Menu Close
Adarshamoorthulu
శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు
-- అక్కిరాజు రమాపతిరావు

(శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ గారి గురించి శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు వ్రాసిన క్రింది వ్యాసాన్ని మనకు అందించిన శ్రీ జె.ఎస్.ఆర్ మూర్తి గారికి కృతజ్ఞతలు)

jonnavitthula-ramakrishna-sharma

సాహిత్య తేజోమూర్తి (23 నవంబర్1931 - 9 జులై 2002) శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు నిన్నమొన్నటివారు. ఇంచుమించుగా ఇరవయ్యో శతాబ్దం కాలయవనిక వెనక్కు వెళుతూండగా వీరు ఆంధ్ర సారస్వత రంగం నుంచి తన పాత్రను నిశ్శబ్ద మౌన సుందరోజ్జ్వలంగా నిర్వహించి నిష్క్రమించినవారు. లోకంలో పరమ భావుకత, పరిపూర్ణ పాండిత్యం ఎక్కడైనా లోచన గోచరం కావచ్చు. కానీ దానిని అనుభవించడానికి ఎంతో గొప్ప సాహిత్య సంస్కారం కావాలి. జపంలా, తపంలా, మంత్ర సాధనలా దానిని పొందడం అందరికీ సాధ్యమా! నిజానికి కవికంటే వ్యాఖ్యాత, భావుకత-సహృదయతలలో గొప్పవాడని చెప్పాలేమో. కవి ప్రతిభలోన రసము వేయిరెట్లు గొప్పది అని విశ్వనాథవారంటారు. కానీ రసోపాసన సాహిత్య ప్రీతిచిత్తులందరికీ సాధ్యమా జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారివంటివారికి తప్ప. తంజావూరు బృహదీశ్వరాలయపు గోపురశిఖరాన్ని నిలపటానికి యాభై అరవై మైళ్ళ దూరంలోని కుంభకోణం నుంచి ముందుకు వెళ్తున్నకొద్దీ ఎత్తు పెరిగేలా ఏటవాలుగా ఒక కట్ట నిర్మించి దానిమీంచీ తీసుకువెళ్ళి ఆలయంమీద నిలిపారట శిల్పులు. అదీ శిల్పమంటే. అటువంటి సాహిత్య శిల్పసంవేది శ్రీ రామకృష్ణశర్మగారు.

దురదృష్టం.., కాలం కాని కాలంలో కలంకారీతనాన్ని ఎవరూ పట్టించుకోరు. వీధిలోకి వెళితే సింథటిక్ రంగుల యాంత్రికమైన నేతలు కావలసినన్ని! మన ప్రబంధ సాహిత్యం భావుక విహారసీమా గంధర్వలోకం. వసు చరిత్రను వ్యాఖ్యానించడంద్వారా, మను చరిత్రకు భాష్యం చెప్పడంద్వారా, స్నేహాన్ని గౌరీశంకర శిఖరంపై నిలబెట్టే చిత్రకళా రామచంద్రీయమనే లీలా ప్రబంధాన్ని రచించడం ద్వారా శ్రీ జొన్నవిత్తులవారు దీనిని తెలుగువారికి చూపించారు. బహుశా మను చరిత్రపై వీరు రాసిన వ్యాఖ్యానం ‘నభూతో న భవిష్యతి’ అనవలసి ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే, అది ఇంతవరకూ అచ్చుకాలేదు, కాబట్టి దానిగురించి ఎవరికీ తెలియదు. స్వామి వివేకానంద ఎంతో ఆరాధన తత్పరతతో మెచ్చుకున్న పవహరి బాబా నెలల తరబడి ఒక నేలమాళిగలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయేవారట. ఆయనకి గాలీ వెలుతురులతో పని ఉండేది కాదు. అట్లా శ్రీ రామకృష్ణశర్మగారు సాహిత్య తపస్సు చేశారు. అల్లసాని పెద్దన మహానుభావుడి అల్లికలోని జిగీ బిగీ ఏమిటో శ్రీ శర్మగారు నిరూపించారు. మను చరిత్రలోని పద్యాల్ని రాగ లయల సంగీత మాధుర్యానికి నెలవుగా నిరూపించారు. ఆంధ్రప్రబంధ సృష్టికర్త అంటే ఆయనే అని భాష్యీకరించారు. ఆంధ్రసాహిత్యానికి మాత్రమే లభించిన ధృవపదం మనుచరిత్ర అన్నారు. సాధారణంగా విమర్శకులు, వ్యాఖ్యాతలు-శబ్దసాధుత్వం, అర్థ ఆస్వాద్యత, పాత్రల సజీవ చిత్రణ, కథాకథన నిర్వహణ, లేదా నిర్మాణ దక్షతలాంటి విషయాలనే ఒక కావ్యం విషయంలో సమీక్షిస్తారు. శ్రీ జొన్నవిత్తులవారైతే ఆంధ్ర సారస్వతంలో కవితాశక్తి విజ్ఞాన సర్వస్వంగా "మనుచరిత్ర ప్రబంధ దర్శనం" అనే తమ పారదర్శక విమర్శా గ్రంథం ద్వారా విన్యసింపజేశారు. తర్వాతి కవులందరూ ఈ స్వారోచిష మను సంభవంద్వారా ప్రభావితం అయినవారే అని ప్రతిపాదించారు. ఈ వ్యాఖ్యానం విషయంలో మల్లినాథ సూరి వీరికి గురూత్వం నెరపారేమో అనిపిస్తుంది. ఆ మల్లినాథ సూరే ఈ వ్యాఖ్యానాన్ని చూసి వుంటే శ్రీ శర్మగారిని ఎంతగానో కొనియాడి ఉండేవారు. మనుచరిత్రంపై ఇరవయ్యో శతాబ్దంలో తెలుగునాట విమర్శా సమీక్షలైతేనేమి, ప్రచురణ వ్యాఖ్య ముద్రణలేమి శతాధికంగా వచ్చి ఉంటాయి. శ్రీ రామకృష్ణ శర్మగారి ఈ ఉద్గ్రంథం విషయంలోని విశేషం ఏమిటంటే ఆ రచనలన్నింటినీ వీరు పునఃసమీక్ష చేశారు. తనముందువారు పడిన భ్రమ, ప్రమాదాలన్నింటినీ మనోజ్ఞంగా నిరస్తం చేశారు.

