వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 165 వ అంతర్జాల సమావేశం మే15, 2026 నాడు అంతర్జాలంలో కొత్తదనంతో, ఆసక్తికరంగా జరిగింది. ఈ సమావేశాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా. గీతామాధవి గారు ప్రారంభించారు. సమావేశంలో పాల్గొన్న కవులకు రచయితలకు, రచయిత్రులకు స్వాగతం పలికి మాతృభాషపై ఉన్న మమకారాన్ని, వీక్షణం 13 సంవత్సరాల కృషిని ఉటంకించారు. తొలుత ఎప్పటిలా అతిథి ప్రసంగం కాకుండా ఈ సారి విభిన్నంగా జరిగింది. గత వీక్షణంలో రామాయణం ప్రసాదరావు గారి సూచనని అనుసరించి వీక్షణం కవి మిత్రుల స్వీయ సంక్షిప్త పరిచయాల్ని ఈ సమావేశం నించి ప్రారంభించారు. మొదటగా ఈ నెల వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు, తరువాత శ్రీ రామాయణం ప్రసాదరావు గార్ల పరిచయ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రామాయణం ప్రసాదరావు గారి బదులుగా శ్రీమతి అవధానం అమృతవల్లి గారి పరిచయం జరిగింది.
ముందుగా కవి మిత్రులు రాజేంద్రప్రసాద్ గారి పరిచయంతో ప్రారంభం అయింది సమావేశం. రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ, వారికి తెలుగు భాష పై మక్కువ కలిగించిన అంశాలు, పూర్వ కవుల నుండి కలిగిన స్ఫూర్తి, సి.నా.రె, శ్రీ శ్రీ, కృష్ణ శాస్త్రి , మొదలైన కవులిచ్చిన స్ఫూర్తిని వివరించారు. స్టేట్ బ్యాంకు లో ఏ.జి యం గా రిటైర్ అయిన తరువాత వారు వ్రాసుకున్న వందలాది కవితలు, పబ్లిష్ చేసిన పుస్తకాలు, వారి మొదటి కవిత, కుటుంబం మొ.న వివరాలు తెలిపారు. ఇంకా కొత్తగా యువతకు తన సందేశం తన పరిచయ కార్యక్రమంలో చెప్పారు. యువతరం చదివే అలవాటు చేసుకోవాలని చెబుతూ, వారి కవితని వినిపించారు.
ఇంక రెండవవారు అవధానం అమృతవల్లి గారు తమ సంక్షిప్తంగా తమ పరిచయం, అలాగే వారు వ్రాసిన గ్రంథాల్ని వివరించారు. పెన్నా నదీ తీర గ్రామంలో వారు జన్మించారనీ, M.A. చేసి ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా రిటైర్ అయి, 1984 సంవత్సరం నుండి రచనలు చేస్తున్నాననీ తెలిపారు. ప్రతివారు పుస్తకం చదివే అలవాటు చేసుకోవాలి అని, అధ్యయనం చేయడం అవసరమని తెలిపారు. స్పందించే మనసే కవిత్వానికి పునాదని , ఫ్రాఫెసర్ రామచంద్ర గారి ప్రోత్సాహం తనకు రచనల మీద ఆసక్తి కలిగించినదనీ, 2013 నుండీ కవితలు వ్రాస్తున్నాననీ, బువ్వ పూలు, మట్టిచిగురు కవితా సంపుటులు, నెలనెలా వెన్నెలలో వ్యాసాలు వ్రాశానని చెప్పారు. స్పందించే గుణం ఒకటే కవిత్వం వ్రాయిస్తుందనీ, తన పుస్తకానికి మంజులాదేవి కడప రేడియో కేంద్రం వారు, శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు ముందు మాటలతో ప్రోత్సాహం ఇచ్చారు ఆని తెలిపారు. తెలుగు వెలుగు వారి ప్రోత్సాహంతో, పద్యం వ్రాశాననీ, కవిని గుర్తుంచుకునే రచనా శైలి ముఖ్యం అని తెలిపి తన స్వీయ కవితా గానం చేశారు.
గీతామాధవి గారు మాట్లాడుతూ కవులు, రచయితలు తమ వివరాలను తెలుగు రచయిత లో నమోదు చేయించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఇందులో రచయితలు, రచయిత్రులు, కవులు తమ బయోడేటా, వీడియో, ఆడియో పోస్ట్ చేయబడతాయని, ప్రతివారికీ ఒక వెబ్ పేజీ కేటాయించబడుతుందని, కవుల, రచయితల, రచయిత్రుల అన్ని వివరాలు ఒకే చోట చేర్చబడిన తెలుగు రచయిత సైటు యువతరం వారికి ఒక ఎన్ సైక్లో పీడియాలా ఉంటుందనీ తెలిపారు.
తరువాత కవిసమ్మేళనం డాక్టర్ రాధాకుసుమ గారి నేతృత్వంలో అంగరంగ వైభవంగా మధ్య మధ్యలో శ్రీ రాజేంద్రప్రసాద్ ఛలోక్తులతో ఆద్యంతం హుషారుగా జరిగింది. మొదటగా చీదెళ్ళ సీతాలక్ష్మిగారు, తదుపరి అమృతవల్లి గారు వారి కవితలతో శ్రోతలను అలరించారు. అలాగే వెంకట్ కొత్తూరు గారి కాఫీ కవిత్వం హుషారిచ్చింది. రాధా కుసుమ గారి సంచాలకత్వంలో గీతామాధవి అమ్మ కడుపుచల్లగా అంటూ వేడిగా దోసె మీద కవనం వినిపించారు.
ముప్పాళ్ళ భవాని గారు అమ్మకు గిఫ్టు కవితని పాటలా పాడారు. వైరాగ్యం ప్రభాకర్ గారు, బాల్యానికి భరోసా అంటూ కవిత, డా//బృంద గారు మే డే కవితతో పిడికిలి బిగించారు. కార్మికులకు జోహారు లర్పించ్చారు. భోగెల ఉమామహేశ్వరరావు గారు "చదువు వెలుగు కవిత, డాక్టర్ చీదెళ్ళ సీతామహాలక్ష్మీ గారి ప్రకృతి ఆరాధన, శ్రామిక శక్తికి పట్టం, రవీంద్రుని జ్ఞాపకాలను అందించారు. బి.శంకరరావు జిల్లెళ్ళమూడి అమ్మ పై పద్యాలు రాగ యుక్తంగా చదివారు.
కోదాటి అరుణ గారు అమ్మ చెంగు పెన్నిధి అంటూ వారి కవిత వినిపించారు. తరువాత అరుగు పై లలితా చండీ గారి కవిత్వం శోభ గూర్చింది. శ్యామలాదేవి గారి పద్యం చెట్ల గురించి, పంచభూతాల గురించి కవిత చదివారు. మోటూరి నారాయణ గారి మినీకవితా పోకడలు, డి.రాజ గారు, అలాగే దీపక్ న్యాతి గారి కవితలు, వెంకటేశ్వర్లు గారు అమ్మ పై కవిత, పరిమి వెంకట సత్య మూర్తి గారి కవిత, కందుకూరి శ్రీ రాములగారి కవిత ఋషి, మనిషంటే అలావుండాలని కవిత చదివారు. తెలంగాణ కవి వీర్రాజు గురించి నందిని సిద్దారెడ్డి గారి గురించి తెలిపారు. శోభ దేశ్ పాండే తాతయ్య కధలు, అమ్మ అనురాగం గురించి చదివారు. కవులంతా మాతృ భాషా దినోత్సవాన్ని గుర్తు చేసుకని తమ కవితలు వినిపించారు చాలమటుకు.
తదుపరి చంద్ర కళ గారు, ఇంటి ముంగిట కళ్ళాపి గురించి కవిత, రమాదేవిగారు "అరుగు" గురించి తెలంగాణ యాస లో తమ కవిత వినిపించారు. మోపిదేవి ఆది గారు పరశురాముడు కట్టెలు కొట్టకురా అనే కవిత చదివారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు "అక్షర మే ఆయుధమంటూ కవిత , మేడిశెట్టి యోగేశ్వరరావు గారు ప్రకృతిలో మాతృ మూర్తిని చూపారు, తమ కవితతో చైతన్య జ్యోతులు వెలిగించారు. దండ లో వున్న దారాన్ని చూశారు. కవితా వైద్యం చేస్తున్న డా//శాంతిశ్రీ గారు తమ కవిత్వంతో అలరించారు.
దేవులపల్లి పద్మజ గారు పద్మపాణి... సూర్యుని గురించి, రాజేంద్రప్రసాద్ గారు తమ కవిత్వం వినిపిస్తూ ఎందరికో తమదైన శైలిలో కవులందరినీ ఒక త్రాటి పై ఆహ్వానం, ఆవాహన చేస్తూ, వీక్షణాన్ని సంపన్నం చేస్తున్నారు అని కవులందరూ శ్లాఘించారు. రాధా కుసుమ గారు "మానవత్వం " కవిత చదివి వినిపించారు. చివరగా గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ అమ్మ అమృతవర్షిణి అనే కవితను చదివి అందరినీ ఆకట్టుకున్నారు.
అందరికీ ధన్యవాదాలు చెబుతూ డా.గీతామాధవి గారు స్వీయ పరిచయం కార్యక్రమంలో పాల్గొన్న కవులకి, కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపి సమావేశాన్ని ముగించారు.
ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.