Menu Close
"వీక్షణం" సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 11వ వార్షికోత్సవం
-- సుభద్ర ద్రోణంరాజు & వరూధిని --
vikshanam-11-Anniversary-01

సెప్టెంబరు 9/10, 2023 తేదీలలో ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం 11 వ వార్షికోత్సవాన్ని అంతర్జాలంలోనూ, అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లోనూ అట్టహాసంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమాలను వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి ఆహ్వానం పలికి ప్రారంభించారు. ముందుగా ఆన్లైన్ సమావేశంలో వీక్షణం ఆవిర్భావ వికాసాలను గురించి తెలియజేస్తూ-

"గత ఏడాది కాలంగా వీక్షణం అంతర్జాతీయ సాహితీ వేదిక అయ్యింది. ఆన్ లైనులోనూ, ముఖతః సమావేశాలు నడపడానికి తమ వంతు సహాయం చేస్తూ, చేయూతనిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. ఈ వీక్షణం సాహితీ వేదిక స్థాపనకు అంకురార్పణ ఎలా జరిగిందో ముందు వివరిస్తాను. చిన్నతనం నించి సృజనాత్మక రచనలు చెయ్యడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం అలవాటైన నాకు అమెరికా వచ్చాక నేను అప్పటివరకు నా చుట్టూ ఉన్న సాహిత్య వాతావరణాన్ని కోల్పోయేను. సాహిత్యానికంటూ ఒక వేదిక లేకపోవడం ఒక లోటుగా అనిపించేది. రాయాలనే స్ఫూర్తి అడుగంటిపోతూ ఉండేది. అందుకోసం ఏమైనా ఎవరైనా చేస్తే బావుణ్ణని ఎప్పుడూ అనుకునేదాన్ని. అనుకోకుండా 2012లో ఒకానొక సాయంత్రం ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. వెంటనే దాదాపు 30 మందితో చర్చించి, మొదటగా వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో “వీక్షణం” పేరుతో మొదటి సమావేశాన్ని 2012 సెప్టెంబరు 9 వ తారీఖున జరుపుకున్నాం. ఇక ఆగకుండా నెలనెలా రెండవ ఆదివారం నాడు కొనసాగుతూనే ఉంది వీక్షణం. ఈవేళ వీక్షణంలో ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా సభ్యులున్నారు.

కేవలం నాలోను, నా చుట్టూ ఉన్నవారిలోను సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకునే వేదికగా మాత్రమే కాకుండా, ఉచితంగా, స్వచ్చందంగా సమావేశాలు జరపాలనే ఉన్నతమైన లక్ష్యంతో కొనసాగుతూ ఉంది వీక్షణం. ఆ లక్ష్యమే వీక్షణంలో అందరినీ ఒక కుటుంబంగా చేసింది. విరాళాలు లేకుండా జరుపుకునే ఈ సమావేశాలు నిజానికి ఒక విజయవంతమైన ప్రయోగం. ఈ ప్రయత్నంలో నాకు ఎంతగానో సహకరించిన కాలిఫోర్నియా రచయితలు, సాహిత్యాభిలాషులందరికీ సభాముఖంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

“వీక్షణం - సాహితీ గవాక్షం” అని మనందరం పిలుచుకునే ఈ వేదికలో లక్ష్మీపార్వతిగారు, గొల్లపూడి మారుతీరావుగారు, సుద్దాల అశోక్ తేజగారు, కాత్యాయనీ విద్మహేగారు, పాపినేని శివశంకర్ గారు, చుక్కా రామయ్య గారు వంటి ఎందరో ప్రముఖులు ప్రసంగించారు. 2021లో ఘనంగా జరిగిన 100 వ సమావేశం జరుపుకున్నాం. అందులో ప్రపంచ వ్యాప్త ప్రముఖులైన  డా|| జంపాల చౌదరి గారు, వంగూరి చిట్టెన్ రాజు గారు, శ్రీ కె.రత్నకుమార్ గారు, శ్రీ సాంస్కృతిక కళాసారధి  (సింగపూర్) , శ్రీ రావు కొంచాడ గారు, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఆస్ట్రేలియా), - తెలుగుతల్లి పత్రికా నిర్వాహకులు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు (కెనడా),  శ్రీ కిరణ్ ప్రభ గారు వంటి ఎందరో ప్రసంగించారు. అన్నివేదికల్లో దాదాపు100మందికి పైగా పాల్గొన్నారు.

అలాగే ప్రతి సమావేశం ఒక క్రమమైన అనుక్రమణికతో జరుగుతుంది. ప్రధాన ప్రసంగం, కవిసమ్మేళనం, చర్చ వంటివి భాగాలుగా ఉంటాయి. వీక్షణం బ్లాగులో, ఫేస్ బుక్ పేజీలో నెలనెలా సమావేశాలు, వివరాలు పొందుపరచబడతాయి. నెలనెలా వీక్షణం కవితల పోటీలు నిర్వ్హహించబడతాయి. సంవత్సరానికొకసారి వీక్షణం వార్షిక ప్రత్యేక సంచిక ప్రచురింపడుతుంది.

వీక్షణం ఛానెల్ లో సమావేశాల వీడియోలు పొందుపరచబడుతున్నాయి. నెలనెలా వీక్షణం సమావేశ సమీక్షలు స్థానిక పత్రికలైన కౌముది, సిరిమల్లెలలో ముద్రింపబడతాయి. ఇలా ఒక చక్కటి కార్యాచరణతో ఇప్పటివరకు 132 సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా గడిచాయి.

అయితే నాకు నేనుగా ఇదంతా చెయ్యడానికి, ఆసక్తి కోల్పోకుండా ఇటువంటి వేదికని నడపడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, ఎంత శ్రమ పడాల్సి వస్తుందో తెలిసింది. అన్నిటికంటే విలువైన సమయం వెచ్చించడంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చెయ్యాలో అర్థమైంది. అయితే అది గొప్ప ఆనందాన్నిచ్చే శ్రమ. అత్యంత ఆత్మీయమైన బాధ్యత. ఈవేళ నాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప సహృదయులు, ఆత్మీయులు ఉన్నారు అంటే అది కేవలం వీక్షణం వల్లే. నాతో బాటూ అడుగడుగునా సహకరిస్తూ వీక్షణం విజయానికి తోడ్పడుతున్న మిత్రులందరికీ మరోసారి పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నాను." అని కృతజ్ఞతలతో ముగించారు.

తరువాత అంతర్జాల కార్యక్రమంలో శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఆత్మీయవాక్యాలు పలికారు. మృత్యుంజయుడు తాటిపాములగారు వీక్షణం సభ్యుడిగా మొదటి నించీ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు గత ఏడాది కాలంగా వీక్షణం సమావేశాల అనుభవాలను, ఈ ప్రత్యేక సమావేశ ఏర్పాట్ల విశేషాలను పంచుకున్నారు.

విశిష్ట అతిథిగా వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు విచ్చేసి, ప్రసంగించారు."గీతమ్మా" అంటూ ఆత్మీయంగా సంబోధిస్తూ ఇటువంటి వేదికలను క్రమం తప్పకుండా నడపడంలో ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వివరించారు. వీక్షణం ఇంకా ఎన్నో వార్షిక సమావేశాల్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ముగించారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు "తెలుగుసాహిత్య సౌరభం" అనే అంశం మీద ప్రసంగిస్తూ నన్నయ కాలం నుండి నాయకరాజుల కాలం వరకూ సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. వరుసగా నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాధుడు, పోతన, కృష్ణదేవరాయలు, వారి ఆస్థానకవులైన పెద్దన, నంది తిమ్మన, రామకృష్ణ కవి మొ.న అష్టదిగ్గజాలు, నాయకరాజుల కాలంలో తాను పరిశోధన చేసిన కందుకూరి రుద్రకవి సాహిత్యం గురించి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందిస్తూ చక్కని ప్రసంగాన్ని అందించారు.

ప్రొ.కొలకలూరి మధుజ్యోతి గారు "ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ చిత్రణ" అనే అంశం మీద వివరణాత్మక ప్రసంగం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారి నించి మొదలుకొని స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, కొలకలూరి ఇనాక్ గారు మొ.న ఎందరో రచయితల రచనల్ని, భండారు అచ్చమాంబ మొదలుకుని ఆధునిక స్త్రీవాద సాహిత్యం వరకూ కథలు, నవలల్ని సోదాహరణంగా వివరిస్తూ ఉధృత ప్రవాహంలా అద్భుతమైన ప్రసంగం చేశారు.

తరువాత డా.సంధ్యారాణి కొండబత్తిని కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో వసీరా, డా.కె.గీత, శ్రీధర్ రెడ్డి బిల్లా, ఉషా శ్రీదేవి శ్రీధర, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, దేవి గాయత్రి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, మేడిశెట్టి యోగేశ్వరరావు, అమృతవల్లి అవధానం, మామిళ్ల లోకనాధం, నారోజు వెంకటరమణ, డాక్టర్ మోటూరి నారాయణరావు, ప్రసాదరావు రామాయణం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, డబ్బీరు వెంకట రమణమూర్తి, మన్నె లలిత మొ.న వారు పాల్గొని కవితాగానం చేసారు.

చివరగా జరిగిన సమాపనోత్సవంలో ప్రత్యేక అతిథులుగా యు.కె నించి శ్రీ రాజేష్ తోలేటి గారు, ఫ్రాన్స్ నించి శ్రీ వెంకట కృష్ణ మాదాసు గార్లు పాల్గొని తమ ఆత్మీయ సందేశాలనందించారు. తమ దేశాల్లో సాహిత్య కార్యక్రమాలు జరుపుకొందుకు వీక్షణం తమకు మార్గదర్శిగా నిలుస్తూ, మంచి ప్రోత్సాహాన్నిచ్చిందని అన్నారు.

vikshanam-11-Anniversary-02

ఇక ఆదివారం సెప్టెంబరు,10 నాడు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో స్వాగత్ హోటల్లో రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవాన్ని డా.కె.గీత గారు నిర్వహించారు. డా.కె.గీత ఆహ్వాన ప్రసంగం తరువాత ముఖ్య అతిథులుగా సిరిమల్లె అంతర్జాల మాస పత్రిక సంపాదకులు డా. మధు బుడమగుంట గారు, శ్రీ చిమటా శ్రీనివాస్ గారు, శ్రీ కిరణ్ ప్రభ గార్లు ప్రసంగాలు చేశారు.

డా.మధు బుడమగుంట గారు "మన సాహిత్యం మన చేతిలో" అనే అంశం మీద ప్రసంగిస్తూ మాతృభాషలో సాహిత్య సృజన చేస్తే జీవం ఉట్టిపడుతూ ఉంటుందన్నారు. మనం మనంగానే మిగిలిన రోజు మానసిక పరిణతి పొంది మనోల్లాసం తో మెదడు చురుకుగా పనిచేసి మనలోని సాహితీ పిపాసి బయటకు వచ్చి మన ఆలోచనల ఉధృతి ని పెంచి అన్నింటా మెరుగైన అక్షరక్రమాన్ని మనకు అందించడం జరుగుతుంది. మనలోని మానసిక పరిపక్వత ను గుర్తించిన నాడు, మనలోని స్వార్థ చింతన తరిగిపోయి సహజమైన మానవత్వ పోకడలు కనబడతాయి. అప్పుడు మాతృభాష మాధుర్యాన్ని ఉగ్గుపాలతో చవిచూసిన మనవంటి భాషా ప్రేమికులకు భాషా సాహిత్య పరిరక్షణ పెద్ద విషయం కాదు. మన బాధ్యత ను గుర్తెరిగి విధిని నిర్వహించడమే అని సెలవిచ్చారు. అలాగే తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తూ మన భాషలోని అనేక ప్రత్యేకాంశాలను పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సాహిత్యం రూపుదిద్దుకునే క్రమాన్ని వివరిస్తూ ముగించారు.

తరువాత శ్రీ చిమటా శ్రీనివాస్ "తెలుగు సినిమా పాటల్లోని మంచి సాహిత్యం" గురించి మాట్లాడుతూ తొలితరం రచనల నించి ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల వరకూ వివరించారు. 1931 లోని భక్తప్రహ్లాద లోని కేశవదాసు, సముద్రాల, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ , మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆత్రేయ మున్నగు వారి పాటల్లోని విశేషాల్ని వివరిస్తూ, చక్కగా రాగయుక్తంగా పాడుతూ సభలోని వారందరినీ అలరించారు.

తరువాత వీక్షణం 11 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ వేణు ఆసూరి, డా.మధు బుడమగుంట, శ్రీ చిమటా శ్రీనివాస్ గార్ల  చేతుల మీదుగా జరిగాయి.

వెనువెంటనే శ్రీ వేణు ఆసూరి కవితాసంపుటి “తరంగాలు” పుస్తకావిష్కరణని  శ్రీ సుభాష్ పెద్దు నిర్వహించారు. ప్రశ్నోత్తర పరంపరగా సాగిన పుస్తక పరిచయం కొత్తగా, విశేషంగా జరిగింది. వేణుగారు స్వేచ్ఛ, సౌందర్యం, అమ్మ గురించిన కవితల్ని గురించి వివరించారు. గీతగారు అప్పటికప్పుడు వేణుగారి కవిత "కలలుకను-కలలుకను" కి రాగం కట్టి అలవోకగా పాడి వినిపించి అందరినీ అలరించారు.

భోజన విరామం తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవిత విశేషాల్ని, గొప్ప తనాన్ని వివరించి అందర్నీ ఆకట్టుకున్నారు. కేవలం వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమకారునిగా, తెలుగు భాష సరళీకృత కర్తగా అందరికీ తెలిసిన రామ్మూర్తి పంతులు గారి నిజజీవితంలోని వాస్తవికతను వివరించారు. అందరికీ తెలియని ఎన్నో విషయాలను, రామ్మూర్తి పంతులు గారు స్వీయ ఆసక్తితో, సొంత ఖర్చుతో సవరభాషకు చేసిన విశిష్ట సేవని చక్కగా వివరించారు.

తరువాత శ్రీ ఎ.కె. ప్రభాకర్ గారు నిర్వహించిన కథా చర్చలో శ్రీ కె.వి. రమణారావు , శ్రీమతి తురగా జయశ్యామల, డా.కె.గీత, కుమారి అమూల్య, శ్రీ విద్యార్థి మొ.న వారు పాల్గొన్నారు. గీతగారు రచన సామాజిక బాధ్యత అంటూ, డయాస్పోరా కథల పరిణామం, రచయితల బాధ్యతల్ని వివరించారు. జయశ్యామలగారు, కె.వి. రమణారావు గారు, విద్యార్థి గారు కథా రచయితల నేపథ్యం, కథా వస్తువు, కథా ప్రయోజనం మొ.న అంశాల మీద మాట్లాడేరు. ఇప్పటి కొత్త తరానికి చెందిన యువతి అమూల్య తనకు తెలిసిన తెలుగు సాహిత్యం పట్ల తన అభిప్రాయాల్ని, తన రచనానుభవాల్ని వివరించింది.

చివరిగా శ్రీ వంశీ ప్రఖ్యా గారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక ప్రముఖ కవులు శ్రీమతి షంషాద్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా.కె.గీత, శ్రీ ఎ.కె. ప్రభాకర్, శ్రీ వేణు ఆసూరి మున్నగువారు పాల్గొన్నారు.

ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సభల సందర్భంగా అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, అతిథులకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

కిందటి ఏడాది నించి ప్రపంచ వ్యాప్తమైన "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, నెలనెలా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ, ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతూ విజయవంతంగా 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశాల వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

  1. మిల్పిటాస్, కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యక్ష సమావేశ వీడియోలు:-
    పార్ట్-1: https://youtube.com/live/ceG5lZPhdkU?feature=share
    పార్ట్-2 : https://youtube.com/live/j6aIG1AbIio?feature=share
  2. ఆన్ లైన్ సమావేశవీడియో:- https://youtube.com/live/XgXLLoqHpHM?feature=share
Posted in October 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!