మనుచరిత్ర గూర్చి ఎవరు ఏమన్నదీ వీరు వదిలిపెట్టలేదు. నాగపూడి కుప్పుస్వామయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, విన్నకోట మాధవరావు, వాడ్రేవు సూర్యనారాయణ మూర్తి(వీరి పేరు ఎవరూ విని ఉండరు), తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య, పల్లా దుర్గయ్య(వీరు తెలుగు సాహిత్య ప్రబంధాలపై పరిశోధన పట్టభద్రులు), నిడదవోలు వెంకటరావు ప్రభృతులను పర్యావలోకనం చేశారు. కుతపకాలం అంటే ఏమిటి దానిని ఎట్లా నిర్ధారించాలి అనే విషయమై తెలుగునాట పండితలోకంలో పెద్ద రచ్చ జరిగింది. ఎంతో ప్రామాణికంగా చర్చ చేస్తూ ఈ విషయం నిర్ధారించారు శ్రీ శర్మగారు. మూడో ఆశ్వాసంలోని పదవ పద్యాన్ని శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి వంటి ఉద్దండులు సైతం "అనుచితము అసహ్యము" అనడానికి గల కారణాలని చెబుతూ అది ఎందుకు అనుచితం కాదో ఆ పద్యం కార్యకారణ సంబంధంతో ఎలా బిగినంది సందర్భోచితంగా వెలుగొంది అల్లసాని జిగిని మనకి ఏవిధంగా పట్టి ఇచ్చిందో తెలియజేసిన వైనం అబ్బురపరుస్తుంది. ఉపనిషత్తులు, అమరం, గురుబాలప్రబోధిక, నిరుక్తం, శార్ఞధర చరిత్ర, బాణుని హర్షచరిత్రం సాక్ష్యాలుగా తెచ్చారు, మనుచరిత్ర సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు. ఆ గ్రంథం అవశ్యం వెలుగుచూడవలసి ఉంది.

