Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

పిండి కొద్దీ రొట్టె

పెంట గ్రామంలో రఘురామయ్య గారి కుటుంబం నివసిస్తూ ఉండేది. రఘురామయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రాజీవ్, అతని భార్య ఉమ. రెండోవాడు విజయ్, అతని భార్య రమ.

శ్రావణ మాసం దగ్గరపడటంతో తోటికోడళ్ళు ఇద్దరు కలసి చీరలు కొనుక్కోవడానికి బట్టల దుకాణానికి వెళ్ళారు.

అత్తగారికి ఒక చేనేత చీర, వారిద్దరికీ చెరొక కంచిపట్టుచీర కొన్నారు. ఆ చీరలను అత్తగారికి చూపించారు.

“మీ చీరలు బాగున్నాయి. నా చీర ముతకగా ఉంది. ఈ వయసులో నేను బరువు చీరలు కట్టలేనని మీకు తెలుసు కదా! అయినా ఇలాంటి చీరలే తెస్తారు” అని చిరాకు పడింది అత్తగారు.

“మేము ఏది కొన్నా మీకు నచ్చదు. అలాగే అంటారు” అన్నారు కోడళ్ళు ముక్త కంఠంతో.

“తాతకి దగ్గులు నేర్పితే ఎలా! 'పిండి కొద్ది రొట్టె’ అని మీకు తెలియదా?” అన్నారు అత్తగారు.

“మేము కొన్న చీరలకు రొట్టెకు సంబంధం ఏమిటి అత్తగారూ!” అంటూ దీర్ఘం తీస్తూ అడిగింది పెద్దకోడలు.

“సరే నీకు అర్ధమైనట్లు చెప్తాను అని వంటింట్లోకి తీసుకువెళ్ళింది. ఎక్కువ గోధుమ పిండి ఉన్న డబ్బా పెద్దకోడలికి ఇచ్చింది. తక్కువ గోధుమ పిండి ఉన్న డబ్బా చిన్నకొడలికి ఇచ్చింది. ఇద్దరినీ రొట్టెలు చెయ్యమని చెప్పింది. కాసేపటికి రొట్టెలు చెయ్యడం పూర్తిచేశారు కోడళ్ళు. ఇద్దరినీ పిలిచి “ఉమా నువ్వు ఎక్కువ రొట్టెలు చేసావు. రమ తక్కువ రొట్టెలు చేసింది కారణం ఏమిటో తెలుసునా?” అని అడిగింది అత్తగారు.

“రమకి తక్కువ పిండి ఇచ్చారు కాబట్టి తక్కువ రొట్టెలు చేసింది” అని జవాబిచ్చింది ఉమ.

ఇదే పిండి కొద్దీ రొట్టె అంటే. మన పనిని బట్టే ఫలితం. డబ్బును బట్టే వస్తువు. మీరు మరికొంచెం డబ్బులు వెచ్చిస్తే మంచి చీర వచ్చి ఉండేది. తక్కువ డబ్బులతో మంచి చీర రావాలంటే వస్తుందా. ఆ డబ్బుకు తగినట్లుగానే ఉంటుంది” అని చెప్పింది అత్తగారు.

"పిండికొద్దీ రొట్టె" అనేది తెలుగులో ఒక సామెత. దీని అర్థం "ఎంత పిండి ఉంటే అంత రొట్టెలు వస్తాయి" లేదా "చేసే పనికి తగ్గట్టు ఫలితం ఉంటుంది" అని. అంటే, మనం ఎంత పని చేస్తామో, ఎంత కృషి చేస్తామో, దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం లభిస్తుంది అని ఈ సామెత ద్వారా తెలుస్తుంది. మీరు ఖరీదైన చీర కొంటే బాగానే ఉండేది.” అని బాధపడింది అత్తగారు.

తమ తప్పుని తెలుసుకున్న కోడళ్ళు ఆ చీరని దుఖాణ దారునికి తిరిగి ఇచ్చి ఖరీదైన మంచి చీర కొన్నారు. ఆ చీరను చూసి అత్తగారు మురిసిపోయారు.

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in July 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *