Menu Close
Bulusu Sarojini Devi
గోపురం(ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ప్రాంజల్ వాస్కో మార్కెట్ లోకి వెళ్ళాడు. మార్కెట్ సందులు గొందులతో సొరంగమార్గం లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. వీరాభిమాన్యు సినిమా గుర్తుకు వచ్చింది. లోపలికి వెళ్ళాక బయటకు వచ్చే మార్గం కనిపించక గిరికీలు కొట్టుకుని ఇంత మార్కెట్టా? అనుకున్నాడు. దొరకని వస్తువు లేదు. కానీ అన్నీ ఆకాశం అంటే ధరలే!!

ఫారినర్స్ ఎంతైనా కొనుక్కుని పోగలరు. మార్కెట్లో నోటికి వచ్చిన రేటు చెప్పడం విన్నాడు. ఆ పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్ లోకి సరదాగా కలియ తిరిగాడు. ప్రతిదీ దొరుకుతుందే అనుకున్నాడు కందా, బచ్చలిని చూస్తూ. వెంటనే తల తిప్పేసాడు. తనకి కావాల్సిన బట్టలు కొనుక్కున్నాడు. జనాల్ని చూస్తే తెలిసింది మనం ఏదైనా, ఏమైనా, ఎలాగైనా వేసుకుని తిరగొచ్చని. మన వేషం, భాషా పట్టించుకునే వారు ఎవరు లేరని.

అంతా ఫ్యాషన్ పెరేడ్ లాగా ఉంది. మర్నాడుపొద్దున్నే కొలీగ్ శ్యామ్ వచ్చేసాడు.

"బాసూ! ఒంటరిగా పోతే మజా లేదు. కాస్సేపు నవ్వుకోడానికి మన తెలుగు సెటైర్ లు లేవు. తెలుగు సామెతలు చెప్పుకుని కిసుక్కున నవ్వుకోడానికి పక్కన ఒకరుండాలి. ఇద్దరం కలిసి పోదాం!" అన్నాడు.

ఇద్దరూ రెండు వారాల కోసం అద్దె కారు తీసుకొని 'చలో జాన్!' అనుకున్నారు.

వారికి "భాగా" బీచ్ లో ఒక ఫారిన్ జంట కలిశారు.

మిస్టర్ పాల్! మిస్ కేథరిన్!

"ఓరినీ... చూశావురా తంబీ. పెళ్ళాడకపోయినా ఇలా జంటలు దేశం కానీ దేశం వచ్చి తిరగొచ్చు. ఈ పాల్ ని చూస్తే జెలసీ వచ్చేస్తోందేహే!" అన్నాడు.

శ్యామ్ పాల్ తో హస్క్ వేస్తుంటే ప్రాంజల్ కేథరిన్ తెల్లని నునుపైన ఒంటి అణువణువూ చూస్తున్నాడు. ప్రాంజల్ కి తనలో ఇటువంటి ఒక కొత్త కోణం ఉందని తనకే తెలియదు.

బ్లూ ఐస్, రోజా లిప్స్, రెడ్ హేట్, బుజ్జి షార్ట్ ఓహోహో వెరీ టైట్ బ్లౌజ్.

"తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఉందిరా శ్యామా! ఇటువంటివి చూడ్డానికి వెస్ట్రన్ సినిమాలు చూస్తాం. కానీ గోవా వస్తే చాలు. ప్రత్యక్షంగా చూడొచ్చు. మనం ఇక్కడే ఉండి పోతే ఎంత బాగుంటుంది రా!”అన్నాడు.

శ్యామ్ ఫక్కున నవ్వాడు.

కేథరిన్ అదోలా అనుమానంగా చూసి విషయం ఏమిటని అడిగింది.

"వాట్ ఏ బ్యూటిఫుల్ స్కై! అండ్ గ్రీనిష్ బ్లూ సీ వాటర్.”

నేనెప్పుడూ ఇంత అందమైన ప్లేస్ చూడలేదని ఈత కొట్టాలని ఉందని చెప్పాను. ఈత నాకు రాదని, సముద్రం చూస్తే భయం అని వాడికి తెలుసు అందుకే గట్టిగా నవ్వాడు! నవ్వుతూ చెప్పాడు.

ఆ అమ్మాయి మొహం విప్పారింది.

"ఓహ్!" అంది. నలుగురూ కలిసి బీచ్ అంతా తిరిగారు.

"ఏమి డ్రెస్ రా అదిరిపోలా!" అన్నాడు ప్రాంజల్.

అతడిలో ఇంక టాటా చెప్తూ పోబోతున్న యవ్వనం ఆఖరి చిందులు తొక్కుతోంది. అరేబియా మహా సముద్రాన్ని కళ్ళారా చూస్తున్నాడు.

"పద్నాలుగు బీచ్ లు ఉన్న గోవా అంటే ప్రాణం పెట్టేలా లేదూ?" అన్నాడు.

"కొంపదీసి ఇక్కడే ఉండి పోతావా ఏంటి?" అన్నాడు శ్యామ్.

“ఇంకో వారం ఎక్స్ ట్రా ఉంటాను రా. నేను చస్తే ఈ మోడ్రన్ కల్చర్ ని మిస్ కాను. ఎలాగైనా విదేశాలకి వెళ్లి పోతాను. జీవితాన్ని తనివితీరా అనుభవిస్తాను!" అన్నాడు.

ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. నోరెళ్ళబెట్టాడు శ్యాం.

బాగా చీకటి పడ్డాక హోటల్ కి వెళ్లేముందు తాను తీసిన మొత్తం వీడియో ఇంకా తన స్వగతం కూడా రికార్డ్ చేసి చేసినదంతా పంపేశాడు ధృతి కి.

'తన అసలు స్వరూపం ఇదే' అని నొక్కి వక్కాణించాడు. దీన్ని దాచిపెట్టి ధృతి ని మోసం చేయలేనని చెప్పాడు.

★★★

మర్నాడు, ప్రాంజల్ డార్క్ రోజ్ కలర్ షార్ట్, లెమన్ ఎల్లో, డార్క్ ఆరెంజ్ కలర్ ల పూలచొక్కా వేసుకున్నాడు.

తలకి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం లేటెస్ట్ డిజైన్ కటింగ్ చేయించుకుని చెవికి ఒక వెండి లోలాకు పెట్టుకుని చేతికి వేళ్ళకి పెద్దపెద్ద ఉంగరాలు, బుగ్గలకి కనీ కనిపించని గులాబీ రంగు, కళ్ళకి సుర్మా పెట్టుకుని స్కెచ్చెస్ బూట్లు వేసుకుని తనని తను అద్దంలో చూసుకున్నాడు.

"టింగు రంగా!" అని తెలుగులో అరిచాడు. హోటల్ బాయ్ అర్థం కాకపోయినా తను కూడా జోరుగా ఈల వేసాడు. శ్యాం తన రూం లోనుంచి వచ్చి ప్రాంజల్ ని చూసి అవాక్కయ్యాడు.

ఈ లోపు కేథరిన్ ఫోన్.

"మనం ఇప్పుడు 'పనజి' అంటే గోవా రాజధాని కి పోతున్నాం! అక్కడ వెరీ గుడ్ పబ్ కి పోతున్నాం!" అంది.

ఎగిరి గంతేశాడు ప్రాంజల్.

"పనజి అనబడే పంజిమ్ అన్నమాట. నేను ఇలాగే విన్నాను. నైట్ క్లబ్బులు ఉంటాయి. పొద్దున్న వరకు వెస్ట్రన్ మ్యూజిక్ తో మనం ఒకటే గెంతొచ్చు!" అన్నాడు శ్యాం.

ప్రాంజల్ కి తన రొట్టె విరిగి తేనె లో పడ్డట్టయింది.

దేన్నీ వదలకుండా వీడియో తీసి పారేస్తున్నాడు. శ్యాం ని తియ్యమని అడుగుతున్నాడు.

అలా రెండవ వీడియో ధృతి ని చేరింది.

★★★

ఆ వీడియోని ఆమె వసంత్ కి పంపింది. అది చూసిన వసంత్ ధృతిని ఓదార్చడం వింది అనులేఖ.

అతి త్వరగా ఆ కబురు అనసూయకి చేరవేసింది. టైం చూసుకుని ఒక వ్యంగ్య బాణం సంధించింది.

అప్పుడు అందరూ హాల్లో ఉన్నారు. అనులేఖ పెరటి బాల్కనీ లో కూర్చుని -
"మనోహార్ నేను గీసిన గీత దాటడు. కారణం నా మీద, నేను చేసే పనులమీద మంచి చేస్తాననే అపారమైన నమ్మకం!" అంది.

"శ్రీధర్ బావ మాత్రం? ఏనాడూ నా కెదురు చెప్పరు. ఎందుకు? తన మీద కంటే నా మీద విశ్వాసం!" అంది.

"శంకరం అన్నయ్య సురేఖ వదిన మాట తప్ప మరొకటి తలకి ఎక్కించుకోడు. అపర్ణ వదిన ఏ నాడైన నోరెత్తి మాట్లాడడం చూసావా?

"సావిత్రి అక్క మాటకి కరుణాకరం బావ ఎదురుచెప్పడం చూసామా? కొంత మంది ఉంటారు బాబూ. సైలెంట్ గా ఉంటారు. చేసేపనులు సైలెంటే.

మొగుళ్ళు చెప్పా పెట్టకుండా దేశాలు పట్టి పారిపోయేట్టు చేస్తారు. ఇలాంటివి చూసి నలుగురూ ఏమనుకున్నా ఇంట్లో పెరిగే పిల్లలు మాత్రం మా గొప్ప పాఠాలు నేర్చుకుంటారు!" అంది అనులేఖ.

ఆమె గొంతులో నవరస రంగులూ ఒలికాయి. ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు. రెండు నిముషాలు గడిచాయి.

"నువ్ చెప్పింది ఎంత కరక్టే... కర్మే... ఖర్మ!" అంది అనసూయ.

అప్పుడు... రాకెట్ లా హాలు మధ్యకి వచ్చి నిల్చుంది ధృతి.

సుందరమూర్తి, అపర్ణ ఆశ్చర్యంతో ఆమె ని చూస్తున్నారు. ధృతి గొంతు కంచుగంట లా మోగింది.

"ఎప్పుడో ఒకప్పుడు మనిషికి కనువిప్పు అంటే వికాసం కలిగించి తీరాలి. ఇవాళ బంగాళాదుంప కూర కదా అపర్ణ అక్కయ్యా? అందరికి గొప్ప ఇష్టం. బంగాళాదుంప గట్టిగా ఉంటుంది. మన శరీరం పటుత్వంలా. లోపలి ఎముకల దృఢత్వంతో. మనిషి మనసుకీ పదును ఉంటుంది. బంగాళాదుంప తినడానికి అనుగుణంగా మార్చుకోవాలంటే నీటిలో తగినంత ఉష్ణోగ్రత తో బాయిల్ చేస్తే మెత్తబడుతుంది. అప్పుడు కదా తినగలిగేది?
అలాగే ఇష్టమైంది కదా అని ఐస్క్రీమ్ లు పది సర్వింగులు తినండి. జబ్బు చేస్తుంది. అనారోగ్యం దరిచేర కుండా మనసు ఒక పక్క హెచ్చరిక చేస్తూ ఉంటుంది.
మనిషి ఎంత తినాలో, ఏది తినకూడదో, ఎటువంటి ఆలోచనలు చేయకూడదో విజ్ఞత అనేది తట్టి చెప్తుంది. నెగెటివ్ ఆలోచనలు వస్తే బాడీని రోగాలు మూకుమ్మడిగా ముట్టడి చేస్తాయి అని పొట్ట నిండా తిన్నాక ఖాళీ ఉండనప్పుడు అతి ఇష్టమైన ఆహారం తినేందుకు పెట్టినా శరీరం ఒప్పుకోదు ఎందుకు? తనని తాను కాపాడుకునేందుకు.
ఆహారం మనిషికి అవసరం కదా అని కనిపించినవన్నీ తోసేసే వీలు లేదు. అదంతా పక్కన పెడితే -
ఇది అర్ధం కావాలంటే తెలివి ఉండాలి. అతి తెలివి కాదు. ధృతి చెప్పాల్సింది చెప్పి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

ఆ నడక లో ఎంతో ఆత్మవిశ్వాసం. సుందరమూర్తి, అపర్ణ ఆమెని మెచ్చుకోలుగా చూస్తున్నారు.

