
"రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?"- రాజు తలుచుకొంటే ఏమైనా చేస్తాడు అని అర్థం వచ్చేరీతిలో పుట్టుకొచ్చిన పాత సామెత ఇది. "రైతు దున్నితేనే రాజులకు అన్నం" - వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే సామెత ఇది- ఎవరూ తక్కువ కాదు అనే సందేశం ఇందులో ఇమిడి ఉంది. భారతదేశానికి చివరి చక్రవర్తి మరియు కామన్వెల్త్ మొదటి అధిపతి బ్రిటీష్ రాజు జార్జ్. 1936-1952 వరకు సాగిన అతని పాలనలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. ఈ మధ్యలో 1947 లో భారత్ స్వాతంత్య్రం పొంది రిపబ్లిక్ గా ఆవిర్భవించింది. రిపబ్లిక్ అనగా - రాజు లేదా రాణి లేని దేశం, సాధారణంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేత, అధ్యక్షుడి చేత పరిపాలించబడుతుంది. మరి "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" లో "రిపబ్లిక్" సంగతి మాత్రం అడగకండి, ఎందుకంటే అది నేతి బీరకాయలో నెయ్యి చందానా అని చెప్పక తప్పదు. అదీ పరిస్థితి. పూర్వం మా బర్రెలు ఇక్కడ గడ్డి మేసాయి, కాబట్టి ఇది మాకు చెందాల్సిన భూభాగం అని అడ్డగోలుగా వాదించి పక్క నున్న చిన్నా చితక దేశాల భూభాగం కొట్టేసే ప్రయత్నాలు చేసే చైనా దేశం పేరులోనే రిపబ్లిక్ పేరు ఉండడం విచిత్రం కదా! ఏం చేస్తాం కలికాలం! అసలు విషయానికి వస్తే - రాజు కొట్టించే లేదా కొట్టే దెబ్బలు కొన్నిసార్లు అతని సామ్రాజ్య పతనానికి బాటలు వేస్తాయి. ముఖ్యంగా అహంకారంతో చేసే పనులు - అటువంటి సంఘటన ఒకటి భారత దేశ స్వాతంత్ర్య సమర చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించబడింది - అదే లాలా లజపతిరాయ్ పై నేరుగా ఒక బ్రిటిష్ అధికారి అహంకారపూరితంగా స్వయంగా చేసిన లాఠీ చార్జీ. భారత రిపబ్లిక్ దినం ఈ నెల జనవరి 26 వ తారీఖు నాడు, ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్ర్య సమయయోధుడు లాలా లజపతిరాయ్ పోరాటం, అతనిపై జరిగిన దౌర్జన్యం, ఆ పిదప జరిగిన ప్రతీకార దాడి నేపధ్యం తదితర విషయాలు ఇప్పుడు మనం చర్చిద్దాం! విషయం లోకి వెళితే..
కొందరి త్యాగాలు దేశ చరిత్రలో కలకాలం నిలిచిపోతాయి. అలా చరిత్రలో నిలిచిపోయిన చారిత్రక వ్యక్తుల కోవలోకి లాలా లజపతి రాయ్ నిస్సందేహంగా వస్తారు. లాలాజీ జీవితం భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయి. ఆనాటి ప్రజలను ఎందరినో ఆయన భావాలు, త్యాగాలు ప్రభావితం చేశాయి. ఆయన పిలుపు దేశ ప్రజల గుండెలలో మారుమోగి, తద్వారా లక్షలాది మంది భారతీయులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగి, ఆ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. తద్వారా కోట్లాది ప్రజలకు ఆరాధ్య దేవుడిగా లాలాజీ వీరపూజలు అందుకున్నారు. ‘నేను మరణించవచ్చు, కానీ నానుండి వెలువడే ప్రతి నెత్తురు చుక్క నుండి లక్షలాది స్వాతంత్య్ర సమరయోధులు ఉద్భవిస్తారు’ అని ప్రకటించిన లాలాజీ మాట నిజం అయింది. తన మరణానంతరం స్వాతంత్య్రోద్యమం మరింతగా విస్తృతం అవుతుందని తెలిపిన భవిష్యత్ దర్శకుని జీవితం మనకు స్పూర్తిదాయకం.
‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’ - స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్ ఒక సందర్భంలో అన్నమాటలివి. ఆ మాటలు ఆయన కన్నుమూసిన రెండు దశాబ్దాలకు నిజమయ్యాయి. 1928లో జేమ్స్ ఏ స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి విచక్షణ రహితంగా కొట్టిన లాఠీ దెబ్బలతో తదనంతరం కన్నుమూసిన లాలా లజపతిరాయ్ ఆ క్షణంలో మరొక శాపం కూడా ఇచ్చారు - ‘ఇవాళ నా గుండెల మీద పడిన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్య శవపేటికకి చివరిగా కొట్టిన మేకులవుతాయి’ అని. ఆ వ్యాఖ్యలు చివరకు నిజమయ్యాయి.
లాలా లజపతిరాయ్ ఉద్యమకారుడు. అతివాదుల వైపు మొగ్గిన వారాయన. గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త. కార్మికోద్యమ నిర్మాత. భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదనీ, దూరదృష్టి అనీ ఓ ముగింపునకు రాక తప్పదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ లోని కొంత మంది నాయకులు ముస్లింల ప్రాపకాన్ని సంపాదించటం కోసము లోపాయకారిగా హిందువుల అభీష్టాలను అవసరాలను త్యాగము చేయాలనీ చెప్పటాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించేవారు. రాబోయే రోజుల్లో హిందూ, ముస్లింల విభేదాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇద్దరు కలిసి స్వాతంత్ర పోరాటం సాగించటం కష్టమని ఆయన బలంగా నమ్మేవాడు - అందుచేతనే భారతదేశాన్ని ముస్లిం ఇండియా - నాన్ ముస్లిం ఇండియా గా విభజించాలి అని ఆయన 1923, డిసెంబర్ 14 న ఏర్పాటు చేసిన ఒక కమిటీ ముందు వాదించి పెద్ద వివాదానికి తెర దీశాడు. 1946, 1947 మతకలహాల మూలంగా జరిగిన రక్తపాతం, ఇతర రాజకీయ పరిణామాల సమయంలో చాలామంది నాటి నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను లజపతిరాయ్ తాను బతికి ఉన్నప్పుడే ముందే ఊహించారు.
లాలా లజపతిరాయ్ (జనవరి 28, 1865– నవంబర్ 17, 1928) పంజాబ్ రాష్ట్రం లోని దుఢికె అనే చోట పుట్టారు. తండ్రి రాధాకిషన్, తల్లి గులాబ్దేవి. రాధాకిషన్ ఉర్దూ, పర్షియన్ బోధించే పాఠశాల ఉపాధ్యాయుడు. తండ్రి పర్షియన్, ఉర్దూ భాషలలో మంచి పాండిత్యము ఉన్నవాడు. తల్లి మతపరమైన సిద్ధాంతాలను నమ్ముచూ పిల్లలలో నైతిక విలువలను ప్రేరేపించటంలో కృషి చేసేది. ఆ విలువలే లాలా లజపతి రాయ్ ని భావి జీవితములో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటట్లు చేశాయి. తండ్రి ఎక్కడికి బదలీ అయితే అక్కడే లజపతిరాయ్ ప్రాథమిక విద్య సాగింది. ఇదంతా పంజాబ్, లాహోర్, నేటి హరియాణా ప్రాంతాలలో సాగింది. 1877 లో లాలా లజపతి రాయ్ రాధా దేవిని వివాహమాడాడు. 1880లో ఆయన లాహోర్లోని ప్రభుత్వం న్యాయ కళాశాలలో చేరారు. ఇక్కడే లాలా హన్స్రాజ్, పండిత్ గురుదత్లతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అప్పటికే ఆర్య సమాజ్లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడప్పుడే లజపతిరాయ్కి ఆర్య సమాజ్ మీద ఆసక్తి ఏర్పడుతోంది. కానీ ఆయన 1881లో బ్రహ్మ సమాజ్లో చేరారు. అందుకు కారణం తన తండ్రి ఆప్తమిత్రుడు పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అటు మిత్రుల ద్వారా ఆర్య సమాజ్ ప్రభావం, ఇటు అగ్నిహోత్రి ద్వారా బ్రహ్మ సమాజ్ ప్రభావం లజపతిరాయ్ పై ఎక్కువగా పడింది. బ్రహ్మ సమాజ్లో ఉన్న మూడు వర్గాలు, వాటి వివాదాలు లజపతిని పూర్తిగా ఆర్యసమాజ్ వైపు తిరిగిపోయేటట్టు చేశాయి. కానీ తండ్రి దయానంద బోధనలను పెద్దగా ఆయన ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ ఆర్య సమాజ్ను లజపతిరాయ్ ఎంచుకున్నారు. నిజానికి తాను ఆర్య సమాజ్ను అభిమానించినది అందులో కనిపించే మత సంస్కరణ, మత కోణాల నుంచి కాదనీ, అది ప్రబోధించిన జాతీయ దృక్పథంతోనే అనీ ఒక సందర్భంలో ఆయన చెప్పుకున్నారు కూడా. 1886లో ఆయన ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సంవత్సరమే ఎంతో ప్రతిష్టాత్మకమైన దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను కూడా స్థాపించారు. లాహోర్లో ఆరంభమైన ఈ పాఠశాల ఉద్దేశం సంప్రదాయక భారతీయ విద్యా వ్యాప్తి. ఆ సమయంలోనే హిస్సార్, లాహోర్లలో లజపతిరాయ్ మంచి న్యాయవాదిగా కూడా పేరు గాంచారు. బాగానే ఆర్జించారు. సామాజిక సేవ కోసం లాహోర్లోనే 20వ శతాబ్దం ఆరంభంలో భారతజాతి పునర్నిర్మాణ ఉద్దేశంతో ఆయనే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని నెలకొల్పారు. ఆర్య సమాజ్, దయానంద బోధనలు లపజతిరాయ్లో అంత త్వరగా, అంత పెద్ద మార్పును తెచ్చాయి.
లాలా లజపతిరాయ్ రాజకీయ చింతన పూర్తిగా దయానంద, ఆర్య సమాజ్ ఆశయాలకు అనుగుణంగా ఎదిగినట్టు కనిపిస్తోంది. మొదట ఆయన ఇటలీ ఏకీకరణ ఉద్యమకారులు మేజినీ, గారిబాల్డీలను ఆరాధించారు. మితవాదుల నాయకత్వంలో సాగుతున్న జాతీయ కాంగ్రెస్ పోరాటంలో జాతీయ ప్రయోజనాలు పక్కకి జరిగిపోతున్నాయని ఆనాడు అభిప్రాయపడిన ప్రముఖుల్లో లాలా లజపతిరాయ్ ఒకరు. మొదట హిందువులు ఐక్యమై, తరువాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నది కూడా ఆయన అభిప్రాయంగా ఉండేది. తరువాతి కాలాలలో హిందూమహాసభకు, మదన్మోహన మాలవీయకు దగ్గర కావడానికి దోహదం చేసినవి కూడా ఈ అభిప్రాయాలే. 1897లో ఆయన ఆరంభించిన హిందూ రిలీఫ్ మూవ్మెంట్ను చూసినా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కరువు కాటకాలకు బాధితులైన భారతీయులను ఆదుకోవడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నిస్సహాయిలుగా ఉండిపోతున్న భారతీయులు క్రైస్తవ మిషనరీల అదుపులోకి పోకుండా చూడడమే ఈ ఉద్యమం ఆశయం. మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లాలా లజపతిరాయ్ ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. అయినాగానీ, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం, అందుకు సంబంధించిన ఆర్భాటాలేవీ కూడా లజపతిరాయ్కి పెద్దగా తెలియవు. ఆయన ప్లీడర్ చదువు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందు జాతీయ కాంగ్రెస్ బొంబాయిలో ఆవిర్భవించింది. అప్పుడు లజపతిరాయ్ తండ్రి రోహ్తక్లో పని చేస్తున్నారు. తండ్రి దగ్గరే లజపతి రాయ్ ఉండేవారు. న్యాయవాద వృత్తిని ప్రారంభించిన రెండేళ్ల తరువాత 1888, 89 సంవత్సరాలలో ఆయన మొదటిసారి అలహాబాద్, బొంబాయిలలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. హిస్సార్ నుంచి వెళ్లిన నలుగురు ప్రతినిధుల బృందంలో ఆయన కూడా ఒకరు. అందుకు లజపతిరాయ్ చాలా గర్వించారు కూడా. కానీ ఆయనకు కాంగ్రెస్ పోరాట పంథా గొప్పగా అనిపించలేదు. బొంబాయి లో జరిగిన కాంగ్రెస్ సభలు ఆయనను నిరాశ పరిచనట్టు కూడా అనిపిస్తుంది. ‘కాంగ్రెస్ నాయకులు దేశ ప్రయోజనాల కంటే తమ కీర్తిప్రతిష్టలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని ఆయన కాంగ్రెస్కూ, ఆ సంస్ధ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికీ దూరం కాలేదు. బెంగాల్ విభజనోద్యమానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రే ఇందుకు నిదర్శనం.
బెంగాల్ విభజనోద్యమం అంటే, గాంధీజీ రాక మునుపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగిన పెద్ద ప్రజా ఉద్యమం. ఇందులో బెంగాల్ నుంచి అరవింద్ ఘోష్, బిపిన్చంద్ర పాల్, మహరాష్ట్ర నుంచి బాలగంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలాజీ కీలక నేతలుగా అవతరించారు. ఇంకా రవీంద్రనాథ్ టాగోర్, చిత్తరంజన్దాస్, సోదరి నివేదిత వంటివారు ఎందరో ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం చాలా కీలకమైనది. ఇందులో ఎక్కువ పాత్ర లాలా లజపతిరాయ్దే. స్వదేశీ ఉద్యమంలో భాగమే జాతీయ విద్య. జాతీయ కళాశాలల ఏర్పాటు కూడా అందులో భాగమే. అలా లజపతిరాయ్ లాహోర్లో జాతీయ కళాశాలను ఏర్పాటు చేశారు. అందులోనే భగత్సింగ్ చదువుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా వందేమాతరం ఉద్యమం సాగుతూ ఉండగానే పంజాబ్లో భూశాసన చట్టం అమలులోకి వచ్చింది. 1907లో బ్రిటిష్ ప్రభుత్వం రుద్దిన ఈ చట్టం ప్రకారం పంట పొలాలకు ప్రజలు ఉపయోగించుకునే నీటికి చేయవలసిన చెల్లింపులు పెరిగాయి. ల్యాండ్ రెవెన్యూ పెంపు పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం రైతులను వేధించడం మొదలైంది. ఈ భూశాసనానికి వ్యతిరేకంగా ఇండియన్ పేట్రియాట్స్ అసోసియేషన్ ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ సంస్థ నాయకుడు అజిత్ సింగ్. ఈయన భగత్సింగ్ పినతండ్రి. ఈ ఉద్యమనేతగా అజిత్సింగ్ పేరు వినపడినప్పటికీ వెన్నెముక మాత్రం లాలా లజపతిరాయేనని అంటారు. ఆ సంస్థ సభ ఎక్కడ జరిగినా వక్త మాత్రం లాలా లజపతిరాయే. దీనితో లజపతిరాయ్నీ, అజిత్సింగ్నీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రవాస శిక్ష విధించి బర్మా లో ఉన్న మాండలేకు పంపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకుండానే ఇంతటి కఠిన శిక్ష విధించింది. దీనితో ఇంగ్లండ్ పార్లమెంట్లోని ప్రతినిధుల సభలో గందరగోళం జరిగింది. విధిలేక భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఇద్దరినీ విడుదల చేశారు.
ప్రస్తుతానికి ఈనెల చర్చకు ఇంతవరకు కామా పెట్టి, మరల వచ్చే నెలలో కొనసాగిద్దాం! తదుపరి రచ్చబండ చర్చలో లాలాజీ అమెరికా పర్యటన, సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన నిరసన, ఈ నేపధ్యంలో ఆయన మరణం, విప్లవకారుల ప్రతీకార చర్యలు, అలాగే నేతాజీ గూర్చి రెండు మాటలు, తదితర విషయాలు చర్చిద్దాం. చివరిగా జనవరి 28న లాలాజీ జన్మదినం సందర్భంగా లాలాజీ స్ఫూర్తి తో దేశ సమస్యల పరిష్కారానికి మనందరం నడుం బిగిద్దాం. సమర్థ, నవ భారత నిర్మాణానికి మనందరం ఆ దిశగా కృషి చేద్దాం. నిజానికి ప్రతిఒక్క పౌరుడు దేశానికి సమస్యలు సృష్టించకుండా ఎవరి పని వారు సక్రమంగా చేసుకుపోతుంటే ఈ ప్రయాణంలో సగ భాగం మనందరం చేరుకున్నట్లే కదా! ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. వచ్చే నెలలో ఈ రచ్చబండ చర్చ రెండవభాగానికి తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం