Menu Close
Rathod-Sravan
బంజారా తండాలో... తీజ్ సంబరాలు...
రాథోడ్ శ్రావణ్

బంజారా సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ "తీజ్". తీజ్ అనగా గోధుమ మొక్కలు అని అర్థం. ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోనే కాక పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర భారత దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్ గడ్, రాజస్తాన్, గుజరాత్ మొదలగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ఈ పండుగ మొదట ఎలా ప్రారంభమౌతుందంటే తండాల్లోని ప్రజలందరూ ఆ తండాకు చెందిన పెద్ద ఆయన నాయక్ ఆధ్వర్యంలో సమావేశమై పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని "నాయక్" అనుమతి తో అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్న చిన్న గుల్లలని తీసుకు వస్తారు. ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు గుల్లలు తీసుకువచ్చి వాటిని అందంగా రంగు, రంగుల నూలుదారాలతో, గువ్వలతో, ముత్యాలతో, పూసలతో, మరియు బాసింగాలు కట్టి పెళ్ళి కూతురిలా అందంగా ఆ గుల్లలని ముస్తాబు చేస్తారు.

ఈ పండుగను పెళ్లికాని ఆడపిల్లలు శ్రావణ పూర్ణిమ రోజు ఉదయం లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి, అందంగా ముస్తాబై కొత్తబట్టలు ధరించి "నాయక్" ఇంటికి చేరుకోని అక్కడి నుండి గండు చీమలు గుల్లు కట్టిన నల్లని మట్టిని తీసుకురావడానికి అడవికి వెళ్తారు. ఇనుప గుల్లలో ఆ మట్టిని తీసుకు వచ్చి ఆరబెట్టి శ్రావణంలో వచ్చే రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ఆవరణలో అందరూ సమావేశమై నాయక్ అనుమతితో అందంగా అలంకరించిన వెదురు గుల్లల్లో నల్లని మట్టిని నింపి అందులో నాయక్, భార్య నాయకణ నాన బెట్టిన గోధుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. అందరూ పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా "మోదుగు" ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోధుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడపిల్లలు ప్రతిరోజూ మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోధుమలకు నీల్లు జల్లుతారు.

ఐతే, ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు "పులియా గెణో" "పూర్ణ కుంభం" లా తలపై పెట్టుకొని బావి నీళ్లు కాని బోరింగ్ నీళ్ళు కాని చెరువు నీళ్లు కాని తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కి నీరు పోయకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పిన వారిని మాత్రమె తీజ్ కి నీళ్ళు పోయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నీళ్ళు జల్లుతూ అగరు బత్తులతో ధూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.

పాటలు పాడుతూ తొమ్మిదవ రోజు గోకుల అష్టమి నాడు "డంభోళి" పండుగను జరుపుకుంటారు. ఆ రోజు పెళ్ళి కాని ఆడ పిల్లలు కొత్త బట్టలు ధరించి నాన బెట్టిన సెనగలను తీసుకొని పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు. అప్పుడు ఆడపిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమిస్తారు.

అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకొని నాయక్ ఇంటికి తీసుకువెళ్ళి పెళ్ళికాని ఆడ, మగ వాళ్ళు ఆ మట్టితో డోక్రి, డోక్రా ముసలమ్మ ముసలోడులను పీట పై తయారు చేస్తారు. దానినే "గణగోర్" అంటారు. తయారు చేసిన మట్టి బొమ్మల పై రైక బట్ట, తువ్వాల కప్పుతారు.

"డంబోళి" రోజు రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటలకు తండా వాళ్లందరూ భోజనం చేసిన తర్వాత గోధుమ పిండితో తయారు చేసిన గోదుమ రొట్టె, బెల్లం, నెయ్యితో కలిపి ఉండలు తయారు చేస్తారు. దానిని "చుర్మో" అంటారు. తయారు చేసిన చుర్మోను హరితి పళ్ళెంలో వేసి అగరుబత్తి, కొబ్బరికాయ, కుంకుమ, నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరూ పెళ్ళి కాబోయే ఆడ‌పిల్లలతో తండా నాయక్ ఇంట్లో డోక్రి, డోక్రా పూజలు చేసి డంబోళి పైన పాట పాడుతారు.

మరుసటి రోజు ఉదయాన్నె ఆడ పిల్లలందరు డోక్రి, డోక్రా ను నెత్తి మీద పెట్టుకొని ఊరి బయట ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు. అప్పుడు కూడా పాటలు పాడుతారు.

ఈ పాటల్లో ముసలమ్మను పొగుడుతూ, ముసలయ్యని విమర్శిస్తూ పాట పాడుతారు. గణగోర్ ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్  గుల్లలను మధ్యలో పెట్టుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు, కార్భారి, ఢావ్, ఢవ్ గేర్యా మాన్కరి అందరూ వచ్చి సహపంక్తి భోజనం (బాలాజీ బండారో) చేస్తారు. నాయక్ అగరుబత్తీలు పెట్టి కొబ్బరి కాయ కొట్టి పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం ఆడపిల్లలు తమ తీజ్ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు. ఆడపిల్లల వదినలు ఆ గుల్లను లాక్కొని వారి అమ్మలకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ ని తెంపుతారు. తెంపిన తీజ్ ని ఆడ పిల్లలు గ్రామ పెద్దలకు ఇస్తూ మొక్కుతారు. గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత ఆడ పిల్లలు తీజ్ ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కొక్కరు గుల్లల్లో డబ్బులు వేస్తారు.

ఒక్కొక్కరు తీజ్ ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ తీజ్ ని మొక్కతూ పెళ్ళికాని వారు హారాలకి పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. ఆ తర్వాత నాయక్, నాయకణ్, జొన్నలు, గోధుమలు, సెనగలతో గుడాలు వండిస్తారు. వండిన గుడాలని సాయంత్రం ఐదు గంటలకు అందరు తినటం ఆ తర్వాత ఎడ్లకు ఝూలు వెసి అలంకరించి, బండి కట్టి అందులో తీజ్ ని ఉంచి బాజా భజంత్రీలతో తాండా అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండా చెరువులో తీజ్ గుల్లలని నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో ఆడ పిల్లలు బాదపడటం, ఏడ్వటం చేస్తారు. ఎందుకంటే తోమ్మిది రోజులు ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో, పాటలతో, నృత్యాలతో ఆనందంగా జరుపుకొని మరుసటి సంవత్సరం వరకు ఆగకుండా ఉండలేక అంతేకాకుండా పెళ్ళి అయినచో ఈ తీజ్ ఉత్సవం జరుపుకోలేమన్న బాధతో ఏడుస్తారు.

తీజ్ నిమజ్జనం అనంతరం ఆడపిల్లలకు వారి అన్నలు లేదా తమ్ముళ్ళు కాళ్ళు కడుగుతారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు నాయక్ ఆధ్వర్యంలో గుడాలను ఆరగిస్తారు. తీజ్ పండుగ అనేది పెద్దలను గౌరవించాలని, గిరిజన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కొనసాగించాలని, పచ్చదనంతో కుటుంబాలు ఎప్పుడూ పచ్చగా వెలగాలని పెళ్ళి కాని యువతులకు మంచి భర్త దొరకాలనే మంచి సంకల్పంతో జరుపుకుంటారు అని పెద్దలందరూ అంటుంటారు.

********

Posted in January 2025, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!