కమ్యూనిస్ట్ అగ్రనేత కామ్రేడ్ "తరిమెల నాగిరెడ్డి"
తరిమెల నాగిరెడ్డి గారి లాగా భిన్నాభిప్రాయాలను అంతగా గౌరవించదగిన మరో నాయకుడు, ప్రత్యేకించి కమ్యూనిస్టు ఉద్యమంలో మరొకరు లేరు. అందుచేతనే నాగిరెడ్డి గారు అసలు సిసలైన కమ్యూనిస్ట్ నాయకుడిగా నేటికీ చరిత్రలో నిలిచి పోయాడు. అనంతపురం జిల్లా తరిమెలలో 1917 ఫిబ్రవరి 11న ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో నాగిరెడ్డి గారు జన్మించారు. జీవితాంతం పోరాటం సాగించి ఎక్కడ రాజీ అనేది లేకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తి తరిమెల నాగిరెడ్డి గారు.
నాగిరెడ్డి గారి ప్రాథమిక విద్య గిండి థియోసాఫికల్ స్కూల్ లో జరిగింది. ఆ సమయంలో ఆయనకు అనీబిసెంట్ శిష్యరికం లభించింది. ఆ తర్వాత రుషి వ్యాలీలో స్కూల్ ఫైనల్ వరకు చదివి, మద్రాసు లయోలా కాలేజీలో చేరారు. ఉన్నత విలువలతో రుషి వ్యాలీ, గిండి స్కూల్స్ చదివిన నాగిరెడ్డి గారికి ఆ కృత్రిమ వాతావరణంలో ఇమడడానికి ఇబ్బంది పడ్డారు. మొదటి నుంచి జాతీయ భావాలున్న నాగిరెడ్డి గారు తుగ్లక్ కు పిచ్చి, పిచ్చి తుగ్లక్ అన్న టీచర్ మాటల్ని వ్యతిరేకించి జరిమానాకు గురయ్యారు. జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ కు వెళ్లినందుకు జరిమానాకు గురయ్యారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, లా కోర్సులు చదివారు. ఆ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్కు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు నాగిరెడ్డి. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ మార్స్ గ్రోవర్ ను స్నాతకోత్సవానికని ఆహ్వానిస్తే విద్యార్థి యూనియన్ తరపున నాగిరెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అప్పటి వైస్ ఛాన్సలర్ గా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గాంధీజి సిఫారస్ మేరకే గ్రోవర్ ను ఆహ్వానిస్తున్నామని చెప్పటంతో నాగిరెడ్డి గారు మౌనం దాల్చారు. అయితే అనుకున్నట్లుగా గ్రోవర్ రాజ్యాంగ సభకు వ్యతిరేకంగా అనేక అవాస్తవాలు మాట్లాడటంతో సభ ముగిసిన తర్వాత గ్రోవర్ ప్రసంగంపై ఒక కరపత్రం వేసి పంచారు. ఆ కరపత్రాన్ని గ్రోవర్ కి పంపడమే కాకుండా ఆయన్ని సవాలు చేస్తూ ఒక ఉత్తరం కూడా నాగిరెడ్డి రాశారు. ఆ ఉత్తరాన్ని, కరపత్రాన్ని గాంధీకి గ్రోవర్ పంపాడు. దాంతో నాగిరెడ్డిని గ్రోవర్ కు క్షమాపణ చెప్పాలని కోరతూ సర్వేపల్లికి గాంధీ లేఖ రాశారు. అయితే గాంధీ డిమాండ్ ను నాగిరెడ్డి తిరస్కరించారు. తన తిరస్కారానికి మనస్తాపం చెంది ఉంటె క్షమించమని కోరుతూ గాంధీకి నాగిరెడ్డి మరో లేఖ రాశారు. ఆ విధంగా విద్యార్థి దశలోనే స్వతంత్ర భావాలున్న నాగిరెడ్డి గారు గాంధీని ధిక్కరించి ధీశాలిగా ఋజువు చేసుకున్నాడు.
స్వతంత్ర భారత దేశంలో రాజకీయ ప్రేరితమైన తొలి కేసు నాగిరెడ్డి గారి మీదే బనాయించబడింది. ఈయనతో పాటు మరో 67 మందిపై కేసు బనాయించారు. ఈ కేసు హైదరాబాద్ కుట్ర కేసుగా ప్రాచుర్యం పొందింది. ఈ కేసుకు పూర్వపరాలు ఏమిటి అంటే వ్యర్ధమైన చర్చలకు పరిమితం కాకుండా ప్రజలను విప్లవ కార్యాచరణకు కదిలించడమే కర్తవ్యంగా వేదిక నుండి ప్రకటించి దాని ఆచరణకు పూనుకోవడమే. చట్టబద్ధంగా ప్రజలచే ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని, చట్ట వ్యతిరేక హత్యలు-దోపిడీలకు ప్రజలను పురిగొల్పి కూలదోయటానికి కుట్ర పన్నారని వారిపై నేరారోపణ చేశారు. తమ కార్యక్రమాలు న్యాయ విరుద్ధం కాదని ప్రజల్ని నానా ఇబ్బందులు, హింసలు పెడ్తూ విదేశీ గుత్త సంస్థలకు, సామ్రాజ్యవాదులకు తొత్తులుగా మారిన ప్రభుత్వానిదే కుట్ర అని సమాధానమిస్తూ ఆ కేసుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 313 సెక్షన్ ప్రకారం ఆయన చెప్పిన సమాధానమే 'తాకట్టులో భారత దేశం' గ్రంథంగా వెలువడింది. కేవలం వామపక్షీయులే గాక మెజారిటీ మేధావులు దాన్నో ప్రామాణికమైన, సత్య నిరూపితమైన గ్రంథంగా నేటికీ భావిస్తున్నారు.
ఆంధ్ర, మద్రాసు, కేరళ రాష్ట్రాలు కలిసి వున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. అధికార పార్టీతో సమానంగా కమ్యూనిస్టు సభ్యులున్న కర్నూలు శాసనసభలోనూ ఆయన ప్రతిపక్ష నాయకుడు. హైదరాబాద్ కు మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష ఉపనాయకుడు (అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడు). రాజాజీ, ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి (సొంత బావ గారు), బ్రహ్మానంద రెడ్డి లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న ధీశాలి. కమ్యూనిస్టులంటే చాలా చౌకబారు మనుషులనే అభిప్రాయమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ మద్రాసులో ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన అఖిలపక్ష సభలో 3 గంటలపాటు సాగిన నాగిరెడ్డి ఉపన్యాసానికి ముగ్ధుడై ఆయన నివాసానికెళ్లి తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నానని నాగిరెడ్డిని అభినందిస్తూ ఆలింగనం చేసుకున్నారట.
నాగిరెడ్డి గొప్ప ఆర్థికవేత్త. మార్క్సిస్టు దృక్పథంతో భారత ఆర్థిక వ్యవస్థను అనితరసాధ్యంగా విశ్లేషించారు. నేడు దేశాన్ని పాలించే వారంతా విదేశీ పెట్టుబడిదారులకు, భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని వీరికి ఏమాత్రం జాతీయత లేదని ఆనాడు ఆయన సంచలనమైన ప్రకటన చేశారు. "నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాఖానీ షాపు మాత్రమే. జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబడటం నేర్చుకుంటేనే తప్ప మరో మార్గం లేదు". 1969లో మార్చి 16న తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీలో తరిమెల నాగిరెడ్డి అన్న మాటలివి. ఈ మాటలు అని అప్పుడే దాదాపు అర శతాబ్ది గడుస్తుంది. చట్టసభలు బాతాఖానీ షాపుల స్థాయి నుంచి ఎదగకపోగా చేపల మార్కెట్ స్థాయికి దిగజారాయి. భారత పాలకులు కార్పొరేట్ రంగం కోసం, ప్రపంచ బ్యాంక్ ప్రయోజనాల కోసం ఎలా పని చేస్తున్నారో వివరించారు. భారత పాలకులకు దళారీ స్వభావం కలదని నాగిరెడ్డి పదే పదే చెప్పారు. నేడు కార్పొరేట్ రంగం భారత ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను వారి వారి దశాదిశలను నిర్దేశించడం నిత్యం చూస్తున్నాం. 1975 జూన్ 23న తాడిపర్తిలోను, జూన్ 25న అనంతపురం పాత వూరిలోనూ జరిగిన బహిరంగ సభల్లో ఇందిరాగాంధి ఎమర్జెన్సీ వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోబోతుందని ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. భవిష్యత్తును అంత స్పస్టంగా అంచనా వేయగల సత్తా ఉన్న కమ్యూనిస్టు నాయకుడు శ్రీ నాగిరెడ్డి గారు. ఆయన గొప్ప అధ్యయనశీలి, వక్త, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. మానవత్వం పరిమళించే మంచి మనిషి. 1976 జులై 28న అమరుడయ్యారు. కమ్యూనిస్టు ఉద్యమములో అయన పేరు చిరస్థాయిగా గా ఉండి పోతుంది.
