Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

గోబీ ఎడారి ప్రాంతం దాటుతూ ఉంది. వీరెక్కిన ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్. మధురపరిమళాలు వీరిని చుట్టుముట్టాయి. మనస్సు తేలికగా......ఏదో తెలియని తన్మయత్వంలో తేలిపోతున్నారు వారు. అరణ్య మార్గం గుండా పయనిస్తోంది వారి వాహనం.

టిబెట్ ను చైనా వాసులు షాంగ్రిల్లా అని పిలుస్తారు. పూర్వం త్రివిష్టపము, భూతల స్వర్గం అని టిబెట్ ని పిలిచేవారు. హిందీలో తిబ్బత్ అంటారు. అన్నాడు క్రేన్.

"ఏంటి మనం ఇప్పుడు ప్రపంచపు పైకప్పుకి వచ్చామా!" ఆశ్చర్యంగా అడిగాడు చరణ్.

"ఆ పరిసరాల్లో ఉన్నామని చెప్పా" అన్నాడు క్రేన్.

"ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాము?" అడిగాడు దినేష్.

"సిద్ధాశ్రమానికి" చెప్పాడు డింగూ.

"ఏం మమ్మల్ని సన్యాసుల్లో కలిపేద్దామనుకుంటున్నారా?" అనుమానంగా అడిగాడు దినేష్.

"ఎప్పటికైనా చేరాల్సినది అక్కడికే గా!" నవ్వుతూ అన్నాడు డింగూ.

"వద్దు....వద్దు మమ్మల్ని ఏ ఆశ్రమానికీ పంపొద్దు ...ఆ గురు సేవలు మేము చేయలేము." భయంగా అన్నాడు కౌషిక్.

"గురు సేవ చేయడం ఎంతో అదృష్టం. భయపడతావెందుకు?" అడిగాడు క్రేన్.

"మేం డబ్బులిచ్చి చదువులను కొనుక్కుంటున్నాం. అప్పటి వాళ్ళు డబ్బులు లేక గురువులకు పాదాలొత్తి, అడవికి వెళ్ళి కట్టెపుల్లలు ఏరుకొచ్చి వారు ఏ పనులు చెబితే ఆ పనులు  చేసేవారు. మేమలా చేయలేము. ఇంట్లోనే ఏ పనులూ చేయుము" అన్నాడు కౌషిక్.

"రాజుకొడుకులు కూడా ఆశ్రమాల్లోనే కదా! విద్య నేర్చుకునేది" అన్నాడు డింగూ.

"ఆ రోజులు వేరు ఈరోజులు వేరు. ఇప్పుడు టీచర్లు కొట్టినా ఓ మాటన్నా ఊరుకోరు. కేసు పెడతారు." అన్నాడు కౌషిక్.

"వినాశకాలే విపరీత బుద్ధి. ఆ చర్చలు ఇప్పుడు ప్రస్తుతం. సిద్దాశ్రమం అంటే గురుశిష్యులు ఉండే ప్రాంతం కాదు. అదో అద్భుతమైన ప్రదేశం. శాంతి ప్రదేశం. దివ్యచరితుల కొలువది. చర్మ చక్షువులకు కనిపించని ప్రదేశం. జ్ఞాన చక్షువులతో మాత్రమే చూసే దేవలోకం" చెప్పాడు మేథా.

"అంటే స్వర్గమా? మేము చచ్చిపోయామా?" అంటూ ఏడుపు మొదలు పెట్టాడు దినేష్.

"ఛీ ....ఆపు. అన్నింటికీ భయపడతావు ......ఏడుస్తావు....ఇప్పటి వరకు మనం ఎన్నో వింతలు చూసాం కదా! అందులో ఇది కూడా వొకటి. మేథా అంకుల్ ఈ ప్రాంతం గురించి మరికొన్ని వివరాలు చెప్పవా?" అడిగాడు చరణ్.

“నేను మిమ్మల్ని శంభాలా నగరానికి తీసుకువెళుతున్నా. యోగులు పుణ్యపురుషులు నివసించే స్థలం ఇది. దీనినే హిడెన్ సిటీ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్ అని, ది పర్మినెంట్ ల్యాండ్ అని పాశ్చాత్యులు అంటూ ఉంటారు.