స్నేహం అనగానే తెలుగువారికి గుర్తొచ్చేది బాపు-రమణలు. తను స్వయంగా చిత్రకారుడై ఉండీ తన మిత్రుడైన ఈడూరి రామచంద్రరావుగారి చిత్రకళనే వారి నాయికగా చేసి చిత్రకళారామచంద్రీయము అనే లీలా ప్రబంధాన్ని రచించేంత స్నేహబాంధవ్యం రామకృష్ణ శర్మగారికి మాత్రమే స్వంతం. అంతేకాదు, కేవలం చుక్కలతో రామచంద్రరావుగారి చిత్రరచన చేశారు. అది జీవం తొణికిసలాడుతూ వారి ఛాయాచిత్రాన్ని మరిపిస్తోంది. శర్మగారి మరో స్నేహితుడు కలిదిండి సత్యనారాయణరాజుగారి కోసం కాళిదాసు మేఘదూతాన్ని తెలుగులోకి అనువదించారు. తన విద్యార్థుల కోరిక మేరకి "ఆంధ్ర ద్యుతి" అనే పద్యనాటకాన్ని రాసి ప్రదర్శింపజేశారు. శ్రీ శర్మగారివంటి సర్వతోభద్రమైన పాండిత్యం, భావుకత, సాహిత్య సౌందర్య దర్శనం, అక్షర శిల్పవిన్యాస జిజ్ఞాస సాహిత్యలోకంలో చాలా అరుదుగా సమకూడే విషయాలు. శ్రీ శర్మగారు గొప్ప లలిత కళోపాసకులు. సంగీత సూక్ష్మాలు తెలిసిన గాయకుడు కూడాను. ఆయన తర్కం వ్యాకరణం, తంత్ర, మంత్ర శాస్త్రం, శాస్త్రమర్యాదలు, వాఙ్మయంలో సాధికారికత, గాఢపరిశ్రమ కలిగినవారు. ఇటువంటివారిని ఆంగ్లంలో ఇండాలజిస్టులంటారు. వీరు మంత్రశాస్త్రం నుంచి తంత్రశాస్త్రం నుంచి ప్రణవం, హంస, సరస్వతీదేవి నటరాజు వంటివాటికి పరమ తాత్త్వికమైన భావరూప చిత్రణ చేశారు. కూలంకషమైన, సర్వంకషమైన పాండిత్యం ఉంటేగానీ, మంత్రశాస్త్ర విద్వత్తు ఉంటేనేగానీ ఈ విషయాలు అర్థమేకావు.

జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారి చిత్రకవిత్వం, గర్భ, బంధకవిత్వాలు పరమాశ్చర్యప్రదాలు. అష్టమూర్తి, భాస్కరవిలసితము, పద్మనాభము మొదలైన విశేష వృత్తాలను చిత్రకళాకృతులు, బంధకవిత్వ విశిష్ఠమూర్తులుగా వీరు కాక ఇంకా ఎవరైనా విరచించారేమో వినియోగించారేమో తెలియదు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, శ్రీ శర్మగారు, విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్ష శ్రీ భాష్యకారులు. కైలాసవాసి శ్రీ మల్లంపల్లి శరభయ్యగారన్నట్లు విశ్వనాథవారు ఒక పట్టాన అర్థం కారు. ఆయన కారకమే వేరు. ఆయన శబ్దప్రయోగ ప్రతిభ, భావ వైచిత్రి, సాహితీ శిల్ప పారంగత్వం, మనోధర్మ వైచిత్రి, ఊహాశీలతలోని లోతులు-ఎత్తులు, సామాన్య సాహిత్య ప్రియతకు అందేవికావు. శ్రీమద్రామాయణ కల్పవృక్ష అంతర్దర్శనం అనే గొప్ప భాష్యగ్రంథం రచించారు. ఆధునిక విమర్శకులలో శ్రీ శర్మగారు అత్యంత ఆధునికులు. సంప్రదాయ మర్మజ్ఞులలో పరమ విశిష్ఠ సంప్రదాయవేత్త. ఫ్రెంచి విప్లవం కార్లైల్ నుంచి శంకర భగవత్పాదుల సౌందర్యలహరిదాకా సాహిత్య తత్వవిచికిత్సలో వారు సమన్వయం చెయ్యగలరు. తన గ్రంథాలలో వారు కొత్తపాతల మేలు కలయికను ప్రతిభాసింపజేశారు.

Posted in March 2020, వ్యాసాలు

1 Comment

  1. ఉలి - సినీ దర్శక రచయిత

    శ్రీ జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ గారి అంతర్దర్శనం చదివాను. అద్భుతమైన రచనాశైలిలో వివరణాత్మకంగా రామాయణ కావ్యమును నేటి తరానికి అందించారు. అంతటి సాహిత్య తేజోమూర్తి రామకృష్ణ శర్మ గారి పరిచయం చేసిన అక్కిరాజు రమాపతి రావు గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!