Menu Close
Manusmrithi

'మనుస్మృతి' -  భారతీయులందరికీ ఈ పేరు చిరపరిచితమే! కనీసం విద్యావంతులైన భారతీయులలోనైతే ఈ పేరు విననివారుండరు బహుశా.  కేవలం భారతీయులకే కాదు - భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి, ఎంతోకొంత అవగాహన ఉన్న విదేశీ పండితులకూ ఈ గ్రంథం పేరు సుపరిచితం. ‘మనుస్మృతి’ ని 'మను ధర్మశాస్త్రం', ‘మానవ ధర్మశాస్త్రం’ అని కూడా పిలుస్తారు.

స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడే స్త్రీవాద ఉద్యమకారుల దృష్టిలో 'మనుస్మృతి' గ్రంథం పురుషాహంకారానికి సంకేతం. వారి భావన ప్రకారం శతాబ్దాలుగా సాగుతున్న తమ అణచివేతకూ, తమ పట్ల వివక్షకూ అదే మూలకారణం. దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రజల దృష్టిలో భారతదేశంలో వర్ణవ్యవస్థను సుప్రతిష్ఠితం చేసి, ఎన్నో అమానవీయ ఆచారాలను భారతీయ సమాజం మీద రుద్దిన 'మనుస్మృతి' ఒక అధర్మశాస్త్రం. దానిపట్ల నిరసన భావంతోనే 1927 డిసెంబర్ 25 వ తేదీన నేటి ముంబాయికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న మహద్ అనే చిన్న పట్టణంలో ‘బాబా సాహెబ్’ డా.బి.ఆర్. అంబేద్కర్, ‘మనుస్మృతి’ గ్రంథాన్ని అంటరానితనం నిర్మూలనకు కృషిచేస్తున్న కార్యకర్తలు, బౌద్ధభిక్షువుల సమక్షంలో బహిరంగంగా తగులబెట్టారు. అప్పటినుంచీ దళితులు, నవ్య బౌద్ధులు (నియో బుద్ధిస్ట్)లు, అంబేద్కరైట్లు ఆ రోజును ‘మనుస్మృతి దహన్ దివస్' (Manusmriti Burning Day) గా పాటిస్తూ ఏటా అదే రోజు క్రమం తప్పకుండా ‘మనుస్మృతి' ప్రతినొకదానిని తమ నిరసనకు సూచనగా తగులబెడుతూ వస్తున్నారు. బ్రాహ్మణీయ సంస్కృతికి, ఆ భావజాలానికి మూలమైన మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ నేతృత్వంలో మొదలైన దళిత ఉద్యమంలో ఈ ఘటనను ఒక మైలురాయిగా భావిస్తారు. ఇక హేతువాదులు, మానవ వాదుల దృష్టిలో భారతీయ సమాజంలో అనాదిగా అన్యాయాలను ప్రశ్నించే తత్త్వమున్న ఆలోచనాపరులపై  పతితులు, భ్రష్టులు, పాషండులు అనే ముద్రవేసి వారి ఆలోచనలను అణచివేసిన అమానవీయ నియమావళి 'మనుస్మృతి'.

‘మనుస్మృతి’ పట్ల ఆ యా సామాజిక వర్గాలకున్న ఈ వ్యతిరేకత సహేతుకం, సకారణమే అయినా, ఇలా ఎందరు, ఎంతగా ద్వేషించినా సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారుల దృష్టిలో మాత్రం 'మనుస్మృతి' ప్రాచీన భారతీయ సమాజాన్ని అధ్యయనం చేసేందుకు, నాటి ప్రజల ఆచారవ్యవహారాలు, కట్టుబాట్ల తీరుతెన్నుల్ని క్షుణ్ణంగా గ్రహించడానికి ఉపకరించే ఒక విలువైన ఆధారగ్రంథం (A valuable Source Book). నేటికీ న్యాయశాస్త్ర విద్యార్థులు 'హిందూ లా' మూలాలు అధ్యయనం చేయాలన్నా, ఒకనాటి కుటుంబ వ్యవస్థ, వారసత్వ హక్కులు, నాటి శిక్షాస్మృతి మొదలైన పలు అంశాల నేపథ్యం తెలుసుకోవాలన్నా, వారికి ‘మనుస్మృతి’ అధ్యయనం తప్పనిసరి. ఇక ఉపయోగితా విలువ రీత్యా ఆలోచిస్తే ఈనాటి ఆధునిక సమాజానికి ఎంతమాత్రమూ పనికిరాని ఎన్నో అంశాలు ఆ గ్రంథంలో ఉన్నాయనేది నిజం. అయితే  దానిలో ఎప్పటికీ ఉపయుక్తమైన కొన్ని అంశాలు - ప్రత్యేకించి మన ప్రాచీనులు పాటించిన ఆరోగ్యసూత్రాల వంటివి - కూడా ఉన్నాయనేది కూడా ఒక కాదనలేని  వాస్తవం. అదికాక గత చారిత్రక దశలలో సామాన్యుల సామాజిక జీవనం ఎలా ఉండేదో, వారు  గడిపిన జీవితాలెంత దుర్భరంగా ఉండేవో, అప్పటి సమాజం నాటి అవసరాల రీత్యా  అవలంబించిన నీతి రీతులు ఎలా ఉండేవో, వారు పాటించిన శిక్షాస్మృతి ఎలా ఉండేదో తెలుసుకోవడం కూడా సామాజిక ఉద్యమకారులకు అవసరం. గడచిన దారి ఎలాంటిదో తెలిసినప్పుడే మనం ముందు దారిలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోగలం. కొందరు సనాతనులు భ్రమ పడుతున్నట్లు మన గతమంతా ఘనమైనది కాదు. 'పురాణమిత్యేవ న సాధు సర్వమ్' అని మహాకవి కాళిదాసు ఎప్పుడో చెప్పాడు. ఇక కొందరు ఆధునికులు అభిప్రాయపడుతున్నట్లు మన గతమంతా చెత్తా కాదు. గతం నుంచి నేటికి పనికివచ్చే గుణపాఠాలను స్వీకరించి, వాటిని ఆధునిక సామాజిక అవసరాలకు అనువైన రీతిలో నవ్య సామాజిక నియమావళితో మేళవించి ఉపయోగించుకుంటూ పాత కొత్తల మేలు కలయికగా సమాజం ముందుకు సాగాల్సి ఉంది. సామాజికాభివృద్ధిని గురించిన చారిత్రక భౌతికవాద దృష్టి అదే. ఇందుకోసం అసలు 'మనుస్మృతి' లో ఏముందో ముందుగా అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. దానిలో ఏముందో తెలియకుండానే దానిని ద్వేషించడమో, తగులబెట్టడమో లేక గుడ్డిగా వెనకేసుకురావడమో చేస్తున్నవారినెందరినో మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. ప్రేమించినా, ద్వేషించినా ముందుగా అసలు ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకున్న తరవాతనే కదా చెయ్యాల్సింది ?

మరో చిత్రమైన విషయముంది. అదేమిటంటే 'పరాశర స్మృతి' లోని ఒక శ్లోకం ప్రకారం అసలు 'మనుస్మృతి' లోని ధర్మసూత్రాలు కృతయుగంలో మాత్రమే ఆచరించదగినవట. త్రేతాయుగంలో 'గౌతమస్మృతి' నీ, ద్వాపరయుగంలో 'శంఖలిఖిత స్మృతి' నీ, కలియుగంలో 'పరాశర స్మృతి' నీ మానవులు పాటించాలట.- ( 'పరాశర స్మృతి' 1-24).  'కలౌ పారాశరౌ స్మృతః' అన్న ఆర్యోక్తి సుప్రసిద్ధమే! కలియుగంలో 'పరాశర స్మృతి'ని మాత్రమే మనం పాటించాల్సి ఉన్నప్పుడు అసలు వ్యతిరేకులుగానీ, సమర్థకులుగానీ ఎప్పుడో గతించిన కృతయుగంనాటి 'మనుస్మృతి' మీద ఇంత రగడ చేయడం అవసరమా? అనే సంశయం ఎవరికైనా కలగకపోదు. అయితే ఇందుకు ఒక కారణముంది. ఋగ్వేదం ఎలాగైతే మిగిలిన మూడు వేదాలకూ ఆధార గ్రంథమో అదే రీతిలో 'మనుస్మృతి' మిగిలిన మూడు స్మృతులకూ మాతృక (మూల గ్రంథం). మిగిలిన మూడు స్మృతులూ దాదాపుగా మనుస్మృతి ని అనుకరించే ఆ యా కాలాలకు అనువర్తించే విధంగా రూపొందించబడ్డాయట. కాబట్టి  ఈనాటికీ కొందరు ద్వేషించినా, ఇంకొందరు వెనకేసుకొచ్చినా 'మనుస్మృతి' మిగిలిన మూడు స్మృతులకూ మూలగ్రంథం అయిన కారణంగానేనన్నమాట!

శ్రుతులు - స్మృతులు

సనాతనుల విశ్వాసం ప్రకారం వేదాలు అపౌరుషేయాలు - అంటే మానవులెవరిచే రచింపబడనివి. వేదాలు భగవంతుని నిట్టూర్పులుగా నిత్యం వెలువడే అనంత శబ్దరాశి అని వారి నమ్మకం. ఆ శబ్దరాశిని విన్న ఋషులు  దానిని యుగయుగాలుగా అనూచానంగా ఇతరులకు ఉపదేశించారు కనుక ఆ శబ్దరాశికి 'శ్రుతులు' (వినబడ్డవి) అనే పేరు ఏర్పడింది. అయితే ఈ విషయంలో శాస్త్రీయ దృక్పథం ఏమిటంటే వేదాలు కూడా పౌరుషేయాలే. వసిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, అగస్త్యుడు, గౌతముడు, జమదగ్ని, నారదుడు, దేవరాతుడు, పరాశరుడు, అంగీరసుడు, మధుచ్చందుడు మొదలైన పలువురు ఋషులు వివిధ దేశకాలాలలో వాటిని రాయడం జరిగింది. మానవ నాగరికత పురోగమిస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు తాము నేర్చుకుంటున్న కొత్త విషయాలను వీరంతా వేర్వేరు కాలాలలో తమకు ముందరి  కాలంలో చేయబడిన సూత్రీకరణలకు జతపరుస్తూ వచ్చారు. ఈ విశ్వం, ప్రకృతితో మానవ సమాజపు అతి ప్రాచీనమైన అనుభవాలు, అనుభూతుల సారమే వేదాలు. శ్రుతులు ప్రాచీన సమాజపు ప్రాయికమైన విజ్ఞానం కూడా. ఒకసారి వాటికి పవిత్రతను ఆపాదించిన తరువాత వాటి సృష్టికర్త భగవంతుడని భావించడం మొదలైంది. అన్ని మతాలూ ఇలాగే తమ పవిత్ర గ్రంథాలు మానవ సృష్టి కాదనీ అవి దైవకల్పితాలు, దైవాదేశితాలు అనే విశ్వాసాన్ని తమ అనుయాయులలో పాదుకొల్పుతాయి. అయితే వాస్తవానికి అవన్నీ పౌరుషేయాలే అంటే మానవ కల్పితాలే.

వేదార్థాల గురించి గురు ముఖతః తాము విన్న విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఋషులు రాసినవే స్మృతులు (Remembrances or Recollections). వివిధ రచయితల చేత రాయబడిన ధర్మ శాస్త్రాలు, క్రోడీకరించబడిన న్యాయశాస్త్ర కోశాలు, ధర్మ సంహితలు వంటివన్నీ స్మృతుల కిందికే వస్తాయి. స్మృతులనే ధర్మశాస్త్రాలు అనికూడా అంటారు. మను స్మృతి లేక మను ధర్మశాస్త్రము, బాదరాయణ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి  వంటివి ఇందుకు ఉదాహరణలు.

ధర్మము - ధర్మశాస్త్రాలు

ధర్మము అంటే మానవులు నడుచుకోవలసిన విధుల సమాహారం. 'ధరతి విశ్వం ధర్మః' అనీ, 'ధరతి లోకానితి ధర్మః' అనీ ప్రాచీనులు ధర్మాన్ని నిర్వచించారు. అంటే ఈ విశ్వాన్నీ, లోకాలనూ మోసేది ధర్మం అని వారి భావన. రాజు మొదలు సామాన్యుని వరకు అందరూ ధర్మాన్ని పాటిస్తేనే, అంటే తమ తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటేనే ఈ విశ్వం, ఈ లోకాలు తమ తమ నెలవులలో (స్థానాలలో)  భద్రంగా ఉంటాయనే  ఒక నమ్మకం ప్రాచీనుల్లో ఉండేది.

"ఓ లక్ష్మీపతీ! ఈ చతుర్దశ భువనాలకూ ఆదిభూతుడవైన నీవు భవనానికి మొదటి స్తంభంలాగా నిటారుగా నిలువబట్టే కదా-ఈ సకల భువనాలూ ఎలాంటి గెంటు, కుంటు లేకుండా సాఫీగా నెట్టుకొస్తున్నది?" అంటాడు పుండరీకుడు విష్ణువుతో 'పాండురంగ మాహాత్మ్యము' కావ్యంలో( పాం.మా. 2-55).  ఒకదానిపైన మరొకటిగా బల్లపరుపుగా అమర్చబడిన ఈ పద్నాలుగు భువనాలనూ( ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అధోలోకాలను) విష్ణువు ఆది స్తంభంలాగా నిలిచి మోస్తున్నాడని వారు నమ్మారు.

గురుత్వాకర్షణ  సిద్ధాంతం (Theory of Gravitation) కనుగొనబడక పూర్వం భూమి బల్లపరుపుగా ఉండేదనీ, దానిని ఎనిమిది దిక్కులలో (నాలుగు దిక్కులు, నాలుగు మూలలలో) ఎనిమిది బలిష్టమైన ఏనుగులు మోస్తాయనీ వారు నమ్మారు. వీటినే అష్టదిగ్గజాలు లేక దిగ్దంతులు లేక దిక్కరులు అనే వారు. ధర్మచ్యుతి జరిగితే భూభారం పెరిగిపోతుందనీ, అప్పుడు దిగ్గజాలు కూడా ఆ భారం మోయలేక భూమి అధః పతనానికి గురౌతుందనీ వారు భయపడేవారు.

తెనాలి రామకృష్ణకవి 'పాండురంగ మాహాత్మ్యము' కావ్యంలో మరో సందర్భంలో ఇల ( భూమి) జలములలో మునుగకుండా స్థిరముగా నిలిచియుండడం విష్ణుని ఆజ్ఞ కారణంగానేనని పేర్కొన్నాడు. (పాం. మా. 5-90) అంటే ఎప్పుడైనా ధర్మచ్యుతి జరిగినా, భూమి నీటిలో మునిగిపోకుండా విష్ణువు కాపాడతాడని మన ప్రాచీనుల ఆశ.

సూర్య చంద్రులు ఎలాంటి ఆధారం లేకుండా ఆకాశంలో నిలిచి ఉండడం కూడా ప్రాచీనులకు ఆశ్చర్యం కలిగించింది. వాటికి ఆధారభూతమైన ఆ కనిపించని శక్తినే మన ప్రాచీనులు ధర్మం అన్నారు. భగవంతుడితో సహా ప్రతివారూ తమ తమ ధర్మాలు నిర్వర్తిస్తే ఈ సమస్త భువనాలూ భద్రంగా ఉంటాయని వారు నమ్మారు. భూమి మొదలైన గ్రహాలన్నీ బల్లపరుపుగా కాదు; గోళాకారంలో ఉన్నాయనీ, అవి ధర్మం కారణంగా కాదు; పరస్పర గురుత్వాకర్షణ కారణంగా తమ తమ కక్ష్యలలో పరిభ్రమిస్తున్నాయనీ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మన ప్రాచీనులు భూమి  స్థాణువుగా ఉంటుందని దానిని ‘స్థిర’ (Motionless and Immovable) అన్నారు. అయితే భూమి స్థిరమైనదికాదనీ, దానికీ గతి (గమనం) ఉందనీ, అది తన చుట్టూ తాను తిరుగుతూనే, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నదనీ శాస్త్ర విజ్ఞానం అనంతరకాలంలో రుజువుచేసింది.

ప్రాచీనులు ధర్మాన్ని ఒక ధర్మధేనువుగా భావించారు. కృత యుగంలో ఆ ధర్మధేనువు అనే ఆవు నాలుగు పాదాలతో నడిచిందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలతోనూ, ద్వాపర యుగంలో రెండు పాదాలతోనూ నడిచిన ఆ ధర్మధేనువు ప్రస్తుతపు ఈ కలియుగంలో మాత్రం కేవలం ఒంటి కాలుపై కుంటుతూ నడుస్తున్నదని ప్రాచీనుల నమ్మకం.

అథర్వ వేదంలోని ఈ కింది మంత్రంలో భూమిని మోసేదైనట్టి  ధర్మంలో ఏయే అంశాలున్నాయో స్పష్టపరచబడింది. చూడండి.

సత్యం బృహదృతం ఉగ్రమ్

దీక్షా తపో బ్రహ్మ యజ్ఞః

పృథివీం ధారయన్తి  ( అథర్వ వేదం 12-1-1 )

సత్యమూ, గొప్పదీ ఉగ్రమైనదీనైన ఋతము (Cosmic Law), దీక్ష, తపస్సు, బ్రహ్మ, యజ్ఞము - ఈ ఆరూ భూమిని మోస్తున్నాయి. ఈ మంత్రంలోని ‘బ్రహ్మ’ అనే శబ్దానికి అబినాష్ చంద్ర బోస్ వంటి సుప్రసిద్ధ వేదపండితులంతా ప్రార్థన (Prayer) అనే అర్థం చెప్పారు. కనుక ఈ ఆరింటినీ అందరూ పాటిస్తే ధర్మచ్యుతి జరగదనీ, భూమి కిందికి పడిపోకుండా భద్రంగా ఉంటుందనీ వైదిక ఋషుల  భావన. అయితే వేదాలలోని ఋతమ్ (Cosmic Law) అనే భావన గ్రీకుల Logos Doctrine వంటిదే. భగవంతుడు కూడా దానికి లోబడే ఉంటాడు. ధర్మానికి అతీతుడు కాడు. ఇదీ ధర్మాన్ని గురించి మన ప్రాచీనుల విశ్వాసం. అథర్వవేదంలోనే మరో మంత్రంలో ‘పృథివీం ధర్మణా ధృతామ్’ అని పేర్కొనబడింది. ( అథర్వవేదం 12- 1- 17).

ధర్మాలు, సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని రెండు రకాలు. సత్యము, అహింస, అస్తేయము (దొంగతనం చేయకుండా ఉండడం) మొదలైన అందరూ పాటించే ధర్మాలను సామాన్య ధర్మాలు అంటారు. ఒక బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు లేక సన్యాసి పాటించవలసిన ప్రత్యేక ధర్మాలను విశేష ధర్మాలు అంటారు. విశేష ధర్మాలు తిరిగి వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు అని మూడు రకాలు.

ధర్మశాస్త్రాలు ధర్మాన్ని పాటించమనీ, అధర్మాన్ని వర్జించమనీ మనల్ని చోదన చేస్తాయి (పురికొల్పుతాయి). ధర్మవర్తనకు మనం ఏమి చేయాలో, ఏమి చేయరాదో ధర్మశాస్త్రాలు మనకు సూచిస్తాయి. అవి ధర్మమునందు ప్రవృత్తినీ, అధర్మం నుండి నివృత్తినీ కలిగిస్తాయి.

'అహరహః సంధ్యాముపాసీత' అంటూ సంధ్యావందనం చేయమని మనల్ని పురికొల్పడం ద్వారా ధర్మశాస్త్రాలు ధర్మమునందు ప్రవృత్తిని కలిగించినట్లే, 'నేక్షేతోద్యంతమాదిత్యం' అంటూ 'ఉదయిస్తున్న సూర్యుడిని చూడవద్ద' ని మనకు అధర్మాన్నుంచి నివృత్తినీ కలిగిస్తాయని ప్రాచీనుల విశ్వాసం. ధర్మ ప్రవృత్తి, అధర్మ నివృత్తి లక్ష్యాలుగా మనల్ని చోదనచేసేవే ధర్మశాస్త్రాలు. ధర్మానికి మూలమైనది వేదం. 'వేదో ధర్మ మూలమ్' అంటూ సకల ధర్మాలూ వేదం మీద ఆధారపడి ఉన్నట్టివేనని గౌతమ మునీంద్రుడు ప్రవచించాడు. అయితే అన్ని ధర్మాలూ ప్రవచించే వేదాలు ఉండగా ఇంకా ఈ ధర్మశాస్త్రాలతో  అవసరం ఏమిటనే సందేహం మనకి రావచ్చు. శాస్త్రకారులు దీనికీ వివరణనిచ్చారు. అదేమిటో చూద్దాం. వేదాలు సామాన్య ప్రజలకు దుర్గ్రాహ్యాలు (తేలికగా గ్రహింప సాధ్యం కానివి). పైపెచ్చు అవి అనుస్యూతాలు కావు. అంటే వేదాలలో చెప్పాల్సిన ధర్మాలన్నీ ఒకే చోట ఎడతెగకుండా చెప్పబడలేదు. ఒక విషయాన్ని గురించి అక్కడక్కడా చేయబడిన ప్రస్తావనల నుంచి నేర్పుగా ధర్మ సూక్ష్మాలను ఒక చోటికి చేర్చి మనం వాటిని గ్రహించాలి. ఈ పని సామాన్యులకు సాధ్యంకానిదైనందున ముందుగా సూత్రకారులు ఇందుకు నడుం బిగించి, వేద మంత్రాల ఆధారంగా కొన్ని సూత్రాలు రూపొందించారు. మారుతున్న సామాజిక అవసరాల రీత్యా దేశకాలానుగుణములైన మార్పుల ఆవశ్యకతను గుర్తించిన వీరు వేదాలలో చెప్పబడిన మౌలికమైన భావనలకు విరుద్ధం కాని విధంగా రూపొందించిన విధులనే సూత్రాలు అంటారు. 'మానవ కల్పసూత్రం', 'ఆపస్తంబ సూత్రం', ' గృహ్యసూత్రం' వంటివి సూత్ర సాహిత్యానికి ఉదాహరణలు. అయితే ఈ సూత్రాలు (Manuals containing aphoristic rules) కూడా సామాన్యులకు తేలికగా అవగాహన చేసుకొనేటందుకు వీలుకానట్టివైన కారణంగా ఋషులు మరింత సులభశైలిలో స్మృతులు రచించారు. భగవంతుడిని సత్యమని నమ్మిన మన ప్రాచీనులు ఆ భగవంతుడి నుంచి నిట్టూర్పులుగా వెలువడినవనే నమ్మకం కారణంగా అపౌరుషేయాలని తాము నిర్ధారణ చేసిన శ్రుతులను (వేదాలను) జ్ఞానసముపార్జనకు ప్రమాణాలు (Valid Sources of Knowledge) గా స్వీకరించారు. మరి ఈ స్మృతులు శ్రుతులకు భిన్నమైన రీతిలో ఋషులు తయారుచేసినవి కదా? పౌరుషేయాలైన వీటిని మనం ప్రమాణాలుగా భావించవచ్చా? అనే ప్రశ్ననూ ప్రాచీనులు ఆలోచించారు. అపౌరుషేయాలైన వేదాలను ప్రమాణంగా తీసుకుని వీటిని ఋషులు రూపొందించినందున  పౌరుషేయాలైన స్మృతులను కూడా వారు ప్రమాణాలుగానే భావించారు.

మనుస్మృతి

స్మృతులన్నిటిలోకీ 'మానవ ధర్మ సంహిత' అనికూడా పిలువబడే 'మనుస్మృతి' లేక 'మనుధర్మశాస్త్రము' లేక ‘మానవ ధర్మ శాస్త్రము’ అతి ముఖ్యమైనది. సకల మానవాళి ప్రయోజనం కోరి వైవస్వత మనువు ఈ ధర్మశాస్త్రాన్ని రూపొందించి, భృగు మహర్షికి తాను స్వయంగా ఉపదేశించి, మునీంద్రులందరికీ దానిని ఉపదేశించవలసిందిగా ఆఙ్ఞాపించాడని సనాతనుల  విశ్వాసం. అలా ప్రపంచానికి మనుధర్మశాస్త్రం భృగు మహర్షి ముఖతః వెల్లడయిందట. మానవులు ధర్మాధర్మ వివేకము పొందే మార్గాలు, వారు ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తి మార్గంలో ఈ లోకంలోనూ, పరలోకంలోనూ ఐహిక, ఆముష్మిక సుఖాలు పొందడానికి అవసరమైన జాతి - సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు  దీనిలో వివరించబడ్డాయి. బ్రాహ్మణులు మొదలైన నాలుగు వర్ణాల ప్రజలు పాటించవలసిన వర్ణ ధర్మాలు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు మొదలైనవారు పాటించవలసిన ఆశ్రమ ధర్మాలు, తప్పుదలకు వారు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాలు, వారికి లభించగల జన్మాంతర ప్రాప్తి మొదలైన వాటన్నిటి గురించి మనుధర్మశాస్త్రంలో చాలా విపులమైన వివరణలున్నాయి. ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తినా అప్పటికప్పుడు వాటికి తగిన పరిష్కారాలు 'మనుస్మృతి' లో ప్రాణ రక్షక ఔషధం లాగా లభిస్తాయనే నమ్మకం  కారణంగా సనాతనులు వందల ఏళ్లుగా దీనినో 'రెడీ రిఫరెన్స్ గ్రంథం' గా ఉపయోగిస్తూ వచ్చారు. అందుకే  వేదాలలోనూ మనుస్మృతి గురించి 'మనుర్వై యత్కించిదవదత్తద్భేషజం భేషజాతాయా' అని పేర్కొనబడిందని ప్రాచీనుల నమ్మకం. మనుస్మృతి రచనాకాలం ఏదో ఇదమిత్థంగా తేలలేదు. అది క్రీ.పూ. 2 వ శతాబ్ది - క్రీ.శ. 3 వ శతాబ్ది మధ్యకాలంలో గ్రంథరూపాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు. 'మనుస్మృతి' మూలప్రతిలోని శ్లోకాలు ఎలాంటి అధ్యాయాలుగా విభజించబడలేదు. కాగా ఆధునిక ప్రతులన్నింటిలో ఈ గ్రంథం పన్నెండు అధ్యాయాలుగా విభజించబడడం గమనార్హం. మూలప్రతి మొత్తం శ్లోకాల రూపంలో గురు శిష్య సంవాదంగా సాగుతుంది. మొదటి 58 శ్లోకాలు మనువు తన శిష్యుడైన భృగువుకు ఉపదేశిస్తున్నట్లు, ఆ తరువాత ఉన్న రెండువేలకు పైగా శ్లోకాలు భృగుమహర్షి ఇతర ఋషులకు వివరిస్తున్నట్లుగా ఉంటుంది.

మనుస్మృతికి వ్యాఖ్యానాలు

'మనుస్మృతి' చదివి, స్మృతికారుని భావాన్ని గ్రహించడం చాలా కష్టమైన విషయం. అందుకే మనుధర్మ శాస్త్రాన్ని సర్వజనులకూ సుబోధకంచేసే ఉద్దేశంతో పలువురు ప్రాక్పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు దానికి విపులమైన వ్యాఖ్యానాలు రాశారు. వీటిలో మేధాతిథి (క్రీ.శ. 9 వ శతాబ్దం) రాసిన 'మను భాష్యం' అన్నింటికంటే ప్రాచీనమైనది. గోవిందరాజు (క్రీ.శ. 12 వ శతాబ్దం) రాసిన 'మను టీక' మరో ప్రముఖ వ్యాఖ్యాన గ్రంథం. నందనుడు అనే పండితుడు 'మనుస్మృతి' కి 'నందని' అనే పేరుతో ఒక వ్యాఖ్యానం రాశాడు. దానిని 'మన్వర్థ వ్యాఖ్యానము' లేక 'మానవ వ్యాఖ్యానము' అని కూడా అంటారు. అయితే దీని రచనా కాలం ఎప్పుడో స్పష్టంగా నిర్ధారణ కాలేదు. ఇక మనుస్మృతికి సాధికారికమైన వ్యాఖ్యానంగా భావించబడుతున్న గ్రంథం కుల్లూకభట్టు అనే బెంగాల్ కు చెందిన విఖ్యాత సంస్కృత పండితుడు రాసిన 'మన్వర్థ ముక్తావళి' అనే వ్యాఖ్యాన గ్రంథం. ఈ పండితుడు 12 వ శతాబ్దికి చెందినవాడు. ఈయన ' శ్రాద్ధసాగర', 'వివాదసాగర', 'అశౌచసాగర', ' స్మృతిసాగర' వంటి ఇతర ప్రముఖ రచనలెన్నో చేసిన గొప్ప పండితుడు. తన పూర్వ వ్యాఖ్యాతల దోషాలను పరిహరించి కుల్లూకుడు తన వ్యాఖ్యానాన్ని సర్వసమగ్రంగా రూపొందించాడు. ఇప్పటికి మనుస్మృతి వ్యాఖ్యానాలకు సంబంధించి 50 కి పైగా రాతప్రతులు లభించాయి. వాటన్నిటిలోనూ 'మనుస్మృతి' ని 'మానవ ధర్మశాస్త్రం' అనే పేర్కొనడం జరిగింది. వాటిలోకెల్లా విశ్వసనీయమైనది, సమగ్రమైనది, సాధికారికమైనది కలకత్తాలో లభించిన కుల్లూకభట్టు వ్యాఖ్యానం రాతప్రతే.  మనుస్మృతిని వ్యాఖ్యానించిన భారతీయులలో సర్వజ్ఞ నారాయణుడు, రాఘవానందుడు కూడా చెప్పుకోదగినవారు. ఆర్యసమాజ్ స్థాపకులు స్వామీ దయానంద సరస్వతి 'మనుస్మృతి' కి వ్యాఖ్యానం రాయలేదు గానీ, తాను రాసిన 'సత్యార్థ ప్రకాశము', 'సంస్కార విధి', 'ఋగ్వేదాది భాష్య భూమిక' మొదలైన గ్రంథాలలో సందర్భాన్నిబట్టి సుమారు 400 శ్లోకాలు 'మనుస్మృతి' నుంచి ఉటంకించి, వివరించడం జరిగింది.

భారతీయ వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యానాలలో పేర్కొన్న శ్లోకాలలో పలు పాఠాంతరాలున్నాయి. శ్లోకాల వరుస సంఖ్యలోనూ కొన్ని తేడాలున్నాయి. అయినా 'మనుస్మృతి' సారాన్ని సాకల్యంగా గ్రహించడానికి కుల్లూకభట్టు వ్యాఖ్యానమైనట్టి 'మన్వర్థముక్తావళి' ని మించిన గ్రంథం మరొకటి లేదని పండితాభిప్రాయం.

'మనుస్మృతి' - నా అధ్యయనం

'మనుస్మృతి' తెలుగు, ఆంగ్ల అనువాదాలను నేను గతంలో కూడా స్థూలంగా అధ్యయనం చేసినా, గత కొంత కాలంగా పలు సందర్భాలలో తిరిగి వాటిని లోతుగా అధ్యయనం చేయడం అవసరమైంది.  మన ప్రాచీనుల ఆహార, ఆరోగ్య అలవాట్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, వారు పాటించిన చక్కటి ఆరోగ్యసూత్రాల గురించి నేటి తరానికి వివరంగా తెలిపే సందర్భంలో ఆ గ్రంథంలోని అంశాలను నేను మరోసారి లోతుగా పరిశీలించాను. అదేవిధంగా జ్యోతిషం, హస్తసాముద్రికం పేరిట మోసానికి పాల్పడేవారి  పట్ల సమాజం ఎంత మెలకువగా ఉండాలో ఆనాడే  మనువు హెచ్చరించిన విషయాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాసేందుకు కూడా మనుస్మృతి అధ్యయనం నాకు తోడ్పడింది. అలాగే మనుస్మృతి దహనంపై నేను వివరణాత్మకంగా వ్యాసం రాసినప్పుడు కూడా నేను మనుస్మృతిని కొంతమేరకు లోతుగా అధ్యయనం చేశాను. గోవధ, గోమాంస భక్షణంపై ప్రసార, ప్రచార మాధ్యమాలలో తీవ్ర దుమారం రేగుతున్న రోజుల్లో మన ప్రాచీనుల మాంస భక్షణం గురించిన అసలు నిజాలు వెలికితీసేందుకు నాకు మనుస్మృతి అధ్యయనం ఉపయోగపడింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశ వివాదం సందర్భంగా స్త్రీల పట్ల మనువు అవలంబించిన వైఖరిని గురించిన వాస్తవాలు గ్రహించి, విమర్శనాత్మక వ్యాసం రాసేందుకు  కూడా మనుస్మృతి అధ్యయనం నాకు ఎంతగానో ఉపకరించింది. 2008 లో సమాజంలోని వివిధ శ్రామిక వర్గాల ప్రజల జీవనశైలిపై నేను 'శ్రమవీరులు' అనే పుస్తకం రాసినప్పుడు ప్రాచీనకాలంలో ఆ యా వృత్తిదారుల జీవనవిధానం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు నాకు 'మనుస్మృతి' అధ్యయనం ఎంతగానో తోడ్పడింది. భారతీయ శిక్షాస్మృతిపై నేను వ్యాసాలు రాసినప్పుడూ, ఇంకా మరికొన్ని ఇతర సందర్భాలలోనూ 'మనుస్మృతి' అధ్యయనం నాకు అక్కరకొచ్చింది. అయితే ఇటీవలే నాకొక ఆలోచన వచ్చింది. అదేమిటంటే నేటి తరం పాఠకులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో 'మనుస్మృతి' లోని నేటి సమాజం గర్హించదగిన అంశాలతో పాటు, నేటికీ పనికొచ్చే, ఉపయోగితా విలువలున్న అంశాలనూ, ఆ గ్రంథం చదివి ప్రతివారూ తెలుసుకోదగిన పలు సామాజిక, చారిత్రకాంశాలనూ సమగ్రంగా, హేతుబద్ధంగా వాడుకభాషలో వివరిస్తూ ఒక గ్రంథం రాయాలని అనిపించింది.  అదీ ఈ గ్రంథ రచనకు నన్ను పురికొల్పిన నేపథ్యం.

నా  అధ్యయనానికి  తోడ్పడిన గ్రంథాలు

‘మనుస్మృతి’ అధ్యయనంలో నాకు ప్రధానంగా మూడు గ్రంథాలు తోడ్పడ్డాయి. అవి :-

  1. కుల్లూకభట్టు మూల సంస్కృత వ్యాఖ్యానసహితంగా అలనాటి మదరాసు పచ్చయప్ప కళాశాల ఆంధ్రోపన్యాసకులు కీ. శే. సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి గారు 'మన్వర్థ నిరూపణము' పేరిట కుల్లూకభట్టు వ్యాఖ్యానానికి చేసిన తెలుగు అనువాదాన్ని 1928 (విభవ నామ సంవత్సరం) లో చెన్నపురి (మదరాసు) వావిళ్ళవారి సంస్థ ప్రచురించింది. బాలసరస్వతి బుక్ డిపో, కర్నూలు/మద్రాసు వారు దాని పునర్ముద్రణ హక్కులుపొంది నాటినుంచి ఆ గ్రంథాన్ని పునర్ముద్రిస్తూ ఉన్నారు. పరిశోధకులకు ఇదొక విశ్వసనీయమైన ఆధార గ్రంథం. 2000 లో దీనిని నేను కొనుక్కున్నాను. నాటినుంచీ నా అధ్యయనానికి నాకు అదెంతగానో ఉపయోగపడుతున్నది.
  2. కుల్లూకభట్టు రాసిన'మన్వర్థ ముక్తావళి' ని ఆధారం చేసుకుని 'విశుద్ధ్ మనుస్మృతి' పేరిట సుప్రసిద్ధ ఆర్య సామాజికులు పండిట్ గంగాప్రసాద్ ఉపాధ్యాయ 'మనుస్మృతి' లోనిప్రక్షిప్త శ్లోకాలను తొలగించి, వాటిని వేరుగా చూపి, మిగిలిన శ్లోకాలకు మాత్రమే హిందీలో సంక్షిప్త తాత్పర్యం ఇస్తూ, విపుల భూమికతో ఒక గ్రంథం రాశారు. దానిని పండిట్ ఆరమండ్ల వెంకయ్యార్య తెలుగులోకి అనువదించగా కవితా గ్రంథ మండలి, తెనాలి వారు 1994 లో దానిని ప్రచురించారు. కీ.శే. వెంకయ్యార్య గారి కుమార్తె శ్రీమతి చిరుమామిళ్ల వనకుమారి 2009 లో దాని ద్వితీయముద్రణ ప్రతిని నాకు బహూకరించారు. దానిలో శ్లోకాల తాత్పర్యం అతి సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, భూమిక యొక్క విస్తృతి రీత్యా 'మనుస్మృతి' ని అవగాహన చేసుకొనేటందుకు ఆ భూమిక నాకెంతగానో  తోడ్పడింది. అవసరమైనప్పుడు శ్లోక పాఠాల, తాత్పర్యాల సాపేక్ష అధ్యయనం (Relative Study) కోసం ఈ పుస్తకాన్ని కూడా నేను వినియోగించుకున్నాను.
  3. 'మానవ ధర్మశాస్త్రం' పై వివిధ వ్యాఖ్యాతలు రాసిన 'మన్వర్థముక్తావళి' మొదలైన ఏడు వ్యాఖ్యాన గ్రంథాలను ఆధారంచేసుకునిప్రొఫెసర్ జొహాన్ జార్జ్ బుహ్లర్ (బ్యులర్) (Professor Johann Georg Buhler 1837-1898) అనే జర్మన్ ఇండాలజిస్టు 'The Laws of Manu' అనేగ్రంథం ఆంగ్లంలో రాశాడు. ఆ గ్రంథం ఎఫ్. మాక్స్ ముల్లర్ (F. Max Muller) ప్రధాన సంపాదకత్వంలో 50 సంపుటాలుగా వెలువడిన Sacred Books of the East (ప్రాచ్యదేశాల పవిత్ర గ్రంథాలు) లో 25 వ సంపుటిగా ప్రచురించబడింది. ఒకప్పుడు ఆక్స్ ఫర్డ్ క్లారెండన్ ప్రెస్ వారు ప్రచురించిన ఈ పవిత్రగ్రంథాల సంపుటాలను 1962 నుంచి మోతీలాల్ బనారసీ దాస్ సంస్థ వారు పునర్ముద్రిస్తూ ఉన్నారు. గతంలో లైబ్రరీలకు వెళ్లి రోజుల తరబడి ఆసక్తిగా చదువుకున్న ఈ 50 సంపుటాల సెట్ ను 2006 జనవరిలో నేను విజయవాడ  పుస్తక ప్రదర్శనలో కొనుక్కున్నాను. బ్యులర్ గ్రంథం చాలా విస్తృతమైన అధ్యయనం. 'మనుస్మృతి' పై ఉన్న ఏడు వ్యాఖ్యానాలనూ లోతుగా పరిశీలించిన ఈ రచయిత గ్రంథాదిలో Introduction పేరిట 130 పేజీల విపుల పరిచయాన్ని రాశాడు. దీనిలో శ్లోకాల సంస్కృత పాఠాలు ఇవ్వనప్పటికీ వాటి వరుసక్రమం చెడకుండా మొత్తం 12 అధ్యాయాలలోని అన్ని శ్లోకాలకూ ఆంగ్లానువాదం ఇవ్వడం విశేషం. ప్రతి పుటలో అధోజ్ఞాపికలకు ఇచ్చిన వివరణలలో ఆ యా శ్లోకాల విశ్వసనీయతను పలువురు వ్యాఖ్యాతల వ్యాఖ్యానాల ఆధారంగా లోతుగా చర్చించడం జరిగింది. మనుస్మృతి లోని అంశాలను ఇతర ధర్మశాస్త్రాలలోని అంశాలతో మనం సరిపోల్చి చూసుకునేందుకు (Cross Verification) వీలుగా ఎన్నో వివరాలు పొందుపరచబడ్డాయి. Appendix పేరిట ఈ గ్రంథానికి ఇవ్వబడిన అనుబంధంలో ఇతర హిందూ న్యాయశాస్త్ర గ్రంథాలలో 'మనుస్మృతి' లోని పలు అంశాలు ఎక్కడెక్కడ ఉటంకించబడ్డాయో వాటన్నిటినీ పాఠకుల ప్రయోజనార్థం పొందుపరచడం జరిగింది. 'మనుస్మృతి' లోనూ మిగిలిన ధర్మశాస్త్రాలు, స్మృతులలోనూ, ప్రత్యేకించి 'మహాభారతం', 'పరాశరస్మృతి', 'మానవ శ్రాద్ధ కల్పం', ఉపనిషత్తుల వంటి గ్రంథాలలోనూ సమాంతరంగా ఉన్న అంశాలను  Synopsis of Parallel Passages అనే పేరుతో ఒక ప్రత్యేక అనుబంధంలో వివరించడం జరిగింది. ఇక ఇండెక్స్ లో మనువు తన స్మృతిలో ప్రస్తావించిన పలు అంశాలను రచయిత అక్షరక్రమంలో  పొందుపరిచాడు. ఆ తరువాత చేర్పులూ, దిద్దుబాట్లూ ఇచ్చారు. చివరిగా Transliteration of Oriental Alphabet పేరిట ప్రాచ్య భాషల అక్షరమాలకు ఇవ్వబడిన లిప్యంతరీకరణ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంది. విలియం జోన్స్ వంటి పలువురు ఇతర పాశ్చాత్య పండితులు కూడా 'మనుస్మృతి' ని అనువదించినా అవేవీ ఇంత వివరణాత్మకం కావు.

ఈ మూడు గ్రంథాలేకాక నా దగ్గరున్న డా. యన్.యల్. నరసింహాచార్య రాసిన 'పరాశరస్మృతి'  తెలుగు తాత్పర్యం, కీ.శే.చల్లా లక్ష్మీనృసింహ శాస్త్రి ఆంధ్రీకరించిన 'పరాశర స్మృతి' కి మాధవాచార్య రాసిన వ్యాఖ్య గ్రంథాలను కూడా అవసరాన్నిబట్టి వినియోగించుకున్నాను. వామన్ శివరామ్ ఆప్తే గారి ‘The Practical Sanskrit - English Dictionary’, Monier Williams సంకలనం చేసిన English - Sanskrit Dictionary వంటి పలు ప్రామాణిక నిఘంటువులే కాక సంప్రదాయ సాహిత్యంలోని పలు గ్రంథాలూ నాకు ఈ అధ్యయనంలో తోడ్పడ్డాయి.

విశ్లేషణలో శాస్త్రీయ దృష్టి

ఈ గ్రంథంలో 'మనుస్మృతి' లో చెప్పబడిన పలు ఆసక్తికరమైన అంశాలను ఆధునిక పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో, వీలైనమేరకు సామాన్యుల భాషలోనే వివరించేందుకు నేను ప్రయత్నించాను. స్మృతిలోని ప్రతి అంశాన్నీ శాస్త్రీయ దృష్టితో పరిశీలించి, నాదైన శైలిలో ఆ యా అంశాల మంచి చెడ్డలను పాఠకులకు వివరించే ప్రయత్నం చేశాను. స్మృతికారుడి దేశ కాల పరిస్థితుల నేపథ్యం, ఆనాటి సామాజిక అవసరాల గురించిన ఎరుకతోనే నా విశ్లేషణ మొత్తం సాగింది. సుదీర్ఘమైన కాల వ్యత్యాసం కారణంగా నాటి కొన్ని ఆచారాలు, పద్ధతులు తప్పనిసరిగా ఈనాడు మనకి అనాగరికంగా తోస్తాయి.

ఒకసారి భారతదేశంలోకి  ప్రవేశించిన ప్రతి జాతి ఇక్కడే స్థిరపడ్డదన్నది చారిత్రకసత్యం. శ్రీలంకకూ, ఆగ్నేయ ఆసియాకూ వలసవెళ్లి స్థిరపడిన కొద్దిమందిని మినహాయిస్తే  భారత దేశంపై దండెత్తి వచ్చినవారుగానీ, శరణార్థులుగానీ మొత్తంగా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయారు. కొన్ని విదేశీ జాతులు క్షాత్రధర్మం పాటించి స్థానిక క్షత్రియులలో కలిసిపోయారు.  భారత జాతి దండెత్తివచ్చిన శకులు, హూణులు, పహ్లవులు వంటి విదేశీ జాతులనన్నిటినీ తనలో ఇముడ్చుకుంది. ఓడి, ‘దాసోహం’ అన్న ప్రజలందరినీ అంతకు పూర్వం ఉన్న దాస దశ్యులలో చేర్చడం అనంతరకాలంలో వారంతా శూద్రవర్ణంగా రూపొందడం జరిగింది. నాటి సమాజంలో బానిసలకు పుట్టినవారు, తమ వర్ణమేదో ఇదమిత్థంగా తెలియని తల్లిదండ్రులకు జన్మించినవారు శూద్రులుగానే పరిగణించబడ్డారు. ప్రతిలోమ వివాహాలలో జన్మించినవారిని కూడా వర్ణచ్యుతులుగా భావించి శూద్రులలోనే కలిపేశారు. (అగ్రవర్ణ పురుషుడికీ, నిమ్న వర్ణ స్త్రీకీ జరిగే వివాహాన్ని అనులోమ వివాహం అనీ, నిమ్నవర్ణ పురుషుడికీ అగ్రవర్ణ స్త్రీకీ జరిగే వివాహాన్ని ప్రతిలోమ లేక విలోమ వివాహం అనీ అంటారు). సమాజంలో పై మూడు వర్ణాల సంకరం కారణంగా సమాజంలో అంతకుపూర్వం లేనట్టి ‘కులం’ అనే సరికొత్త సామాజిక వర్గం  ఆవిర్భవించింది.  లెక్కలేనన్ని కులాలతో నాలుగో వర్ణమైన శూద్రుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోయింది. సమాజంలోని నాలుగువర్ణాల మధ్య పనివిభజనకు పూనుకున్న మను ధర్మశాస్త్రం ‘ శూద్రంతు కారయేద్దాస్యమ్’ (8-413) అంటూ శూద్రులకు అన్యాయంగా దాస్యవృత్తిని అంటగట్టింది. ‘మనుస్మృతి’ ప్రకారం శూద్రుడికి భగవంతుడు ఒకటే ధర్మం విధించాడు.  ఏ పనీ ఇది తప్పు అనుకోకుండా, గుణనింద చేయకుండా,  పై మూడు వర్ణాల వారికీ శుశ్రూషలు చేయడమే శూద్రుడి ధర్మమని మనుస్మృతి పేర్కొంది (1-91).  అలాగే ‘ దాస్యం శూద్రం ద్విజన్మనామ్’ (8-410) అంటూ ద్విజ వర్ణాలవారిని సేవించడమే శూద్రుడి ధర్మమని మనుస్మృతి పేర్కొంది.

(ద్విజులు అంటే యజ్ఞోపవీతం లేక జందెం ధరించడానికి అర్హులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు). బాహ్య, అంతరంగ శౌచాలు పాటిస్తూ, మృదువైన మాటలతో అహంకారం లేకుండా, బ్రాహ్మణులు మొదలైన మూడు వర్ణాల వారిని ఆశ్రయించి, వారికి శుశ్రూషలు చేసే శూద్రుడికి (తదుపరి జన్మలో) ఉత్తమ వర్ణం సంప్రాప్తిస్తుందని మనుస్మృతి ( 9-335) పేర్కొంది. ఇదీ నాటి సామాజిక స్థితిలో శూద్రులకు జరిగిన అన్యాయం.

అంటరానితనం, అణగారిన జాతులపట్ల దౌర్జన్యం వంటి ఎన్నెన్నో సామాజిక జాడ్యాలకు పునాది అయినట్టి మనుస్మృతిని తగులబెట్టి సర్వనాశనం చేయాల్సిందేగానీ, ఇంకా దానిలోని బాగోగుల గురించి విచారణ అనవసరమని కొందరి దృఢాభిప్రాయం. నా దృష్టిలో దేనినైనా సర్వనాశనం చేయాలనుకోవడం ధ్వంసతావాదం తప్ప వేరొకటికాదు. ఆ గ్రంథాన్ని తగలబెట్టినంత మాత్రం చేత ప్రజల మనసుల్లోంచి దానిని తుడిచేయలేమని నా అభిప్రాయం.  పైపెచ్చు తెలిసీ తెలియని కొందరు అలాంటి విధ్వంస చర్యలను తమ విశ్వాసాలను దెబ్బతీసేవిగా భావించి అది మరింత ప్రతికూల పరిణామాలకు దారితీసే ప్రమాదముంది. మహారాష్ట్రలో జరిగిందదే. 1927 లో మనుస్మృతి దహనం తరువాత అక్కడి సమాజం ఏళ్లతరబడి అల్లకల్లోలం అయింది. కనుక ధ్వంసతావాద మార్గం కాక, ఇలాంటి గ్రంథాల విషయంలో వాటిలో ఉన్న ఏ కాస్త మంచినైనా స్వీకరిస్తూ నేటి కాలానికి పనికిరాని చెడుని నేర్పుగా వేరుచేసి విసర్జించమని ఉద్బోధించే  గతితార్కిక, చారిత్రక భౌతికవాద దృక్పథం సరైన మార్గమని నా విశ్వాసం. ఈ గ్రంథం ద్వారా నేను ‘మనుస్మృతి’ లో పేర్కొనబడిన పలు అంశాలను శాస్త్రీయ దృష్టితో మూల్యాంకనం చేసి, అసలు వాటిలో ఏవైనా నేటి సమాజానికి పనికొస్తాయా? పనికొస్తే ఏ మేరకు పనికొస్తాయి? అనే విషయాన్ని వివరించాను. అది కాక ‘మనుస్మృతి’ లో ప్రస్తావించబడిన ప్రాచీన భారతదేశ చరిత్ర పై ఆసక్తి కలిగినవారు ఇష్టపడే పలు విషయాలను కూడా నేను ఈ సందర్భంగా వివరించాను. ఏ విషయం పైనైనా ఎవరి అభిప్రాయం ప్రకటించే స్వేచ్ఛ వారికుంటుంది.  సత్యాన్వేషణే ధ్యేయంగా సుహృద్భావ వాతావరణంలో జరిగే చర్చ ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుందనీ, సత్యానికి మనల్ని మరింత చేరువచేస్తుందనీ  నేను నమ్ముతాను. ఈ సందర్భంగా నాణానికి మరోవైపు కూడా మనం చూడాలి. కాలం చెల్లిన ధర్మసూత్రాలను ఆధునిక  సమాజానికి కూడా యథాతథంగా అనువర్తింప జేయాలని ఇంకా ఎవరైనా సనాతనవాదులు భావిస్తుంటే అది కేవలం వారి మూర్ఖత్వమేనంటాను నేను. మారుతున్న సమాజంతో పాటు ధర్మం మారదనీ, అది మారితే వినాశం తప్పదనే  యథాతథవాదుల వాదన సరికాదు. ధర్మం, ధర్మశాస్త్రాలు సామాజిక అవసరాలనుబట్టి మానవులు ఏర్పరచుకున్నవే. మారుతున్న సామాజిక అవసరాలనుబట్టి నేటి సమాజానికి అవసరమైన కొత్త నియమాలు ఎప్పటికప్పుడు రావలసిందే. కాలంచెల్లిన, ప్రస్తుతం ఆచరణసాధ్యంకాని, అక్కరలేని సాంఘిక నియమాలు, కట్టుబాట్లు తొలగిపోవలసిందే.  ధర్మశాస్త్రాలలోని నియమాలు శాశ్వతంగా ఎదురులేకుండా  చెల్లుబాటు కావడం కోసం వాటికి దైవ శాసనాలుగా, అపౌరుషేయాలుగా ముద్రవేశారు గానీ వాస్తవానికి అప్పటి సామాజిక అవసరాలకు అనుగుణంగా స్మృతికారులు ధర్మశాస్త్రాలను రూపొందించారు. మారిన పరిస్థితులలో ధర్మశాస్త్రాలలోనూ మార్పు రావాలి. లేకపోతే అవి విశ్వసనీయత కోల్పోయి అంతిమంగా ఉనికిని  కోల్పోతాయి.

స్మృతికారుడైన వైవస్వత మనువు చరిత్ర గురించి, ఏ సందర్భంగా ఆయన ఈ స్మృతిని రూపొందించాడనే విషయం గురించి, అన్ని మత గ్రంథాలలో ప్రస్తావనకు వచ్చిన మహత్తర  జలప్రళయం (Great Deluge) గురించి, డా. అంబేద్కర్ నిర్వహించిన మనుస్మృతి దహనం పూర్వాపరాల గురించి, మరికొన్ని ప్రత్యేక వ్యాసాలను ఆసక్తిగల పాఠకులకోసం అనుబంధాలుగా పొందుపరచాను.

సదసద్వివేచనాపరులైన తెలుగు పాఠకులు నా అన్ని మునుపటి రచనలలాగే ఈ  ప్రస్తుత రచనను కూడా ఆదరించి, ఆస్వాదిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.

***సశేషం***

Posted in August 2019, సాహిత్యం

2 Comments

  1. సత్య

    రవీంద్రనాథ్ గారు –
    నమస్తే
    మనుస్మృతి పై మీరు వ్రాసిన వ్యాసము చాలా timely . మన ప్రాచీన శాస్త్రాలు, స్మృతులు ఇంకా విలువైన గ్రంధాల పైన ఇటువంటి విమర్శనాత్మక వ్యాసాలు మంచి మేలు చేస్తాయి. నిజానికి ఈ ఆధునిక కాలములో ఇటువంటి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో వున్నాయి. కానీ unfortunately చాలా మంది pre conceived notions తో అసలు ఆ గ్రంధాలే చదవరు. దురదృష్టవశాత్తు ఒకానొక సమయములో మన ప్రాచీన గ్రంధాలలో చాలా స్వార్ధపరులు వారిష్టానుసారము వారికి తోచిన, కావలసిన మార్పులు చేర్పులు చేసివుండొచ్చు. ఈ విధముగా వారు మన ప్రాచీన సాహిత్యానికి చాలా నష్టము చేసారు . వారి స్వార్ధబుద్ధితో ఆ సమయానికి వారికి చాలా లాభాలు కలిగివుంటాయి. ఎందుకంటే Anyone who enjoys certain privileges never wants to loose . వంశపారంపరంగా వస్తూవున్న లాభాలను ఎవరూ వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ వారు చెయ్యవలసిన గురుతర బాధ్యతలు మాత్రము పాటించరు. ముఖ్యముగా వర్ణ వ్యవస్థ పైన , స్త్రీ దురాచారాల పైన చాలా స్వార్ధపూరిత దృష్టితో ఇటువంటి గ్రంథాలను వారికి అనుకూలముగా మార్చివుండవచ్చు. నిజానికి ఋషులు ఏ ఒక్క సామాజిక వర్గానికో మేలుచేయాలని పక్షపాత ధోరణితో society rules అడ్డదిడ్డముగా వాళ్లకిష్టమొచ్చినట్లు వ్రాయరు. అలా చేస్తే అది నిరంకుశత్వము అవుతుంది. వాటిని భగవంతుని వాక్యాలు గా ఎప్పటికీ చెప్పకూడదు . అలాంటి rules తో ఏ సమాజము ఎక్కువ కాలము సంతోష సామరస్యాలతో మెలగలేదు . అదే విధముగా స్త్రీ వివక్ష కూడా. సాంఘిక ఆచారాలు , వ్యవహారాలు , నమ్మకాలు socioeconomic conditions పై ఆధారపడి వుంటాయి .

    ‘మనుస్మృతి’ నిజానికి ‘మానవ ధర్మశాస్త్రం’ గా frame చేయబడి వుండవచ్చు. కానీ స్వార్థపూరితులైన కొంతమంది పండితులు (ఋషులు కాదు) చేసిన మార్పుల వలన స్త్రీల దృష్టిలో ‘మనుస్మృతి’ గ్రంథం పురుషాహంకారానికి సంకేతం గా నిలిచింది. అలాగే దళితులు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రజల దృష్టిలో కూడా. కానీ దానిని తగలబెట్టడం సమంజసము కాకపోవచ్చు. మీరన్నట్లు ‘మనుస్మృతి’ పట్ల ఆ యా సామాజిక వర్గాలకున్న వ్యతిరేకత సమంజసమైనా అందులో సమాజానికి ఉపయోగపడే అంశాలు , సూత్రాలు చాలా వుండివుండవచ్చు. కంటిలో నలక పడిందని మొత్తం కన్నుని పీక కూడదు కదా . ఇది ఒక విలువైన ఆధారగ్రంథం (A valuable Source Book). మీరన్నట్లు మన గతమంతా ఘనమైనది కాదు, చెత్తా కాదు. We have to learn from history to correct mistakes but not to repeat. మన తల్లి తండ్రులు చెప్పిన పనికివచ్చే గుణపాఠాలను తీసుకుని, వాటిని ఆధునిక సామాజిక అవసరాలకు అనువైన రీతిలో నవ్య సామాజిక నియమావళితో మేళవించి ఉపయోగించుకుంటూ పాత కొత్తల మేలు కలయికగా సమాజం ముందుకు సాగాలి. (మీ మాటలే)

    వేదాలు ఆపౌరుషేయాలైనా మన దాకా వచ్చేసరికి ఎన్ని మార్పులు , చేర్పులు వచ్చాయో ఆ వేదపురుషునికే తెలియాలి.

    It should be considered as Ancient Social code like the Indian Penal Code. As code can be amended based on existing socio economic conditions , Manu Smruthi should have been upgraded fixing the bugs and new requirements.

    నిజానికి మన దేశంలోకి పాశ్చాత్త్య దేశస్థులు రాకపోయి మన సమాజములో ఆధునిక విజ్ఞానము , విద్య అందరికీ అందుబాటులోకి రాకుండా వుండివుంటే ఈ విధంగా ఆలోచించేవారు ఎవరైనా వుండేవారు కాదేమో. అప్పుడు రాజే దైవము గా భావించేవారు కదా.

    ఎవరైతే అణగదొక్కారు అని ముద్రవేయపడ్డారో వారే ఆధునిక విద్య ద్వారా progressive and forward గా అలోచించి సమాజములో మంచి మార్పులు తీసుకువచ్చారు. గురజాడ , కందుకూరి , రామ్మోహన్ రాయ్, చలం ఇలా చాలా మంది British వారు మనల్ని ఏలుతున్నప్పుడే సంఘ సంస్కరణలు తెచ్చారు.

    సత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *