Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

చిత్తం శివుని మీద - భక్తి చెప్పుల మీద

చెన్నకేశ్వర పురం అనే గ్రామంలో పల్లవరాజులు కట్టించిన చెన్నకేశ్వరాలయం ప్రస్తుతం శిధిలావస్థకు వచ్చింది.  పూజారి పూర్ణయ్య ఆలయ అవస్థ చూసి ఎంతో వ్యధ చెందసాగాడు. ఆ శివుని ప్రతిభ, మహత్తు చాలా గొప్పవి. ఒకమారు ఆ ఊరి మీదుగా నగరానికి వెళుతున్న ఒక ధనికుడైన వరదయ్య అనే వ్యాపారి కాస్త విశ్రాంతికోసం ఆలయం ముందున్న బిళ్వ వృక్షం క్రింద ఆగాడు.

ఆయన భార్య అనసూయమ్మ "అయ్యా! మనం ఆగింది పురాతన శివాలయం, దానిముందున్న శిలాఫలకం చూడు. ఈ ఆలయం పల్లవులనాటిదట, లోనికి వెళ్ళి దర్శించుకుని వద్దాం" అంటూ కారు దిగింది.

ఇహ తప్పదని వరదయ్య కూడా కారు తాళం వేసి ముందున్న నూతిలో నీరు తోడుకుని కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కుని లోనికి వెళ్ళాడు భార్యా సమేతంగా.  పూజారి పూర్ణయ్య అప్పుడే శివునికి అభిషేకం చేసి హారతిస్తున్నాడు. ఇరువురూ భక్తిగా  హారతి తీసుకున్నారు. హారతి పళ్ళెంలో వరదయ్య పదిరూపాయలు వేస్తే, అనసూయమ్మ వందరూపాయలు వేసింది.

పూజారి వారికేసి చూసి "అయ్యా! ఈ చెన్నకేశ్వరుడు మహిమగల దేవుడు. మీకేదైనా తీరని కోరిక ఉంటే మొక్కుకుని, కోరిక తీరాక స్వామి వారికి దక్షిణ సమర్పించుకోండి. ఈ ఆలయం పల్లవుల కాలం నాటిది. ఎన్ని మహజర్లు సమర్పించుకున్నా ఏ నాయకుడూ దీన్ని ఉధ్ధరించను ముందుకురాలేదు. చూడండి ఆలయ పరిస్థితి, నాకు మహా బాధగా ఉంది." అంటూ కంటనీరు పెట్టుకున్నాడు.

ఆయన బాధ చూసి అనసూయమ్మ "పూజారయ్యా! మాకు సంతాన లేమి వల్ల ఎన్నో ఆలయాలు దర్శించుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ చెన్నకేశవుడు కరుణిస్తే ఈ ఆలయ పునర్ణిర్మాణానికి నాకు మా నాయనగారు పసుపు కుంకుమ క్రింద ఇచ్చిన పాతికెకరాలూ సమర్పించుకుంటాను ." అంటూ పూర్ణయ్యకు చెప్పి స్వామి వారికి నమస్కరించుకుంది.

పూర్ణయ్య లోనికెళ్ళి రెండు రక్షరేకులు తెచ్చి, మొదటి రేకును ముందు వరదయ్య చేతికి కట్టాడు, రెండవరక్షరేకును వరదయ్య కు ఇచ్చి అనసూయమ్మ చేతికి కట్టమన్నాడు. "అమ్మా! మీరు  కొంతసేపు ఆగితే మహానైవేద్యం వస్తుంది. స్వామికి నివేదన చేశాక మీరు ఆరగించి వెళ్ళవచ్చు. తప్పక మీ కోరిక తీరుతుంది." అంటూ వారిని సేద తీరను అరుగుమీద కూర్చుండబెట్టి, పక్కనే ఉన్న తన ఇంట్లోకి వెళ్ళి మహానివేదన తెచ్చి స్వామివారికి నివేదించి రెండు దొన్నెల్లో వరదయ్య దంపతులకు అందిం చాడు. వారు భక్తిగ సేవించి, సెలవు తీసుకుని కదిలారు.