ఇది రహస్య ప్రదేశం. *మర్మదేశం* ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఇది కైలాస శిఖరానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు 16 అడుగుల పొడవు కలిగి ఎంతో అందంగా ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ఇక్కడే పుట్టింది. భవిష్యత్తులో రాబోయే రోగాలకు కూడా మందులు అందులో రాయబడి ఉన్నాయి. వందల వేల మైళ్ళు విస్తరించి ఉన్న ఈ భూభాగాన్ని హిట్లర్ కూడా ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ వారికి బాధలు అనేవి తెలియవు. మన పురాణాలలో చెప్పబడిన చిరంజీవులు అందరూ ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడున్న వారు శారీరకంగా, మానసికంగా పర్ఫెక్ట్గా ఉంటారు. వీరు టైమ్ ట్రావెల్ కూడా చేయగలరు. ఇది ఎవరికీ కనపడకుండా మాయచే కప్పబడి ఉంటుంది. అందుకే నా సవారీకి కూడా ఇది దొరకదు." చెప్పాడు మేథా.

"బలే బలే మమ్మల్ని అక్కడ ఫోటోలు తీస్తారా అంకుల్. మేము మాలోకం వెళ్ళాక మా ఫ్రెండ్స్ కి చూపిస్తాము." అడిగాడు దినేష్.

"అలాంటి వేవీ అక్కడ పని చేయవు. అవి మీ కన్నుల కెమెరా లో బంధించి మనసులో భద్రపరుచుకోవాలి." నవ్వుతూ చెప్పాడు మేథా.

"పెద్ద పెద్ద గుళ్ళల్లోకి కూడా సెల్ ఫోన్ లు కెమెరాలు అలవ్ చెయ్యరు కదా!

విగ్రహాల దగ్గరికే అలవ్ చేయనప్పుడు ....నిజంగా దేవుళ్ళ దగ్గరికి ఎలా అలౌచేస్తారు." అన్నాడు చరణ్.

దూరంగా ఎనిమిది కొండలు పద్మరేకుల వలే కనిపిస్తున్నాయి. మధ్యలో స్పటిక శ్రీచక్రం తిరగబడి ఉంది.

******************

ఆమె ఎదురుగా ఓ పొడవాటి వ్యక్తి కనిపించాడు. అతని కళ్ళు వైలెట్ రంగులో మెరిసిపోతున్నాయి. ఆ కళ్ళలో ఏదో శక్తి శర్వాణి నోటిని నొక్కేసింది. అతని జుట్టు చాలా అందంగా ఉంది.

షడన్ గా అక్కడ ఆ వ్యక్తిని చూసిన డ్రాగన్ కూడా కంగుతిన్నాడు. వెంటనే తేరుకున్న డ్రాగన్ కళ్ళనుంచి నిప్పులు కురిపించాడు.

ఆ వచ్చిన వ్యక్తి కళ్ళు మూసి తెరిచాడు. అతని కళ్ళల్లో నుంచి చల్లని హిమ ఖండికలు వెలువడ్డాయి. అవి ఆ నిప్పులను చల్లార్చాయి.

ఇరువురి మధ్య హోరాహోరీన పోరు సాగింది. ఎదురు నిలవలేని డ్రాగన్ వెన్నుచూపించాడు.

ఆ పొడవాటి వ్యక్తి శార్వాణి వంక తిరిగి 'రా పోదాం' అన్నాడు.

"నువ్వు ఎవరు? నీ వెంట నేను ఎందుకు రావాలి?" అని ప్రశ్నించింది శార్వాణి.

"ఏం నేను ఎవరో చెప్తే గానీ రావా?" హూంకరింపు గా అడిగాడు ఆ వ్యక్తి.

"నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. తెలియని వారి వెంట వెళ్ళకూడదు కదా!" అంది శార్వాణి.

"ఓహో అలాగా ... మరి మేధా టీం తో మీకు అంతకుముందు పరిచయం ఉందా? వారితో మీరు ఎందుకు బయలుదేరినట్లు?" వ్యంగ్యంగా అడిగాడు ఆ వ్యక్తి.

"అప్పటి పరిస్థితులు అలాంటివి. అయినా మేథా చాలా మంచివాడు. మాకు ఎంతో విజ్ఞానాన్ని అందించాడు. తన మంచితనంతో మాకు ఆప్తుడయ్యాడు." అంది శార్వాణి.

"మరి అంత జ్ఞాని అయితే నిన్ను ఎందుకు ఇలా వదిలేసాడు?" అడిగాడు ఆ వ్యక్తి.

"నన్నేం వదలలేదు. ఆ డ్రాగన్ మేథా కన్నుగప్పి నన్ను ఎత్తుకొచ్చాడు." చెప్పింది శార్వాణి.

"సరే ఆ విషయం వదిలేసి ఇక్కడ ఆ డ్రాగన్ ఒక్కడే ఉన్నాడు అని అనుకుంటున్నావా?" అడిగాడు ఆ వ్యక్తి.

"లేదు ఇంకా ఉండే ఉంటారు" అంది శార్వాణి.

మరలాంటప్పుడు నీకు ప్రమాదం పొంచి ఉందా లేదా? ఇందాక నా శక్తిని ఉపయోగించి తరిమిన అతనూ ఎక్కడో దగ్గరే నక్కి ఉంటాడు. అవునా? కాదా?" అడిగాడు ఆ వ్యక్తి.

"కావచ్చు." అతని లాజిక్ ను అర్థం చేసుకుని చెప్పింది శర్వాణి.

"మరి నీకు ఇప్పుడు ఉన్నవి రెండే ఆప్షన్స్ ఒకటి నాతో వచ్చి ప్రాణాలు దక్కించుకోవడం. రెండు ఇక్కడే ఉండి వారి చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఆలోచించుకుని డెసిషన్ తీసుకో." అన్నాడా వ్యక్తి. చేసేది లేక ఆ వ్యక్తి తో సరే నని బయలుదేరింది శర్వాణి.

అతను చేయిచాపి తన అరచేతిలో కూర్చోమని చెప్పాడు. తటపటాయించింది శార్వాణి.

"భయపడకు నేను చెడ్డవాడిని కాదు. ప్రయాణంలో నా గురించి నీకు చెప్తాను. ఇక్కడినుంచి ముందు మనం బయటపడాలి" అన్నాడు.

"అమ్మో నాకు భయం ! నీ చేయి లో నేను కూర్చోలేను." అంది శార్వాణి.

సరే అయితే ఉండు అంటూ శార్వాణి ని పువ్వుగా మార్చేసి అక్కడినుంచి మాయమైపోయాడు ఆ వ్యక్తి.

ఆ బిల్డింగ్ కి కొద్దిదూరంలో శార్వాణిని మామూలు స్థితికి తీసుకు వచ్చేసాడు ఆ వ్యక్తి.

వీరి కోసమే సిద్ధంగా ఉన్నట్లు గా ఉంది ఓ యు ఎఫ్ ఓ. అది బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇద్దరూ అందులోకి ప్రవేశించారు. మధుర పరిమళాలతో కూడిన సువాసనలు వెదజల్లాయి.

శ్రావ్యమైన సంగీతం వారి చెవులకు ఇంపుగా సోకింది. ఇప్పటిదాకా పడిన బాధలు అన్నింటినీ మర్చిపోయింది శార్వాణి.

"ఇప్పుడు నా గురించి చెప్తాను విను" ప్రశాంతంగా అన్నాడు ఆ వ్యక్తి.

"సరే చెప్పండి" కుతూహలం గా అడిగింది శార్వాణి.

"నా పేరు బ్లోండే. 'ప్లియడెస్' స్టార్ క్లస్టర్ నుంచి వచ్చాను. నేను కూడా మీ మేథా లాగా ఏలియన్ నే. మమ్మల్ని నోర్డిక్ ఏలియన్స్ అంటారు. మీ భూమి నుంచి నాలుగు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాం మేము." చెప్పాడు బ్లోండే.

"ఇప్పుడు నన్ను అక్కడకు తీసుకొని వెళతావా ఏంటి?" అడిగింది శార్వాణి అనుమానంగా.

"ఏం మా భూమి ని చూడాలని లేదా నీకు? అడిగాడు బ్లోండే.

"వద్దు బాబు వద్దు .... ఇంక మేము ఏమీ చూడం. నన్ను మా వాళ్ళ దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకో. నీకు దండం పెడతాను మా వాళ్ళు నా కోసం ఎంత కంగారు పడుతున్నారో ఏమో!" అంది శార్వాణి.

"ఆహా ..... పుణ్యం వస్తుందా ....నాకు హ హ హ" అంటూ నవ్వుతాడు బ్లోండే.

"ఎందుకు అలా నవ్వుతావు? నేను ఏమైన తప్పుగా మాట్లాడానా? అంది శార్వాణి.

"లేదమ్మా ....లేదు అందరికీ పుణ్యాన్ని ప్రసాదించేదే మేమైతే.... నవ్వు వచ్చి నవ్వాను అన్నాడు బ్లోండే.

"అది సరేగాని నిన్ను మీ ఇంట్లో వదిలేదా? లేదా మేథా దగ్గర వదిలేదా?" అడిగాడు.

"మా ఫ్రెండ్స్ అందరూ మేథా దగ్గరేగా ఉన్నారు?" అడిగింది శార్వాణి అనుమానంగా.

"ఆ ....అందరూ అక్కడే ఉన్నారు." చెప్పాడు బ్లోండే.

"అయితే నన్ను మేథా దగ్గరికే తీసుకెళ్ళు." అంది శార్వాణి.

ఇద్దరు హిమాలయాల పైకి చేరుకున్నారు. ఆ హిమానీనదాలు ...... ఆ లోయలు అరవిరిసిన బ్రహ్మకమలం పూలు ..... అందమైన .....ఆ రమణీయ ప్రకృతి ..... ఆనందాన్ని, కనులవిందునూ కలిగిస్తోంది.

శార్వాణి సర్వం మర్చిపోయి ఆ దృశ్యాలను చూస్తోంది.

"కైలాసగిరి ఇక్కడేగా ఉంది?" కుతూహలం అడిగింది శార్వాణి.

"అబ్బో నీకు కైలాసగిరి తెలుసా?" అడిగాడు బ్లోండే.

"ఆ ....మా అమ్మమ్మ చెప్పేది. కైలాసగిరి హిమాలయాల్లో ఉంది అని. శివుడు అక్కడే ఉంటాడని." ఆనందంగా చెప్పింది శార్వాణి.

"మీ అమ్మమ్మ చూసిందా?" అడిగాడు బోండ్లే.

"ఊహూ .......దానిని ఎవరుచూడలేరుట." చెప్పింది శార్వాణి.

"నీకు చూడాలని ఉందా? చెప్పు ఇప్పుడే చూపిస్తాను." అడిగాడు బోండ్లే.

"ఊహూ నేను ఇప్పుడేం చూడను. ముందు మా ఫ్రెండ్స్ దగ్గరకు నన్ను చేర్చితే మేము మా ఊరు వెళ్ళిపోతాం. అమ్మ వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏమో!" అంది శార్వాణి.

వారెక్కిన యు.ఎఫ్.ఓ. హిమాలయాల్లో కొంత దూరం పోయి ఆగింది.

అక్కడ శార్వాణి కి ఏమి కనిపించలేదు. అంతా నిర్మానుష్యం గా ఉంది. చుట్టూ మంచు పర్వతాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఆమె గుండె దడదడ కొట్టుకుంది. అప్పటిదాకా ఉన్న ధైర్యం కాస్తా జారుకుంటోంది శార్వాణి లో.

ధైర్యాన్ని కూడ తీసుకుని "రేయ్ నన్ను మోసం చేస్తావా ....... చిన్న పిల్లనని కూడా చూడకుండా అబద్దాలు చెప్పి నన్ను ఇక్కడకు తీసుకొస్తావా? చూడటానికి మంచి వాడిలా ఉన్నావు! నువ్వు చెడ్డవాడివా?" అంటూ అరిచింది శార్వాణి.

ఆమె మాటలు ప్రతిధ్వనించి ఆమెకేసి వినిపిస్తున్నాయి. అతను మెల్లిగా ఆమె దగ్గరికి వస్తున్నాడు.

"రేయ్ రాకు నువ్వు నా దగ్గరికి వస్తే ఊరుకోను." అంది కోపంగా శార్వాణి.

పెద్దగా నవ్వుతూ "ఏం చేస్తావ్ ఏంటి?" అన్నాడు బ్లోండే.

"ఏదైనా చేస్తాను. నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? అదుగో ఆ కొండలో దాక్కున్న శివుడ్ని పిలుస్తా. ఇక్కడే గా ఉన్నాడు. వచ్చి నన్ను రక్షిస్తాడు" అంది శార్వాణి.

నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి శర్వాణి నుదిటిపై చేయి వేశాడు బ్లోండే .

***సశేషం***

Posted in April 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!