Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 119 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-119

వీక్షణం-119వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా జూలై 10, 2022 న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది.

ఈ సమావేశంలో ముందుగా "కథ ప్రయోజనం" అనే అంశం మీద డా.కే.వి.రమణరావు గారు ప్రసంగించారు.

ముందుగా కథ లక్షణాల గురించి ప్రస్తావిస్తూ కథ లక్షణాల్లో ముఖ్యమైంది ప్రయోజనం. కథలు కొన్ని ప్రయోజనం కోసం రాస్తారు. కొన్ని పెద్దగా ప్రయోజనం ఆశించకుండా రాస్తుంటారు. కాలక్షేపానికి రాసేవి. ఉదా: డిటెక్టివ్, హాస్య రచనలు వంటివి.

ప్రయోజనాన్ని ఆశించి రాసే వాటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కోసారి ప్రయోజనం అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రయోజనం పాక్షికంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రయోజనం పక్కదారి పడుతుంది. ఉదా: మూఢనమ్మకాన్ని నిర్మూలించడానికి రాసింది మూఢనమ్మకాన్ని పెంచొచ్చు.

కథకి తాత్కాలిక ప్రయోజనం, శాశ్వత ప్రయోజనం అనేవి ఉంటాయి. ఉదాహరణకి కోవిడ్ కథలు, యుద్ధానికి సంబంధించిన మొ.వి తాత్కాలిక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.

దార్శినికతతో రాసేవి కొన్ని. ఉదా: ఉత్తమ సమాజం కోసం రాసేవి. దార్శినికతలో అనులోమం, విలోమం అనే రకాలు ఉన్నాయి.

అసతోమా, తమసోమా, మృత్యోర్మా .. లలో కూడా ప్రయోజనం ఉంది. సంఘం శరణం గచ్చామి అన్నదాంట్లో కూడా ప్రయోజనం స్పష్టంగా సూచించబడింది.

కథ ప్రయోజన పరిణామం అనేది చూస్తే ప్రయోజనం ఎందుకు ఆశిస్తాం అనేదే పరిణామం. ఉదా: సామాజిక అసమానతలు రూపొందించడం. రైతుల ఋణమాఫీ వంటివి.

కథా ప్రయోజనం లో వివిధ మార్గాలు ఏవిటి అనేవి చూస్తే ముందుగా దిద్దుబాటు గురించి చెప్పుకోవాలి. వస్తువు, శిల్పం, ప్రయోజనం లో సరైనది దిద్దుబాటు కాబట్టే ఇప్పటికీ దాని స్థానం మారలేదు.

కథల్లో వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి వ్యక్తి లో మార్పులు, సమాజం లో మార్పులను ఉద్దేశించినవి.

వ్యక్తి లో మార్పు, సమాజం లో మార్పు, లేదా రెండిటిలోనూ మార్పులను ఉద్దేశించినవి మరి కొన్ని. ఇందులో మళ్లీ చాలా రకాలు ఉన్నాయి. సంప్రదాయాన్ని ఆశించి రాసేవి. ఇవి మళ్లీ భక్తి, జ్ఞానం, ధర్మం, మోక్షం అనే రకాలు .

ధర్మం కోసం రాసిన వాటికి ఉదాహరణగా విశ్వనాథ వెయ్యిపడగల్ని చెప్పుకోవచ్చు. సంప్రదాయ ధర్మాన్ని తిరిగి నెలకొల్పడం కోసం రాసింది వెయ్యిపడగలు.

సామాజిక చైతన్యం తర్వాతది. గురజాడ ఇందుకు ఉదాహరణ. గురజాడకు మార్క్స్ తెలియకపోయినా ఆయన భావజాలం అటువంటిది. ఆయన చూపు మరో వెయ్యి సంవత్సరాల తర్వాత వరకు ప్రసరించగలది. ఉదా: "ఆధునిక స్త్రీ చరిత్రని తిరగరాస్తుంది", "మంచి గతమున కొంచమేనోయ్" వంటివి.

నాస్తిక ప్రయోజనం కలిగినవి కొన్ని. చాసో, కారా, రావిశాస్త్రి, కేతు విశ్వనాథ రెడ్డి మొ.న వారు రాసిన కథలందుకు ఉదాహరణలు.

ప్రేమ గురించి రాసిన వారు చలం. వ్యక్తి చైతన్యం, తాత్విక, దార్శినిక ధోరణులతో రాసిన వారు బుచ్చిబాబు, గోపీచంద్, చండీదాస్.

తర్వాత మార్క్సిస్టు వాదం, సైన్సుతో కూడిన లిబరల్ వాదం,  దళిత, స్త్రీ, మైనారిటీ లాంటి అస్తిత్వవాదాలు కూడా చెప్పుకోదగినవి. ఆధునికానంతర వాదం ఇప్పుడు నడుస్తున్నది. అంటూ ముగించారు.

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో డా.కె.గీత, శ్రీ ఆరి సీతారామయ్య , శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ అమరేంద్ర దాసరి, శ్రీ మల్లిఖార్జున దీక్షిత్, శ్రీ పొన్నాడ మూర్తి, శ్రీమతి దమయంతి, శ్రీ కొప్పర్తి రాంబాబు, శ్రీమతి ఉదయలక్ష్మి మొ.న వారు పాల్గొన్నారు.

స్థానిక సాహిత్యాభిలాషులు అత్యంత ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

విజయవంతంగా జరిగిన వీక్షణం-118వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.

Posted in August 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!