మూడు నెలలకు అనసూయమ్మ గర్భవతి ఐంది. ఒక రోజున ఆమె ఆలయానికి వచ్చి పూర్ణయ్య కు శుభవార్త చెప్పింది." పూజారయ్యా! నామాట ప్రకారం స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించను మీరు పధకం ఆలోచించండి." అని కోరింది.

దానికి పూర్ణయ్య "తల్లీ మీవంటి భక్తులద్వారా స్వామి వారు ఆలయ పునర్నిర్మాణం చేయించదలచి మీకోరిక తీరుస్తున్నారు. మీకు సుఖ ప్రసవమై మీ వంశాంకురంతో వచ్చి పని మొదలు పెడుదురుగాని." అంటూ స్వామి ప్రసాదం  ఇచ్చి పంపాడు.

అనసూయమ్మ తొమ్మినెలలూ నిండి పండంటి మగ బిడ్డను కనింది. పురిటి స్నానంకాగనే, 21వ రోజునే ముందుగా బిడ్డడితో ఆలయానికి వచ్చి చెన్నకేశవుని ముందు బిడ్డను ఉంచి, పూజించుకుంది. "పూజారయ్యా! చెన్నకేశవుడు కరుణించగా, మీ ఆశీర్వాదంతో పుట్టిన మా వంశాంకురానికి ‘చెన్నకేశవుడు’ అనే పేరు పెట్టుకున్నాం. ఇక ఆలయ నిర్మాణం మొదలెట్టండి. స్వామి వారి పని వెనకేయడం సముచితం కాదు. ఈ శివరాత్రికి నూతన ఆలయంగా వెలవాలి." అంటూ భర్తకేసి చూసింది.

వరదయ్య "పంతులుగారూ! ఆలయ నిర్మాణనికి కావలసిన సర్వ వస్తువులూ లారీల్లో పంపుతాను, మీ గ్రామస్తుల చేత నిర్మాణం ప్రారంభించండి. మా ఆవిడ తలంచితే కావలసిందే. ఆమె మాటే నాకు వేద వాఃక్కు" అన్నాడు.

పూర్ణయ్య "అయ్యా! మా ఊరి జనం కూలీ నాలీ లేక బాధపడుతున్నారు. వారికి కూలి ఇప్పిస్తే తప్పక నిర్మాణం పని చేయను ముందుకు వస్తారు." అన్నాడు.

రాజు తలిస్తే దెబ్బలకేమి కొదువ? అన్నట్లు ఆలయ నిర్మాణం సాగింది. శివరాత్రి రోజుకి సరికొత్త ఆలయం 'నూతనాలయమా!' అన్నట్లు వెలిసింది.

వరదయ్య కొత్త ఖరీదైన కారు కొనుక్కుని దాన్లో ఆలయంలో జరిగే హోమాలకు కుటుంబంతో తరలి వచ్చాడు. ఆయన స్నేహితులూ, బంధువులూ అంతా కూడా వారికి తోచిన విధంగా స్వామికి దక్షిణలు సమర్పించుకుని, అన్నదానం విశేషంగా జరపసాగారు. ఎక్కడెక్కడి జనమూ వరదలా వచ్చి భోజనాలు చేసి వెళ్ళసాగారు.

వరదయ్య పూజమధ్యలో మాటిమాటికీ లేచి బయటికెళ్ళి రాసాగాడు. వరదయ్య బావమరది బాపయ్య అది గమనించి "ఏంటి బావగారూ! మాటిమాటికీ బయటి కెళ్ళి వస్తున్నారు? ఏదైనా ఇబ్బందా!" అని అడిగాడు.

"మరేంలేదు బావా! యాభై లక్షలకారు కొత్తది కదా! ఎవరైనా గీకుతారేమోనీ .." అంటూ నసిగాడు. బాపయ్య గలగలా నవ్వుతూ  "బావగారూ! మీలాంటి వారిగురించే 'చిత్తం శివునిమీద- భక్తి చెప్పులమీదా ' అనే సామెత పుట్టింది. మీ భక్తి కొత్త బి.యం. డబ్లియూ మీదన్నమాట!" అన్నాడు నవ్వుతూ.

Posted in March 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!