Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 117 వ సమావేశం
-- కొప్పర్తి రాంబాబు --
vikshanam-117

వీక్షణం 117 వ  సాహితీ  సమావేశం అంతర్జాలం ద్వారా మే 15, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ నాటి సమావేశాన్ని నిర్వహించిన డా.కె.గీతామాధవి గారు అమెరికాలో చిరకాలంగా నివసిస్తూ తెలుగు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లో ప్రముఖంగా, క్రియాశీలకంగా ఉంటూ వీక్షణం సాహితీ సమావేశాల్ని గత పదేళ్లుగా నిర్వహిస్తున్నారు.

ముందుగా గీతగారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారిని సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ, సభాధ్యక్షులుగా వ్యవహరించ వలసిందిగా కోరడంతో సమావేశం ప్రారంభం అయ్యింది. అధ్యక్షుని తొలి పలుకులుగా శ్రీ చిట్టెన్ రాజు గారు తమ సహజ హాస్య ధోరణిలో మాట్లాడారు. అమెరికా తెలుగు కథలు ప్రచురించడం మొదలు పెట్టి ఆ తర్వాత వాటిని డయాస్పోరా కథలుగా ఎందుకు పేర్కొనాల్సి వచ్చింది, అసలు డయాస్పోరా అనే మాట ఎలా పుట్టింది, అది సాహిత్యంలోకి ప్రవేశించాక ఏ విధమైన భావనగా మారింది అంటూ వివరంగా చెప్పుకొచ్చారు. తెలుగు డయాస్పోరా కథలు అంటే కేవలం అమెరికాలో స్థిర పడ్డ తెలుగు రచయితల కథలు మాత్రమే కాకుండా తక్కిన విదేశాల్లో, స్థిరపడిన రచయితల కథలు కూడా కలిపి ప్రచురించాలని అనుకోవడానికి గల కారణాలను,డయాస్పోరా అనే మాట చుట్టూ వివరిస్తూ సోదాహరణంగా మాట్లాడారు.

అధ్యక్షుని తొలి పలుకులు ముగిశాక సమావేశ నిర్వాహకురాలు డాక్టర్ కె.గీత గారు, ప్రధాన వక్త శ్రీ ఏ. కె.ప్రభాకర్ గారిని సభకు పరిచయం చేశారు.

శ్రీ ఏ. కె.ప్రభాకర్ గారు ప్రముఖ సాహిత్య విమర్శకులు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏడేళ్లపాటు సంస్కృతం, తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ, జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం , బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు, 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు.

తరువాత ప్రధాన వక్త శ్రీ ఏ కె.ప్రభాకర్ గారు తమ సుదీర్ఘ ఉపన్యాసంలో డయాస్పోరా పదం తెలుగు కథా సాహిత్యంలో ప్రవేశించిన సమయం సందర్భం నుంచి ప్రారంభించి ఇటీవల వెలువడిన డయాస్పోరా తెలుగు కథానిక 2021 లోని కథల్లో ప్రస్తావించబడిన అనేకానేక విషయాలను, విపులంగా చర్చించారు.ఆయా కథలను ప్రస్తావిస్తూ  వాటిలోని అంశాలను అమెరికా జీవన నేపథ్యం , భారత దేశంలోని పరిస్థితులు రెండిటినీ ప్రస్తావిస్తూ సమీక్షించారు.

డయాస్పోరా కథా సంకలనంలో మూడవ వంతు కథలు మాత్రమే తనను ఆకర్షించాయి అనీ , కథానికా రచనలో ఇంకా ప్రమాణాలు పెరగ వలసి ఉంది అని అభిప్రాయపడ్డారు. డయాస్పోరా కథలకు ఎంచుకునే కథాంశాలు అమెరికా లోని నిత్య జీవన అంశాలు అయిఉండాలి అని , ఆ విధంగా కె.గీత గారి సిలికాన్ లోయ సాక్షిగా పూర్తిగా అమెరికా స్థానిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ, కొత్తగా అమెరికా వచ్చిన వారు అమెరికన్ సమాజాన్ని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి అన్నారు. అమెరికా డయాస్పోరా కథలు తెలుగు కథకి చేర్పు కావాలి అన్నారు.

డయాస్పోరా కథలు అంటే దేశం బయట ఉండే తెలుగు వారు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రం నుంచి వలస వెళ్లి బయటి రాష్ట్రాలలో పాదు కొలుపు కున్న వారు వారి ప్రాంతీయ తెలుగు యాసలో, భాషలో రాసిన కథలు కూడా డయాస్పోరా కథలు అవుతాయి అనీ, అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల నించి వలస వెళ్లిన రచయితలు వారి ప్రాంతీయ మాండలికం కూడా కథా రచనలో వాడితే బావుంటుంది అన్నారు.

ప్రపంచంలో వలస వెళ్లిన జాతి యూదులు అనుకుంటే వారిదే మొదటి డయాస్పోరా చరిత్ర గా భావించాలి అన్నారు.ఇక తెలుగువారి వలస గురించి డయాస్పోరా జీవితాలు గురించి ఆలోచిస్తే దేశాన్ని వదిలి వెళ్లిన వారు, రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన వారు కూడా ఒక వేదనకు గురి అవుతారు అనీ, ఆ వేదన, చేతన కింద పరిణమిస్తుంది అని చెప్పారు.

ఆ తరవాత జరిగిన విస్తృత చర్చలో శ్రీ దాసరి అమరేంద్ర, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ తిరుమలాచార్యులు, శ్రీ ప్రసాదరావు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి కొండపల్లి నీహారిణి, శ్రీ కొప్పర్తి రాంబాబు, శ్రీమతి దశిక శ్యామలాదేవి, శ్రీ లెనిన్ అన్నే, శ్రీ రాజశేఖరం మొ.న వారందరూ పాల్గొన్నారు.

సమావేశం చివరిలో "కవితా పఠనం" జరిగింది. ఇందులో శ్రీ శ్రీధర్ రెడ్డి"కలవరం" అనే కవితని, శ్రీమతి కొండపల్లి నీహారిణి "కలలు"అనే కవితని , డా.కె.గీత "అబార్షన్ మా జన్మహక్కు" అంటూ అమెరికాలోని అబార్షన్ హక్కుల ఉద్యమం గురించి కవితల్ని వినిపించారు.

చివరగా గీత గారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది. స్థానిక సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

Posted in June 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!