాలు, తాకట్టు పెట్టి కూతురుకి వచ్చిన అమెరికా సంబంధాన్ని చేస్తాడు. అలా కొన్నాళ్లకి, రాఘవయ్య ఆ అమ్మాయికి చెబుతాడు, అమ్మా ఈ అప్పు నేను తీర్చలేను. ఈ 3 ఎకరాలు ఎంతకో కొంతకు అమ్మేయి లేదా నువ్వే తెసేసికో అని మాటయితే ఇచ్చాడు. ఆ మాట మమతల అడుగున పడిపోయింది. తరువాత ఈ కార్పొరేట్ వారి కళ్ళు ఈ పొలం మీద పడటమే కాకుండా మొత్తం వివరాల చిట్టా తీసేశారు. అలా అమెరికాలో ఉన్న ఆ అమ్మాయి కుటుంబం మొత్తాన్ని అక్కడికి రప్పించారు. ఆ నాలుగు ఎకరాలు కొట్టేయాలని. వారు వచ్చారు. ఆ నాలుగు ఏకరాలకి ఐదు కోట్లు, అన్నీ ఖర్చులు ఫోను ఇస్తామని చెప్పారు. నాలుగు ఏకరాలకి ఐదు కోట్లా!  అని అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళే ఆ అమ్మాయిని కారులో ఆ ఊరుకి తీసుకు వచ్చి, వాళ్ళ అమ్మాయి వోణి పంక్షన్ కూడా మేమే గ్రాండ్ గా  జరిపిస్తామని చెప్పి, జరిపిస్తారు. ఇలా అందరూ డబ్బు మాయలో పడి పరుగులు తీస్తున్న సమయంలో, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని, నాన్నా మూడు ఎకరాలు నాకిచ్చేస్తానని అన్నావు, అది ఎలాగో నాదే, అయితే ఆ నాలుగో ఎకరం ఏంచేస్తావని అడుగుతుంది. ఆ మాటకు రాఘవయ్య ఆశ్చర్యపోతాడు. రాత్రంతా ఆలోచిస్తాడు. కొడుకుని పిలుస్తాడు. నాయనా, ఆ మూడు ఎకరాలు ఎలాగో చెల్లివే, ఈ నాలుగో ఎకరం నీకు, నాకు, చెల్లికి మూడు భాగాలు చెయ్యాలి, అంటాడు. ఇది నాలుగో ఎకరం కథ.

దీన్లో మనుషుల మనస్తత్వాలు, ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చాక, మనం పంటలు పండే పొలాలను ఎలా ఇచ్చేసుకుంటున్నాము, అంతేకాకుండా మనుషుల మధ్య మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి, డబ్బే రాజ్యం ఎలుతోంది అన్నమాట, మానవ సంబంధాలను డబ్బుకి ఖరీదు కడుతున్నాము అనే అద్భుతమైన కథ.

ధనలక్ష్మి కథ: ధనలక్ష్మి ఆ ఊర్లో చిన్న పాప, మూడో క్లాస్ చదువుతూ ఉంది. వాళ్ళ నాన్న ఈశ్వరయ్య. అతనికి అనారోగ్యం వలన, ఇవాళో, రేపో కాలం చేస్తానని అనుకోని ఆ అమ్మాయిని చుట్టాలు అయిన రామాంజనేయులు అనే వాడిని దత్తు తీసికొని, వాళ్ళ బామ్మరిది అయిన వీరాంజనేయులు అనేవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. వాళ్ళకి బాగా డబ్బు ఉన్నది. కానీ ఈశ్వరయ్య తేరుకొని బ్రతుకుతాడు. ఈ లోపున ఈ అబ్బాయి ఎనిమిదవ క్లాస్ లో ఉన్నప్పుడు కోడిగ్రుడ్డును చూపించి, దీన్నేమంటారు అని మాస్టారు అడిగితే,  పైన పెంకు, లోపల కోడిపిల్ల అని చెబుతాడు. అప్పుడు మాష్టారు బెంచ్ పై నిలబెడతారు. (వీరాంజనేయులుకి చదువు ఎక్కువ రాదు). ఆ సమయంలో ఆ ధనలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, వీరాంజనేయులూ, నాకు పెన్సిల్ కావాలి అని అడుగుతుంది. దాంతో అవమానం పాలై చదువు మానేసి ఇంటికి వెళ్లిపోతాడు. తరువాత కొన్నాళ్లకి వీళ్ళ ఆస్తులన్నీ కరిగి పోతాయి. ధనలక్ష్మి ధైర్యంగా, ఒక చిన్న పిండిమర పెట్టుకుంటుంది. ఆ మరలోంచి మెల్లమెల్లగా పొడులన్నీ వేయడం మొదలు పెట్టి, అమ్మడం మొదలు పెడుతుంది. తరువాత పట్నం నుంచి అలా అలా సరుకులు తేవడం, వాటిని అమ్మడం ద్వారా, మెల్ల మెల్లగా ఆ వ్యాపారాన్ని వృధ్ధి చేసి, ఎదరగా ఉన్న స్థలాన్ని కొని, ఇల్లు మీద ఇల్లు వేసి, ఖాళీ స్థలాన్ని కొని ఒక గోడౌన్ కూడా నిర్మాణం చేస్తుంది. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు, భర్త తెలివైన వాడు కానప్పుడు, ఈ అమ్మాయి చదువు రాకపోయినా, చాలా అద్భుతంగా ఆ కుటుంబాన్ని ఎలా లాక్కువచ్చింది. ఈ కథ ఎందుకు నచ్చుతుందంటే, ఒక స్త్రీ తనకాళ్ళ మీద తను నిలబడి పాతాళలోకానికి వెళ్లిన తమ ఆర్ధిక పరిస్థితిని ఎలా తెలివితేటలతో పైకి తీసుకు వచ్చింది.

ఇక "షోడానాయుడు" అనే కథలో షోడానాయుడు ఆ ఊళ్ళో షోడాలు అమ్ముతూ ఉంటాడు. బాల్యం లో మగ పిల్లలు అందరూ గోలీలు సేకరించుకొంటూ ఉంటారు. ఎన్ని గోలీలు ఉన్నా నీలం రంగు గోలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే ఒక అబ్బాయి గోలీల కోసం ఈ నాయుడు వెనుక పడడం, ఇతను కసురుకోవడం జరుగుతూ ఉంటే, ఆ అబ్బాయిని చదువుకోసం పట్నం పంపించడం, ఆ తరువాతి కాలంలో ఆ అబ్బాయి ఉపాధి కల్పనా ఆఫీసర్ గా ఆ ఊరు రావడం, అతను ఏర్పాటు చేసిన మీటింగ్ కి  షోడానాయుడు లోను కోసం రావడం, బెరుగ్గా కూర్చొని జేబు తడుముకోవడం, వారం తరువాత కనబడమని చెప్పడం, డోర్ తీసుకొని అతను వెళ్ళే సమయంలో డోర్ తగిలి ఆ జేబులోంచి ఈ అబ్బాయి కోసం తెచ్చిన గోలీలు క్రింద పడడం, షోడానాయుడు పారిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్ చిన్న పిల్లాడిలా కుర్చీలోంచి వచ్చి ఆ గోలీలు ఏరుకోవడం, అందులో నీలం గోలీ దొరకడం, దాన్ని తీసుకొని ఆప్యాయంగా గుండెకు హత్తుకుంటాడు. షోడానాయుడూ నిన్ను చిన్నప్పుడు నీలం గోలి అడగడం గుర్తుంది అన్న మాట అంటాడు. అప్పుడు షోడానాయుడు అతని సంస్కారానికి మనసులోనే నమస్కారాలు అర్పించుకుంటాడు. అంటే మనిషి ఎంత పెద్ద వాడయినా, బాల్యాన్ని మరచిపోలేడు అని చెప్పే ఒక అద్భుతమైన కథ.

ముఖ్యంగా చెప్పవలసినది మిథునం కథ. చదివిన వాళ్ళు చదివారు. చదవని వారి కోసం తనికెళ్ల భరణి గారు అద్భుతంగా సినిమా తీశారు. ఇందులో అప్పదాసు క్యారక్టర్ తనే వేయాలనుకున్నారో, LB శ్రీరాం చేత వెయిద్దామనుకొన్నారో, చివరకు SP బాల సుబ్రహ్మణ్యం కరెక్ట్ అనుకొని అతని చేత వేయించారు. హీరోయిన్ కి చాలా మందిని అనుకోని, లక్స్మి చేత వేయించారు. ఈ అద్భుతమైన సినిమా చాలా విజయాలు చూసింది. ఇక్కడ నేను కథ చెప్పను. మిథునం సాధించిన చాలా విజయాలు ఉన్నాయి. అవి చాలా మందికి తెలియక పోవచ్చు. 1997 లో మిథునం కథ వ్రాశారు. అది బాపు గారికి పంపించారు. బాపు - రమణలు మద్రాసు తీసుకొనిపోయి చాలా కాలం వారివద్దే పెట్టుకున్నారు. శ్రీరమణ గారు వారి సినిమాల్లో చాలా పనులు చేశారు. సహ డైరక్టర్ గా కూడా చేశారు. చాలా కాలం మద్రాసు లో ఉండి రచనల కోసం హైదరాబాద్ వచ్చేశారు. బాపు గారు ఎంత బాగుందని చెప్పాలో అతనికి తోచలేదు. చివరికి 28 పేజీలలో తన స్వదస్తూరితో వ్రాసి మరల ఆ కథని రమణ గారికి పంపించారు. రమణ గారు చాలా ఆనంద పడ్డారు. బాపూ గారు దీనికి కస్తూరి తిలకం అని పేరు పెట్టారు. ఈ కథ 1997 ఆగస్టులో ఆంధ్రభూమి పత్రికలో నాలుగు వారాలు ప్రచురించారు. 1998 అక్టోబరు లో ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు దీపావళి ప్రత్యేక సంచికలో, మళ్ళీ బాపూ గారి చేతివ్రాతతో ప్రచురించారు. అలా మరల రెండు సార్లు బాపు గారి వ్రాతతో దస్తూరి తిలకం గా ప్రచురించారు. బాపు గారి చేతి వ్రాతతో గల ఈ పుస్తకాన్ని అమెరికాలో గల జంపాల చౌదరి గారికి పంపించి నపుడు ఆయన కొన్ని వేల ప్రతులు వేశారుట. ఇదిచాలా ప్రాచుర్యం లోకి వచ్చింది. అమెరికాలో అయితే ఏ ఫంక్షన్ లో నయినా, ఈ పుస్తకాలు తెప్పించుకోవడం, ముఖ్యంగా షష్టి పూర్తి సమయాలలో పంచిపెట్టుకోవడం జరిగేది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఇది జంపాన చౌదరి గారు దీనిపై విశ్లేషణ తోటి ఆన్ లైన్ లో పెట్టారుట. 1999 లో కథలో మిథునం అనువాదాన్ని చదివి ముచ్చట పడ్డ సుప్రసిధ్ధ మలయాళ దర్శకుడు MT వాసుదేవన్ నాయర్ ఈ కథ ఆధారంగా 9 ఏళ్ల విరామం తరువాత సినిమా తీయాలనుకొన్నారు. తరువాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా ప్రచురించిన తెలుగు కథ 1997 సంకలనంలో ఆ ఏటి ఉత్తమ కథల్లో మిథునం కూడా నిలబడింది. 2000 సంవత్సరంలో MT వాసుదేవన్ నాయర్ దర్శకత్వంలో 'ఒరుచెరు పుంజరి ' అంటే చిన్న చిరునవ్వు అనే పేరుతో మలయాళం లో సినిమా నిర్మించారు. 2001 లో జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ (అంటే ఇక్కడ ఇద్దరు భార్యా భర్తల కథ కాదు. వాళ్ళోక అద్భుతమైన తోటని పెంచుతారు. ఆవుని పెంచుతారు.) అవార్డు కూడా వచ్చింది. కేరళ ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చింది. అంతకంటే గౌరవము ఏమిటంటే ఈ చిత్రం పతాక సన్నివేశాన్ని 9వ తరగతి విద్యార్థులకు(కేరళలో) పర్యావరణ టెక్స్ట్ బుక్ లో పెట్టారుట. రచన పత్రికలో 1999 లో ప్రచురింప బడిన ఈ కథకు దువ్వూరి శారాదాంబ బహుమతిని ఇచ్చారు. ఆ కథలను కథా మహి పేరున ప్రచురించారు. 2001 లో నవోదయ పుబ్లికేషర్స్ వారు రమణ గారి మిథునం 8 కథల సంపుటిగా ప్రచురించారు. ఆ నవోదయ వారే ఇప్పటికీ 8 సార్లు ప్రచురించారు. 2006 మే లో మళ్ళీ రచన పత్రిక, బాపు దస్తూరితో ఉన్న కథను ప్రత్యేక సంచికగా వేశారు. ఇలా అనేకమంది రిటర్న్ గిఫ్ట్లు గా కూడా ఇవ్వడం జరిగింది. తరువాత దీన్ని 2011 లో K చంద్రనాథ్, KK మహాపాత్ర  ఆంగ్లంలోకి అనువదించారు. 2011లో వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా రచన సాయి ఒకే ఒక్క మిథునం (బాపు దస్తూరితో ఉన్నది) అనే పేరుతోటి శ్రీ రమణ, జంపాల చౌదరి, వసుంధర వారి ముందు మాటలతో ప్రచురించారు. అది అదే సమయంలో 20 వేల కాపీలు అమ్ముడు పోయాయి. 2011 లో ప్రసిధ్ధ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు దర్శకత్వంలో, ముయినం ఆనందరావు నిర్మాతగా తెలుగులో చిత్రాన్ని నిర్మించారు. ఇది 2012 లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు తో తృతీయ ఉత్తమ చిత్రంగా బహుమతిని గెలుచుకొంది. అప్పదాసు పాత్ర ధరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కి, బుచ్చి లక్ష్మి పాత్ర ధరించిన లక్ష్మికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు కూడా వచ్చాయి. తనికెళ్ల భరణి ఉత్తమ సంభాషణా రచయితగా కూడా అవార్డు దీంట్లో పొందారు. ఈ కథని తమిళం లోకి కూడా అనువదించారు. రేడియో నాటికగా కూడా వచ్చింది. ఈ విధంగా మిథునం కథకి చాలా విశేషాలు ఉన్నాయి.

ఈ విధంగా శ్రీరమణ గారు కథా రచయితగా, పేరడీ రచయితగా, హాస్య రచయితగా, అనేక కాలమ్స్ చేసిన రచయితగా మన తెలుగువారి గుండెల్లో ఉంటారు. ఎందుకంటే తెలుగు నేటివిటీ, సహజత్వాన్నీ అతను ఎక్కడా కోల్పోలేదు. గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల్లో ఉన్న సహజత్వాన్ని తన కథల్లో చెప్పారు. ఇతని సంభాషణాల్లో ఒక విధమైన చురుకుదనం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇటువంటి శ్రీరమణ గారు జూలై 19, 2023 న మరణించారు.  అనేక మండి ఆయన స్మృతికి రచనలు కూడా చేశారు.

అటువంటి ఆయన గూర్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వీక్షణం వారికి ముఖ్యంగా డా.కె.గీత గారికి , విన్నవారికి ధన్యవాదాలు" అని ఆమె ప్రసంగాన్ని ముగించారు.

సుశీలమ్మ గారి ప్రసంగాన్ని ఒక రోల్ మోడల్ గా శ్రీ మృత్యుంజయుడు గారు అభివర్ణించి, ఆమె కథను వివరించిన తీరుకు, ప్రసంగ ధాటికి, రమణగారి వైవిధ్యమైన నాలుగు కథల సారం విశ్లేషణకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డాక్టర్ గీత గారిని కోరారు. గీత గారు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు.

తరువాత, జూలై 23 కవితా పురస్కార గ్రహీతగా శ్రీమతి పి ధనమ్మ రెడ్డి గారు ఎన్నికయినట్లు ప్రకటించారు. ఆమె వ్రాసిన 'మౌనం నాతో మాట్లాడింది' అనే కవితకు గాను ఈ పురస్కారం లభించినట్లు డా.గీత గారు సభకు తెలియజేశారు. తదుపరి కవిసమ్మేళనం ప్రారంభించారు.

ఈ కవి సమ్మేళనం లో అనేకమంది తమ తమ కవితలు వినిపించారు. ఇందులో రావెలపురుషోత్తమరావు, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, గౌరీపతి శాస్త్రి కె వి ఎస్(వీరవతి), ఆకుమళ్ల కృష్ణదాస్, మోటూరి నారాయణరావు, మేడిశెట్టి యోగేశ్వరరావు, పిళ్ళా వెంకట రమణమూర్తి, డాక్టర్ ఎం. ఎన్. బృంద, ప్రసాదరావు రామాయణం, చిట్టాబత్తిన వీరరాఘవులు, జోషి మధుసూదన శర్మ, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, ధనమ్మ రెడ్డి పి, అమృత వల్లి అవధానం, పత్తి సుమతి, దామరాజు విశాలాక్షి, ఆళ్ళ నాగేశ్వరరావు, డా.భమిడిమఱ్ఱి కమలాదేవి, విజయలక్ష్మి మల్కని, కొండూరు పోతన్న, డాక్టర్ సంధ్యారాణి కొండబత్తిని, డా బల్లూరి ఉమాదేవి, సి హెచ్ సాయిజ్యోతి, కలివే నాగేశ్వర రావు, కె పోతన్న, మాధురి ఇంగువ, డి వి ఆర్ మూర్తి మొదలైన వారు పాల్గొని సభను విజయవంతం చేశారు.

అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in September 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!