వీక్షణం సాహితీ గవాక్షం కాలిఫోర్నియా 156వ ప్రపంచ సాహితీ సమావేశం ఆగస్ట్ 14, 2025 న ఆసాంతం ఉత్తేజభరితంగా, ఉత్కంఠతో జరిగింది. డా.గీతామాధవిగారి స్వాగతోపన్యాసంతో సభ ప్రారంభమైనది. గీతగారు ఈరోజు ముఖ్య అతిథి శ్రీ గారపాటి ఉమామహేశ్వరరావుగారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయం చేశారు. శ్రీ గారపాటి ఉమామహేశ్వరరావు గారు పేరొందిన భాషాశాస్త్రవేత్త. విజయవాడలో గారపాటి బాలత్రిపుర సుందరీదేవి, లక్ష్మీనరసింహారావులకు జన్మించారు. ప్రాధమిక విద్యాబ్యాసం గుణదల బిషప్ గ్రాసీ హైస్కూల్లో నూ, ఆ తర్వాత డిగ్రీలు లయోలా కాలేజీలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, విజ్ఞాన, మానవీయ శాస్త్రాలలో ఎమ్.ఎస్.సి, ఎమ్.ఏ. చదివి, భాషాశాస్త్రజ్ఞులైన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఎఫ్ .ఆర్.ఎస్.ఈ పర్యవేక్షణలో చారిత్రక భాషాశాస్త్రంలో రాసిన పరిశోధనా వ్యాసానికి పి.హెచ్.డి. పట్టా పొందారు.
అనువర్తిత భాషాశాస్త్రం, అనువాద అధ్యయనాల కేంద్రం (సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్), హైదరాబాదు విశ్వవిద్యాలయంలో సంచాలకులుగా, ఆచార్యులుగా పని చేసారు. తెలుగు భాషాశాస్త్రం, సమాచార సాంకేతిక రంగంలో చేసిన కృషికి రెండుసార్లు విశిష్ఠ అవార్డును (సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ 2012, విభక్త ఆంధ్ర ప్రదేశ్, 2019) అందుకొన్నారు. తెలుగు పద విశ్లేషిణి (Morphological Analyzer), వాక్యాలను విశ్లేషణ (Parser) చేసే ఉపకరణాలనిర్మాణం, ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం చేసే యంత్రానువాద వ్యవస్థలనూ (Machine Translation Systems), కంప్యూటర్లో రాస్తున్నప్పుడు తప్పు ఒప్పుల్ని దిద్దుకోనే దిద్దరి అనే ఉపకరణం, పదనిష్పాదన చేసే ఉపకరణం (Morphological Generator), సాంఖ్యిక పదనిధి (digital corpora) వంటి ఎన్నో ఉపకరణాలను తెలుగూ తదితర భారతీయ భాషలకు తయారుచేశారు. భారతీయ భాషలకు భాషాతంత్రవ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఉద్దేశించిన సమాఖ్యకు నాయకత్వం వహించారు (Consortium Leader, SPTIL, TDIL, GoI). అంతే కాక గోండీ భాష మాండలికాల తులనాత్మక పరిశోధన చేశారు. ద్రావిడ - మంగోలు భాషల మధ్య ఉన్న సంబంధాన్ని సోపపత్తికంగా వర్ణ, పద, సహజాత పదాల ఆధారంగా నిరూపించారు. అనేక సదస్సులలో భాష మీద, సాంకేతికత మీద వందకు పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. మాతృభాష లోనే ప్రాథమిక విద్యాభ్యాసం ఉండాలని, దాని కోసం ఎంతో కృషి చేస్తున్నారు, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అంతే కాకుండా ద్రావిడ, మంగోలియన్ - టర్కిక్ భాషా కుటుంబాలకు మూలభాషను జన్యుసంబంధ ప్రక్రియల ద్వారా పునర్నిర్మాణం చేయడంలో చివరి రెండు దశాబ్దాలుగా నిమగ్నులై ఉన్నారు. భారతీయ భాషా సాంకేతిక రంగానికి సంబంధించి అనేక పత్రాలు, పుస్తకాలను ప్రచురించారు. తెలుగురాష్ట్రాలలో భాషా సంక్షోభం, ద్రావిడ, మంగోలు భాషల జన్యు సంబంధాలపై పరిశోధనా గ్రంథాలను ప్రచురిచారు. నవ్యరుషి సన్మాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగానూ (న్యూఢిల్లీ), ద్రావిడ భాషా సంఘ అధ్యక్షుడిగానూ, భారతీయభాషలలో యంత్రానువాద పథక ప్రధానపరిశోధకుడిగానూ (ప్రసార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం), భారతీయ భాషల కోసం ఉపకరణాల నిర్మాణ సహవ్యవస్థకు నాయకత్వం వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, థాయలేండ్, శ్రీలంక, తైవాన్, దక్షిణ కొరియా, మంగోలియా మొదలైన దేశాలలో పర్యటించారు.
భారతీయ నేపథ్యంలో ముఖ్యంగా భారతీయ విశ్వవిద్యాలయాలలో, భాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టడం ద్వారా సంగణక భాషాశాస్త్రమనే కొత్త రంగంలో పరిశోధనలు ప్రారంభించారు. మానవీయశాస్త్ర పరిశోధనా సంస్కృతిలో కొత్త పోకడలను తీసుకువచ్చారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం, మానవీయశాస్త్రాలతో కూడిన ప్రత్యామ్నాయ అనువర్తిత పరిశోధనలతో తెలుగూ తదితర భాషలలో అనేక ఉపకరణాలను రూపొందించి అభివృద్ధి చేశారు.
ప్రయోగశాలలకే పరిమితమైన ప్రాయోగిక జ్ఞానాన్ని సృష్టించడం ద్వారా కేవలం ఉపయోగకరమైన పరిశోధనలలో కొత్త ధోరణులను ప్రారంభించటమేకాక ప్రజోపయోగం కోసం మానవీయ శాస్త్రాల ఉత్పత్తులు/ సాంకేతికత పరంగా ఉపయోగపడే పరిశోధనా ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. భారత, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రజా ప్రయోజన సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి, అనేకమార్లు విడుదల చేశారు.
విజ్ఞాన పరిశోధనా, శిక్షణా వ్యాప్తిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో విస్తృతంగా కలిసి పనిచేశారు. కంప్యూటర్ సైన్స్, భాషాశాస్త్రం, సాహిత్య రంగాలలో పరిశోధనను సమన్వయం చేస్తూ విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పత్రికలూ మ్యాగజైన్స్లలో వందల పరిశోధన పత్రాలూ గ్రంథాలూ ప్రకటించారు. విజ్ఞాన వ్యాప్తికి వీలు కల్పించేవిధంగా మనదేశమూ విదేశాలలోనూ కార్యశాలలనూ సమావేశాలనూ నిర్వహించారు.
ప్రజల వినియోగానికి పనికివచ్చే పలు ఆవిష్కరణలతో పరిశోధనలను విస్తరించారు. భాషాశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సంగణక భాషాశాస్త్రం, చారిత్రక భాషాశాస్త్రం వంటి అనేక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలకు తెరతీశారు.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో మాతృభాషలను విద్యామాధ్యమంగా పక్కనపెట్టడాన్ని నిరసిస్తూ బడిభాషగా మాతృభాషల అవసరాన్నీ అవి మన సమాజాల ఆర్థిక అభివృద్ధికి ఎంతగా దోహదపడుతున్నాయో గణాంకాలద్వారా పరిశోధించి చూపించారు. భాష, ఆర్థిక వ్యవస్థ, తులనాత్మక భాషాశాస్త్రం, మాతృభాష మాధ్యమంగా బోధన, భాషా జన్యుశాస్త్రం, అనుసరణ వ్యాకరణం పద్ధతిలో ఆంగ్ల భాషా అభ్యాసం, బోధన; "కోరా" వంటి సోషల్ మీడియాలలో భాషా సంబంధిత వివిధ ఇతివృత్తాలపై 550 కి పైగా వ్యాసాలను ప్రచురించారు.
తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ప్రపంచీకరణ అంటే ఆంగ్లీకరణ ద్వారా కాకుండా స్థానికీకరణ జరగాలని, ఇదంతా భాషావైవిధ్యం ద్వారానే సాధ్యం అవుతుందని, పాఠశాల స్థాయిలో ఇంగ్లీషు మాధ్యమం ఈ వైవిధ్యాన్ని నాశనం చేస్తుందని, వందలాది స్థానీయ సాంప్రదాయ వృత్తివ్యాపారాలను ఆధునికీకరించి వేలాదిమందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం మాతృభాషలద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని, స్థానిక భాషలలో విద్యాబోధన, వృత్తివ్యాపారాలూ వాణిజ్యం, పరిశ్రమలను చవకగానూ, సులువుగానూ ఎక్కువమందిని కలుపుకుంటూ నిర్వహించే వీలు కలుగుతుందని, భాషావైవిధ్యాన్ని కాపాడుకుంటేనే విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోదాహరణంగా చర్చించారు. మాతృభాషా మాధ్యమంతో వ్యవహార నైపుణ్యాలనూ ఇంగ్లీషూ ఇతర భాషలలో నైపుణ్యాన్నీ సంపాదించటం సులువు అవుతుంది అనేది గారపాటి ఉమామహేశ్వరరావు అభిప్రాయం. విద్య, వైద్యం, పాలన రంగాల్లో తెలుగు మరింత విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరి తెలుగూ, అన్ని చోట్ల ఉన్న తెలుగూ అన్ని రకాల తెలుగూ మనకి కావాలి వీటన్నిటితోనే తెలుగు పరిపుష్టమౌతుంది. అమ్మనుడి చదువులపై జనాలకు ఉన్న అపోహలను తొలగించి, మన భాషపై మమకారాన్ని కల్పించాలని, యువతకీ చేరువ కావాలని "తెలుగు బలగం" అనే ఉద్యమం ప్రారంభించారు.
ఇక ఇవేళ్టి ఉపన్యాసంలో శ్రీ ఉమామహేశ్వరరావుగారు ప్రాథమిక స్థాయిలో చదువులు తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో ఉండాలని, దాని ప్రయోజనాలను స్టాటిస్టికల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమం వైపు వెంపర్లాడటం తగదని, తెలుగు మాధ్యమంలో చదవడం అవమానంగా భావించే భావన తొలగిపోవాలన్నారు. దానికై మనమందరం ఉద్యమించాలని ఉద్బోధించారు. చక్కని ప్రవర్తన నేర్పలేని చదువు ఎందుకని ప్రశ్నించారు. సుమారు గంటసేపు సాగిన వారి ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంది.
వారి ప్రసంగంపై గీతగారు, గోగినేని ప్రసాదరావు గారు, మనోహర్ రెడ్డిగారు, రాజేంద్ర ప్రసాద్ గారు మొదలైన వారు స్పందనలు తెలియచేశారు.
అనంతరం శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, శ్రీమతి రాధా కుసుమగారి నిర్వహణలో కవిసమ్మేళనం ప్రారంభమైంది.
తొలుత డా.గీతామాధవిగారు "వెయ్యి వెలుగుల టెలుగు" అనే శీర్షికతో చందమామ, జోలపాట, శతకాలను ప్రస్తావిస్తూ భాషావైభవాన్ని చెప్పిన తీరుకు అందరూ ఫిదా అయినారు. తదుపరి డా. చీదెళ్ళ సీతాలక్ష్మిగారు విశ్వమంతా నిండిన భాష అంటూ తెలుగుభాష వైశిష్ట్యాన్ని అందంగా వినిపించారు. వనజ బలుసాని గారు గీతామాధవి గారి కుమారుని పెండ్లి వైభావాన్ని స్తుతిస్తూ దంపతులను పాట రూపంలో ఆశీర్వదించారు.
సినీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు "మహాసంకల్పం" అనే తన కవితాశీర్షికలో మాదక ద్రవ్యం మన దేశానికి పట్టిన దెయ్యం అంటూ డ్రగ్స్ వలన యువత ఎలా పాడైపోతున్నదో చెబుతూ మనందరం వాటి నిర్మూలన కొరకు ఉద్యమించాలి అన్నారు. శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడుగారు గిడుగు వారి ప్రశస్తిని సుందరమైన కవితగా చదివారు. సృజనా దేవిగారు తమ కవితలో స్త్రీ ఎలా అణిచివేయబడుతున్నదో హృద్యంగా వినిపించారు. శ్రీ ఘంటా మనోహర్ గారు తెలుగు తేజం అనే కవితలో తెలుగు భాషా ఔన్నత్యాన్ని వివరించారు.
శ్రీమతి రాధా కుసుమగారు తమ కవితలో తెలుగుభాష ఎలా అణిచి వేయబడుతున్నదో చెప్పిన విధానంలో భావ, భాషా విన్యాసం సభికులను రంజింప చేసింది. దేవులపల్లి పద్మజ గారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయ పతాకం అనే పాట శ్రావ్యంగా పాడారు. శ్రీ దీపక్ న్యాతి గారు రెక్కలు సాచి ఎగిరే పక్షి ఎంత అదృష్టవంతురాలో అంటూ తనే పక్షినైతే అనే భావం అద్భుతంగావుంది. శ్రీ కందుకూరి శ్రీరాములుగారు తెలుగుభాషా ప్రాశిస్త్యాన్ని తన కవితలో వివరించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గిడుగు అంటే ఉద్యమ కెరటం అంటూ చక్కగా కవిత వినిపించారు. డా.బృంద త్రివర్ణ పతాకం దేశానికి ప్రతీక అంటూ గానించారు. బుక్కపట్నం రమాదేవిగారు నాన్న ఎక్కడ వెనుక బడ్డారు అంటూ ప్రశ్నించారు.
శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు తెలుగువాడంటే పంచెకట్టు, చీర, ఆవకాయ అంటూ నోరు వూరించారు. శ్రీమతి శోభాదేశ్ పాండే గారు తెలుగుభాషా గొప్పతనాన్ని తమ కవితలో వివరించారు. శ్రీ భోగెల ఉమామహేశ్వరరావు గారు తన కవితలో పాలకుల నిర్లక్ష్యం వల్లనే తెలుగుభాష భ్రష్టు పట్టిందన్నారు. అరుణ కీర్తి పతాకగారు భరతమాత రక్షణకై నేను అంటూ తీయని కంఠంతో పాట పాడారు. పవిత్ర కృష్ణ గారు తెలుసుకో మిత్రమా అంటూ కవిత చదివారు.
శ్రీ గుర్రం మల్లేశం గారు శ్రావణమాస ప్రశస్తిని తెలియజేస్తూ వినిపించిన ఉత్పలమాల పద్యం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు అతిలోక సుందరి అనే కవితలో 'ఎండాకాలంలో హిమక్రీము తింటే ఏముందబ్బా, చలికాలంలో తింటే దాని కిక్కే వేరబ్బా' అంటూ ఐస్ క్రీమును అతిలోక సుందరితో పోల్చిన తీరు అందరికీ నవ్వు పుట్టించింది. ప్రసాదరావు రామాయణం అనే నేను ఒక వేశ్య అంతరంగ వేదనను నా కవితలో వినిపించాను.
శ్రీ కొత్తూరు వెంకట్ గారు చంపకమాలలో కృష్ణ జననం గురించి, భారతార్ధంలో ఒక ఆటవెలది పద్యాలు చదివి సభికులను రంజింపజేశారు. శ్రీ గారపాటి ఉమామహేశ్వరరావుగారు తిలక్, సినారె, జాషువా, శ్రీశ్రీ, తిరుపతి వెంకటకవులు, గద్దర్ గార్లను ఉటంకిస్తూ చదివిన కవిత చాలా బావుంది.
చివరిగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు తన గంభీరమైన కంఠంతో తెలుగు భాషగురించి చదివిన తీరు ఉత్తేజ భరితంగా వుండినది.
డా.గీతామాధవి గారి వందన సమర్పణతో ఈనాటి సాహితీ సమావేశం ముగిసింది.
అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.