★★★

అప్పుడు తిక్క ఎక్కి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది అనులేఖ.

తలుపులు మూసుకున్నాయి. మీటింగ్ కొనసాగుతోంది.

"ఇంక మనం నోరుమూసుకు ఉండడం కరక్ట్ కాదు. ఇన్నాళ్ళు పెద్దన్నయ్య అండలో ఈ ఉమ్మడి కుటుంబం అతి జాగ్రత్తగా కాపాడబడింది. అందరం ఆయనని నమ్ముకున్నాం.

ఇప్పుడు ప్రాంజల్ అన్నయ్య దేశాలు పట్టి పోతానని చెప్పేసాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి పడడం లేదు. అటువంటప్పుడు కలిసి ఉండడంలో అర్ధం లేదు. ఇప్పుడు ఎవరికి ఎంత వస్తుందో పంచమని ఆడిగేసి విడిపోతేనే అందరికి మంచిది!" అంది అనులేఖ.

శంకరం ఆ ప్రపోజల్ కి సుతారమూ ఒప్పుకోలేదు. సురేఖ కూడా భర్త కి మద్దతు తెలిపింది.

"అవునులే! నువ్వు ఈ ఇంటికి చెందిన వాడివే కదా? అలాగే మాట్లాడతావు. కానీ ఇక్కడ లోపాయకారి వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి.

మొన్న ధృతి వదిన కమలేష్ పెళ్ళికి వడ్డాణం, డైమండ్ నెక్లెస్ పెట్టుకుని కాళ్ళకి కూడా బంగారం పట్టీలు పెట్టుకుంటే, అపర్ణ వదిన తన మెళ్ళో అవే కాకుండా వాటితో పాటు కట్టకాసుల పేరు వేసుకుంది.

అవన్నీ వాళ్ళ పుట్టింటివాళ్ళు పెట్టనే లేదే? సుందరం అన్నయ్య అన్నేసి డబ్బులు ఇవ్వనే ఇవ్వడు కదా? ఎక్కడ నుంచి వచ్చాయి? ఈ వివరాలు మనకి చెప్పాలా?వద్దా?" అంది తీవ్రంగా.

తలుపు చప్పుడు అయింది.

"రా సింహాద్రి!" అంది అనులేఖ. సింహాద్రి లోపలికి వెళ్ళి చాలా నమ్రత గా కాఫీలు ఇచ్చాడు అందరికి.

"వీడెప్పుడు నీ పార్టీలోకి జంప్ అయ్యాడు అనూ?" అడిగింది సురేఖ.

"నేను చాలా కష్టపడి వాడిని మనవైపు తిప్పుకున్న. వీడికి తెలిసిన విషయాల్ని సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు!" అంది. వినయంగా ఒంగి నమస్కారం చేసాడు సింహాద్రి.

సంపంగి ఇదంతా గమనించి వాడితో మాట్లాడడం మానేసి చాలా రోజులయింది. వాడి మీద ప్రేమతో సుందరమూర్తికి చెప్పలేదు గానీ వాడి మీద వ్యతిరేకత మాత్రం ఉంది. ఒకసారి అంది కూడా.

'డబ్బు కోసం గడ్డి తినే రకం!' అని.

'డబ్బుంటే అన్ని ఉన్నట్టే!” అన్నాడు వాడు.

ఇదంతా విన్న అనులేఖ వాడిని నిరభ్యంతరంగా తన పార్టీ లో చేర్చుకుంది. కాఫీలు తాగాక మళ్ళీ పార్టీ మీటింగ్ మొదలయింది.

"నువ్వు ఎన్నైన చెప్పు. మనకి పాడి, పంట ఉన్నాయి. డబ్బు, దస్కమూ, దక్షత కూడా ఉన్నాయి. నమ్మకం, విశ్వాసం కూడా ఉన్నాయి. దేనికి ఇప్పుడీ పంపకాలు. టైమ్ వచ్చినప్పుడు విడిపోక తప్పదు. ఇప్పుడెందుకు? అన్నాడు కరుణాకరం.

మనోహర్ మౌనంగా ఉన్నాడు.

"ఎంత వస్తోంది? ఖర్చు ఎంత? ఎంత దాస్తున్నారు? ఎవరెవరికి ఏమేం చెందుతాయి? ఈ వివరాలు నాకు కావాలి. లేకపోతే గెద్దలు తన్నుకుపోతాయి!" అంది మొండిగా అనులేఖ.

సావిత్రి కూడా గమ్మున ఉంది.

భామ పెళ్ళి అయ్యాక విజృంభించవచ్చులే అనే ఆలోచన ఆమెది.

అనసూయ వివరాలు చెప్పాలనే విషయానికి తన మద్దతు ఇచ్చింది.

'అయితే అడిగేదెవ్వరు?' అనేది ప్రశ్న. ఆ పనికి తానే పూనుకుంటాను అంది అనులేఖ.

ఆ సభ అలా ముగిసింది.

★★★

అనులేఖ సుందరమూర్తి గది లోకి వెళ్ళింది.

చిట్టితల్లి వచ్చిందని సంబరపడ్డాడు అతడు. పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు.

"పెద్దన్నా! నేనొక ముఖ్య విషయం మాట్లాడడానికి అందరి తరుపున వచ్చాను!" అంది.

అతడు వినడం మొదలెట్టాక ఆస్తి పాస్తులు, అమ్మ పసుపు కుంకుమల కింద వచ్చిన నగలు, భూములు మిగతా వివరాలు అన్నీ చెప్పమంది.

ఇప్పటికిప్పుడు అదంతా ఎందుకని అడిగాడు సుందరమూర్తి.

"ఎప్పటికైనా తెలుసుకోవలసిందే కదా అన్నయ్యా!" అంది అనులేఖ.

సుందరమూర్తి బీరువా ఓపెన్ చేసి ఎల్లో కలర్ డైరీ తీసాడు. అనులేఖ కి అది తన డైరీ అని తెలుసు.

అది చేతికి ఇచ్చి అక్కడే కూర్చుని పరిశీలించుకోవలసిందిగా కోరాడు.

డైరీ ఓపెన్ చేసింది.

మొదటి పేజీలో -
పెద్దన్నయ్య సుందరమూర్తి కి,
నాకు సంబంధించిన ప్రతి పైసా మీద మా శ్రీవారు మనోహర్ కి కూడా పూర్తి హక్కు ఉంటుంది. వారు అడిగినప్పుడు నువ్వు అడిగినంత ఇవ్వవచ్చును. అని ఇంటిపేరుతో సహా అనులేఖ నోట్ అది.

లోపలి పేజీలలో అనులేఖ కి ప్రేమతో సుందరమూర్తి ఇచ్చిన డబ్బు సంఖ్య, సంతకం,తారీఖు, టైం
తీసుకుంటున్న అనులేఖ నోట్, సంఖ్య, తారీఖు, టైం స్పష్టంగా రాయబడి ఉన్నాయి.

తల్లి తండ్రులు పోయిన దగ్గరనుంచి ఏడేళ్లుగా అప్పటి దాకా తీసుకున్న ప్రతి పైసా లెక్క ఉంది.

అవి చదివాక మరొక డైరీ ఇచ్చాడు. దానిలో ఆస్తిపాస్తుల వివరాలు, జమా ఖర్చులు ఖచ్చితంగా రాయబడి ఉన్నాయి. ఇంకొన్ని ఆస్తిపాస్తుల వివరాల స్టాంపు పేపర్ల మీద ఉన్నవన్నీ చూపాడు. అన్నీ లెక్కబెడితే అనులేఖ భర్త మనోహర్ తీసుకున్న డబ్బే ఎక్కువ ఉంది.

"ఇంక మిగిలింది యాభై ఎకరాల పొలం! పంచెయ్యమంటే నాకేమి అభ్యంతరం లేదు!" అన్నాడు సుందరమూర్తి.

ఒక్కసారిగా నోట మాట రాలేదు అనులేఖకి.

మనోహర్ తీసుకున్న డబ్బుని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. లక్షల్లో ఉన్నాయవి.

"నాకెందుకు చెప్పలేదు అన్నయ్యా?" అని అడిగింది. డైరీ లో ఒక పేజీ తీసి చూపించాడు.

మనోహర్ ఎంత అడిగినా ఇవ్వొచ్చు అని అనులేఖ రాసి సంతకం పెట్టిన నోట్ అది.

"నాకూ అర్ధం కాలేదు అనూ. అతడు ఏదో వ్యాపారం మొదలుపెట్టాను అన్నాడు. నిన్ననే తెలిసింది. బాంక్ లోన్లు కూడా వాడేడని. వాకబు చేస్తే తెలిసింది. అతడికి గుర్రపు పందేలకి పోతున్నాడని!" అన్నాడు.

అనులేఖ బిత్తరపోయి నించుంది. అటువంటి వ్యసనాలకి అలవాటు పడితే దానిలోనుంచి బయట పడెయ్యడం ఎలాగ?" అని.

అంతలోనే మనోహర్ వచ్చాడు. కోపంగా అన్నాడు.

"నువ్వు ఒక ఇంటి బాధ్యతగల గృహిణి గా ఎప్పుడున్నావ్? పెళ్ళయింది పేరుకే. ఎప్పుడూ పుట్టింట్లోనే మకాం. పోనీ నేను వస్తూ, పోతూ ఉన్నాను. ఎప్పుడూ ఎవరికో ఇద్దరికి తగవులు పెడుతూ నిరంతరం వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటే శాడిస్ట్ లా ఆనందపడుతూ ఎప్పుడూ ఎవరివో అక్కర్లేని విషయాలు.
అసలు నాతో హాయిగా కాపురం ఎప్పుడు చేసావు?
మా అమ్మా నాన్నలు ఒక్కగానొక్క కొడుకునైన నేను వారి దగ్గరే ఉండాలని, ఒక్క మనవడు పుడితే చాలని నీతో అంటే వెక్కిరించావ్. వేళాకోళం ఆడావు.
నాకు నీతో విసుగొచ్చి ఇరవై నాలుగు గంటలూ డబ్బు సొద వినలేక కొత్తగా హాయిగా ఉండేది ఏం దొరుకుతుందా? అని చూసా!
ఆడదాని స్నేహం మాత్రం ఒద్దు అనిపిస్తుండగా ఈ గుర్రాల గేమ్ బాగుందని ఒకడు తీసుకుపోయాడు.
డబ్బు పోతే పోయింది. గ్రేట్ థ్రిల్!" అని ఆడుతూ పోయా. ఏం తప్పా? పెళ్ళాం కట్టుకున్నవాడి దగ్గర ఉండక పోతే ఏ మగవాడైనా ఇంతే!" అన్నాడు.

అనులేఖ నిస్త్రాణ గా అన్నయ్య మంచం మీద కూర్చుంది.

సుందరమూర్తి అనునయంగా ఆమె వీపు మీద నిమురుతున్నాడు.

★★★

మర్నాడు పొద్దున్న సుందరమూర్తి దగ్గరికి అనసూయ కూడా వెళ్ళింది.

అనసూయ లో ఉండే అహం, దర్పం ఇప్పుడు ఇసుమంత లేదు. అన్న దగ్గర భర్త శ్రీధర్ రావు, తను తీసుకున్న డబ్బు భారీగానే ఉంది.

అదొక్కటే కాక అసలు విషయం కూడా మూడు రోజుల కిందట తెలిసింది. భర్త డైలీ వెజెస్ మీద వసూలు చేసినప్పుడు పెరిగిన పరిచయాలు పేకాట స్నేహాలుగా మారి ఎంతో కోల్పోయాడు.

