Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 111 వ సమావేశం
వరూధిని
vikshanam-111

వీక్షణం-111 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా నవంబర్ 14, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు గారి కథాపఠనం, శ్రీ సుభాష్ పెద్దు గారిచే డా.కె.గీత గారు రాసిన "వెనుతిరగని వెన్నెల" నవలా సమీక్ష జరిగింది.

ముందుగా శ్రీ వేమూరి కథాపఠనంలో భాగంగా "బొమ్మలూరు" అనే స్వీయకథని చదివి వినిపించారు. ముందుగా కథానేపథ్యాన్ని వివరిస్తూ "ఈ కథ ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియేట్ లో పాఠ్యపుస్తకం ‘గలివర్స్ ట్రావెల్స్’ లో ‘వాయేజ్ టు బ్రాబ్డింగ్నేగ్’ చదువుతున్నప్పుడు మా గురువుగారు ఇలాంటి కథే ఒకటి చెప్పగా అది గుర్తుకు వచ్చి రాసిన కథ. నేను బింఘంటన్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు దగ్గరలోనే ఉన్న ఇథకా కాలేజీలో పని చేస్తున్న రాడ్ సెర్లింగ్ ఉపన్యాసం విన్నాను. ఆయన ఇటువంటి కథనే టివిలో 1960 దశకం నాటి ట్వైలైట్ జోన్ పరంపరలో తీసినట్లు చెప్పేడు." అన్నారు.

ఆద్యంతం అత్యంత ఉత్సుకతతో సాగిన కథ ఇది. చిన్న కథ అయినా ఆలోచింపజేసిన చక్కని కథ.

అలాగే కథ ముగింపు గురించి చెపుతూ "అతను, ఆమె కళ్లప్పగించి చూస్తున్నారు. చెవులు రిక్కించి వింటున్నారు. వాళ్లు ఒంటరిగా లేరు. ఎవరింట్లోనో ఉన్నారు. ఆ ఇల్లు కూడ వారనుకున్నట్లు ఖాళీగా లేదు.

చిన్న బాలిక చేసే కిలకిలారావం పైనుండి వస్తోంది. పైపెచ్చు ఆ పిల్ల కేరింతలు కొడుతూన్న శబ్దం కూడ వినబడుతోంది. ఆ అమ్మాయి ఆడుకుంటోంది కాబోలు. నేపథ్యం నుండి మరొక పెద్దామె గొంతుక స్పష్టంగా వినిపిస్తోంది: “అమ్మాయీ! చూడమ్మా! మీ నాన్న నీకోసం భూలోకం నుండి తీసుకొచ్చిన బొమ్మరిల్లు బావుందా?”

ఆ మాట వినగానే ఉదయం లేచినప్పుడు గుసగుసలాడుతూ ఆమె అతనిని అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది." అన్న ముగింపుకి కథని ప్రచురించిన సంపాదకులు చేర్పించిన వాక్యంగా మరొక వాక్యం రాయాల్సి వచ్చిందని అది “తామున్నది మహాకాయులు నివసించే మరోలోకంలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మరిల్లులో అని వారికి అర్థం అయింది.” అని చెప్పేరు.

అయితే తీరా ఒక పాఠకుడు ఈ చివరి వాక్యానికి స్పందిస్తూ "ఆ చివరి వాక్యం రాసి పాఠకుల ఆలోచనా శక్తిని కించపరచేనని వ్యాఖ్యానించేడు." అని వాపోయారు. అంతేకాకుండా ఇటువంటి అనుభవం వల్ల నేర్చుకోవలసింది ఏవిటంటే కథను రచయితలు నచ్చినట్టు రాయొచ్చని, సంపాదకులు చెప్పిన మాట విననక్కర్లేదని స్పష్టం చేస్తూ ముగించారు.

ఆ తర్వాత జరిగిన నవలా సమీక్ష కార్యక్రమంలో శ్రీ సుభాష్ పెద్దు గారిచే "వెనుతిరగని వెన్నెల" సమీక్ష జరిగింది. "వెనుతిరగని వెన్నెల - ఒక స్టీల్ మాగ్నోలియా" అని పేర్కొంటూ "శీతాకాలంలో దుర్భరమైన చలికి, మంచుకి నిలబడి, పెద్ద పెద్ద దోసిళ్లంత పూలతో తనను తాను కప్పుకుని వసంతాన్ని ఆవిష్కరిస్తూ అందరినీ ఆహ్లాదపరిచే చెట్టు మాగ్నోలియాలా ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉక్కులాగా నిలబడుతూ, సున్నితంగా సమస్యలను పరిష్కరించుకుని తన చుట్టూ ఉన్నవారిని ఆహ్లాదపరిచిన నాయిక ఇందులోని ప్రధాన పాత్ర "తన్మయి" అన్నారు.

1970, 80, 90ల ప్రాంతాలలో పెరిగినవాళ్లందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఈ నవలలోని సన్నివేశాలు ప్రత్యక్షంగా చూసినవారే. చాలా మంది తెలుగు మహిళలు తమ నిజ జీవితంలో అనుభవించి, వికసించిన స్టీల్ మాగ్నోలియాలే అయ్యి ఉండ వచ్చు కూడా. సన్నివేశం మారవచ్చు, కానీ ఇది వారి కథ కూడా. స్త్రీల సామాజిక, ఆర్థిక  జీవన పరివర్తనలోని దశలకు నవలా రూపంలోని కాలనాళిక ఈ "వెనుతిరగని వెన్నెల" అన్నారు.

తన్మయి రావల్సిన సామాజిక పరివర్తనకు మార్గదర్శకురాలు. కష్టాలు పంచుకుంటూ ఓదార్పు మాటలతో తన్మయి స్నేహితురాలు మేరీ మగవాళ్లనందరినీ ఒక గాటను కట్టివేస్తుంటే, "నా కొడుకు కూడా మగవాడే కదా, తండ్రి లాంటివాడు కాకుండా పెంచాలి" అని తన్మయి అంటుంది. సామాన్యంగా కనిపించే ఈ మాటలలో మంచి నిర్దేశ్యం ఉన్నది. అందరు తల్లులు తమ కొడుకులకి కూతుళ్లతో పాటే వంటింటి పనులు, ఇంటి పనులు నేర్పితే, తరువాతి తరంలో స్త్రీ సమానత్వానికి తోడ్పడినవారవుతారు.

పాత్రల చిత్రీకరణ కూడా చాలా సహజంగా వున్నది. ఈ నవల మానవీయతా విలువలకు చెందిన నవల. ఇది భారతీయ సమాజంలో నేటికీ వ్యవస్థీకృతమైన స్త్రీ పురుష తారతమ్యాలకి ప్రతిబింబం. హీరోయిజం కథలకు మాత్రమే అలవాటుపడిన సమాజంలో తనకు తాను నిలబడేవారిని గుర్తించి, వారే పురోగతికి మార్గదర్శకులు అని చెప్పగలిగే కథ ఇది. అలాగే పేజీల సంఖ్యలో పెద్దనవల అయినా పాఠకుడిని ఒక్క ఉదుటున చదివించగలిగిన మంచి నవల. ఒక మంచి నవలకు వుండవలసిన లక్షణాల గురించి చాలా చర్చలు, ఉపన్యాసాలు, వ్యాసాలు ఉన్నాయి. కానీ, పాఠకుడు అసలు ఎందుకు చదవాలి అని ప్రశ్నించుకుంటే, Jane Austen మాటలు గుర్తుకు వస్తాయి. “Some work in which the greatest powers of the mind are displayed, in which the most thorough knowledge of human nature, the happiest delineation of its varieties, the liveliest effusions of wit and humor are conveyed to the world in the best chosen language (Northranger Abbey)”. ఈ మాటలకు గుండెలలో నుంచి వచ్చిన కథ అనే లక్షణాన్ని జోడిస్తే, పాఠకుల హృదయాలకు చేరుతుంది. నవలలో చెప్పిన మాటలు, విషయాలు కొన్నైనా పాఠకుల మనసులలో నిలుస్తాయి. అనవసరమైన ఫిలాసఫీ, వర్ణన కోసం వర్ణనలూ లేకుండా, చెప్పవలసిన విషయాన్ని సూటిగా, సరళమైన వాక్యాలతో నడిచిన శైలి. మంచి మాటలూ, సందర్భోచితమైన సూక్తులూ/శ్లోకాలూ కూడా చాలానే వున్నాయి. అందుకే ఒక్క ఉదుటున చదివించగలిగింది.

ఈ నవలను యువతకు ఒక పాఠ్యాంశంగా ఉంచితే, చదివి విశ్లేషించి స్ఫూర్తి పొందటానికి అవకాశం కలుగుతుంది. మార్కులు, రాంకుల కాలంలో, ఏదో ఒక పరీక్షా పత్రానికి జవాబు లాగా కాకుండా, విద్యార్థులకి చర్చాంశంగా ఉంటే, యువత ఆలోచన సరళి మారే అవకాశం ఉంటుంది, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది.

సామాజిక పురోగతికి తోడ్పడే "వెనుతిరగని వెన్నెల" స్ఫూర్తినిచ్చి బోలెడు ఉక్కు పుష్పాలను తయారు చేయగల మంచి కథ." అని ముగించారు.

ఆ తర్వాత నవలారచయిత్రి  డా.కె.గీత ఈ నవలకి తాను రాసిన ముందుమాటనే తన స్పందనగా చదివి వినిపించారు. ఆ తర్వాత ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన చర్చా కార్యక్రమంలో శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీ నల్లమోతు ప్రసాద్, శ్రీ జక్కంపూడి మోహనరావు, శ్రీ రాజారామ్ మొ.న వారు పాల్గొని సభను జయప్రదం చేశారు.

చివరగా శ్రీ టి. పి.ఎన్. ఆచార్యులు గారు తమ కవితా గానాన్ని వినిపించి అందరినీ అలరించారు. వీక్షణం-111 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.

Posted in December 2021, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!