సుందరమూర్తి నిట్టూరుస్తూ అన్నాడు.

"సావిత్రి, కరుణాకరం ఏ నాడూ ఒక్క పైసా అడగలేదు అనసూయ. నేను సంతోషంగా ఇచ్చిన డబ్బు మాత్రమే తీసుకుంది. దాని బాధ ఎప్పుడూ తనని సరిగా చూడడం లేదనే. కానీ నాకా తేడా ఎందుకుంటుంది?" అన్నాడు. అనసూయ కి కాస్త కోపం వచ్చింది.

"అన్నయ్యా! అమ్మ నగలు మాకే చెందుతాయి కదా? ధృతి కానీ, అపర్ణ వదిన కానీ పుట్టింటి నుంచి ఏమి తేలేదు కదా? అన్ని నగలు ఎలా వేసుకుంటున్నారు?" అడిగింది.

అది విన్న అపర్ణ గిర్రున తన బీరువా తీసి టక్కున నగల పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టింది.

ధృతికి ఫోన్ చేసి తన నగలు కూడా తెమ్మంది. ధృతి గాభరా పడుతూ తీసుకొచ్చింది.

అనసూయని చూడగానే సీన్ అర్ధం అయి అక్కడ పడేస్తూ తమ దగ్గర ఉన్న అతి తక్కువ నగల వివరాలు చెప్పేసి వెళ్ళిపోయింది.

సుందరమూర్తి ఒకటే నవ్వాడు.

"పిచ్చిదానా! నేను మిమ్మల్ని మభ్యపెట్టేవాడినే అయితే అందరం కలిసి ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు కట్టను. ఇదంతా నా స్వార్జితం తో కట్టినదే.

మన ఆస్తుల్ని నేను వివరంగా లెక్కా పద్దుల్తో రాసి ఉంచాను. అందరూ వస్తే చూపిస్తాను.

ఇక ఇవన్నీ వన్ గ్రాం గోల్డ్ నగలు.

పేరంటానికి, పెళ్ళి కి పోవడానికి కొనుక్కున్నవి.

ఇన్ని నగలు కొని, ఇంట్లో పెట్టుకుని కాపాలా కాస్తూ, శాంతి లేకుండా బతకమంటావా?" అన్నాడు.

అపర్ణ నెమ్మదిగా వచ్చి భర్త పక్కన నించుంది.

"చెప్పు అపర్ణా! నువ్ చెప్పేది ఏమున్నా సందేహపడకుండా చెప్పేయ్!" అన్నాడు.

"ఇంక ఎవరికి చెందేవి వారికి పంచి ఇచ్చేయ్యడం అందరికి క్షేమం. మీరూ పెద్దవారవుతున్నారు. ఒక్కరూ ఇదంతా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎవ్వరూ చేదోడు, వాదోడుగా ఉండరు సరికదా అన్ని లెక్కలూ అందరికి అప్పజెప్తూ ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకని పంపకాలు చేసేయ్యండి!" అంది.

"సరే! ఏర్పాట్లు చేస్తాను!" అన్నాడు సుందరమూర్తి.

అనసూయ చిన్న బోయిన మొహం తో బయటికి రాగానే అందరికి అందరం విడిపోతున్నామని అర్ధం అయింది. అందరూ తలలు వంచుకున్నారు.

అందరికి తెలుసు. పంచుకున్న డబ్బు ఇక నిలవదని. ఒక్కరికి కూడా క్రమశిక్షణ లేదని. అందరిదీ నిర్లక్ష్య ధోరిణీ అని.
ఈ సారి సీక్రెట్ ప్లేస్ కి ఎవ్వరూ పోలేదు. అచ్చట్లు, ముచ్చట్లు ఎవ్వరూ చెప్పుకోలేదు.

అలాగే-
అక్కడ తారట్లాడి ఏమేం జరుగుతుందో విని ధాత్రికి చేరవేసే సింహాద్రి ఆశ్చర్యపోతూ అదే విషయం చెప్పాడు.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu Sarojini Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in March 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *