ప్రణవి రోడ్డు క్రాస్ చేసి, రాణి రాజన్ వేపు వెళ్ళింది.
ప్రణవి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడే... రాజన్ నది వైపుగా నడక సాగించాడు. రాణి... ప్రణవి రాగానే తానూ రాజన్ వెనుకగా నడక సాగించింది.
ప్రణవికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెను తిరిగి వెళ్ళిపోదామా అనుకుంది కాసేపు. 'మాట్లాడతామని పిలిచారు కదా మాట్లాడుతారేమో! అలా వెళ్ళిపోతే సభ్యత కాదు. స్నానాలు అని వచ్చారు కదా స్నానాలు చేశాక మాట్లాడుతారేమో! చూద్దాం కాసేపు,' అనుకొని వారిని అనుసరించింది.
"నువ్వు ఏదన్న జాబ్ చేస్తున్నావా?" అడిగింది రాణి.
'ఇదేం ప్రశ్న? ఎలా ఉన్నావ్ అని అడగకుండా! వీళ్ళుడబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నారేమో! మనీ మైండెడ్స్. వీళ్ళకి బాగా డబ్బులు సంపాదిస్తున్నాననే చెప్పాలి. డబ్బు కోసమే కదా నన్ను ఇంట్లోంచి గెంటేశారు. సంపాదిస్తున్నాను అంటే తీసుకెళ్తారేమో!' అని మనసులో అనుకొని,
"హా కోపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నాను," అంటూ చెప్పింది ప్రణవి.
"ఏరీ పిల్లలు తీసుకురాలేదా?" అంటూ అడిగింది.
"లేదు రెష్ గా ఉంటుందని, నలిగిపోతారని తీసుకురాలేదు."
"నువ్వు ఒక్కదానివే వచ్చావా?"
"వికాస్ తరంగణి వాళ్ళతో కలిసి వచ్చా,"
"పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా ఉన్నారు?" అంటూ పిల్లల గురించి ఆరా తీసింది రాణి.
ప్రణవి పిల్లలు ఏం చదువుతున్నారో చెప్పింది.
"మూర్తి పెళ్ళికి వద్దామనుకున్నాము. పనిలో వత్తిడి వల్ల రాలేకపోయాం," అంటూ కాసేపు వగచి...మూర్తి పెళ్లి గురించి ఇంటి విషయాలు... అన్ని ఆరాలు తీసింది.
ప్రణవి, "పెళ్లి బాగా జరిగింది. అందరూ బానే ఉన్నారు," అని ముక్త సరిగా చెప్పింది.
రాణి పిల్లల గురించి, అత్తమామల గురించి అడిగింది ప్రణవి అంతా బానే ఉన్నారని చెప్పింది.
"పిల్లలు ఏం చదువుతున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?" అని అడిగింది ప్రణవి.
వాటికి జవాబులు చెప్పకుండా మాట దాటేసింది రాణి. నిశ్శబ్దంగా కొంత దూరం నడిచారు. స్నానాల రేవు వచ్చింది.
జంబేష్, రాజన్ రాణి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆమె రాగానే... జంబేష్ టవల్ కావాలి అని అడిగాడు.
రాణి చేతిలో ఉన్న సూట్ కేసు పొడిగా ఉన్న దగ్గర కింద పెట్టి ఓపెన్ చేసి టవల్ తీసింది.
జంబేష్ కొంచెం దూరంలో ఉండటంతో... ప్రణవి టవల్ నేనిస్తానని తీసుకోబోయింది.
ఇంతలో జంబేష్ వచ్చి చటక్కున రాణి చేతిలో ఉన్న టవల్ ను అందుకొని... దూరంగా పోయి టవల్ కట్టుకుని, ఫాంట్ షర్ట్ విప్పి, మడతపెట్టి తీసుకొచ్చి సూట్కేస్ పైన పెట్టి, స్నానం చేయడానికి నదిలోకి దిగాడు.
"మీరు వెళ్ళరా?" రాజన్ ను ఉద్దేశించి, అమాయకంగా అడిగింది ప్రణవి.
"వాడు వచ్చాక ఇద్దరం కలిసి వెళ్తాం," అన్నాడు రాజన్.
సూట్ కేస్ కోసం అంటున్నాడు ఏమో నని... "దీనిని నేను చూసుకుంటాను... మీరు కూడా వెళ్ళి స్నానం చేసి రండి," అంది ప్రణవి.
"అది కాదులే అమ్మాయి... వేరే కారణం ఉందిలే. నువ్వు చేయాలనుకుంటే పోయి చేసి రా. వాడు ఎటూ చేస్తున్నాడుగా!" అన్నాడు రాజన్.
"నేను అంతకుముందు చేసేసాను," అంది ప్రణవి.
"అదే అమ్మాయి నీతో వచ్చిన చిక్కు. ఏమి చేస్తే మళ్ళీ చేయకూడదని రూల్ ఉందా?" అంటూ కాసేపు ప్రణవి కి క్లాసు పీకాడు.
భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే మంచిది అని, ఈ రకంగా చెప్తున్నాడేమో అని అనిపించింది ప్రణవి కి. "సరే బావగారు నేనూ వెళ్ళి స్నానం చేస్తాను," అంటూ మనసుకు రెక్కలు కట్టుకుని, జంబేష్ ఉన్న వైపుగా... నదిలోకి దిగి, జంబేష్ కి కొద్ది దూరంలో ముక్కు మూసుకుని నదిలో మునకేసింది.
ప్రణవి పైకి లేచి చూసేసరికి జంబేష్ గబగబా ఒడ్డుకు వెళ్ళిపోతూ కనిపించాడు. ప్రణవి ఒక మునక తోనే ఆపేసి, అతను వెళ్ళిన వైపే వెళ్ళింది.
జంబేష్ ఓ ఋత్విక్కుని కి గోత్రనామాలు చెబుతున్నాడు. ప్రణవి కూడా మెల్లగా అతని పక్కకు వెళ్ళి నుంచొంది. ఆ బ్రాహ్మణుడు ప్రణవిని చూసి, జంబేష్ వంక తిరిగి,
"మీ వాళ్ళే నా?" అంటూ అడిగాడు.
"అబ్బే ఆవిడ ఎవరో నాకు తెలియదు. మా వాళ్ళు కాదు," అంటూ చెప్పాడు.
ఆ మాటలతో ప్రణవిలో చిగురించిన ఆశాజ్యోతి ఆరిపోయింది. కోపం కట్టలు తెంచుకుంది. గట్టిగా అతనికి తను ఏమౌతుందో చెప్పాలనిపించింది. కానీ సంస్కారం నోటికి అడ్డుపడి,
'పూజాకార్యక్రమంలో ఉన్నవారి ఏకాగ్రతకు భంగం కలిగించకూడదన్న ఇంగితం మరిచావా?' అంటూ హెచ్చరించింది. కోపాన్నిపంటి బిగువుతో అదిమిపెట్టి... రాజన్, రాణిలు ఉన్న వైపు వెళ్ళింది.
"ఏం జరిగింది? అలా ఉన్నావ్?" మొహం లో ఉన్న కోపాన్ని పసిగట్టి అడిగింది రాణి.
జరిగిన సంగతి చెప్పింది ప్రణవి.
"నువ్వు ఇన్ని రోజులు వదిలేసి ఉన్నావు కదా! ఏం మొగుడు కైనా కోపం రాదా? అంటే అన్నాడు లే నా మొగుడే కదా! పరాయి వాడు కాదు కదా అనుకొని, అక్కడే ఉండాలిగానీ, ఎగురుకుంటూ ఇలా వస్తారా?" అంటూ మళ్ళీ నాలుగు అక్షింతలు వేసాడు రాజన్.
"అన్నింటినీ పట్టించుకోకూడదు. కాపురాలు నిలబడాలంటే మనమే సర్దుకుపోవాలి." అంది రాణి.
ఈ లోపల జంబేష్ అక్కడికి వచ్చాడు. వాళ్లు మాట్లాడటం ఆపేసారు. సూట్ కేసులో ఉన్న అతని బట్టల్ని అందించింది రాణి.
ప్రణవి వంక దొంగ చూపులు చూసుకుంటూ... ఆ బట్టలు తీసుకుని దూరంగా వెళ్ళాడు వేసుకోవడానికి.
"ఇక్కడే ఉండు మేము స్నానం చేసి వస్తాము," అని చెప్పి, రాణి, రాజన్ ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని స్నానానికి నదిలోకి వెళ్లారు.
జంభేష్ బట్టలు మార్చుకుని, ఈ పక్కకి రాకుండా... ప్రణవికి దూరంగా ఉండి, అతనితో వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ... ప్రణవి వంక దొంగ చూపులు చూస్తున్నాడు.
పిచ్చి ప్రణవి... అతను ఆమె వంక చూస్తుంటే ఉబ్బి తబిబ్బై పోయి... నవ్వుతూ అతని వంక చూసింది.
ఆమె చూస్తోందని గమనించిన, జంబేష్ కోపంగా ఓ చూపు చూసి, మొహం తిప్పుకున్నాడు.
రాణి రాజన్ సరిగంగ స్నానాలు పూర్తిచేసుకుని, వచ్చి బట్టలు మార్చుకున్నారు. అన్యోన్యమైన ఆ దంపతులను చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది. అక్కడినుంచి బయలుదేరారు.
జంబేష్ వీళ్ళకి కాస్త ముందు... వీళ్ళ ముగ్గురు వెనక బయలుదేరారు.
"బావా!" అంటూ రాణి కళ్ళతో ప్రణవిని చూపించింది.
"హా" అంటూ అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లేస్ ని చూసి జంబేష్ ను పిలిచి, దానిని చూపించాడు.
జంబేష్ రాజన్ లు ఏవో సైగ లు చేసుకున్నారు. జంభేష్ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వీళ్ళు ముగ్గురు రోడ్డుకి వచ్చేసారు. జంబేష్ అక్కడ లేడు. ఆటో మాట్లాడుకుని రాణి రాజన్ ఎక్కబోతూ...
రాజన్ ప్రణవి వంక చూసి..."అమ్మాయి నువ్వు ఎక్కడికో వెళ్లాలన్నావుగా వెళ్ళు." అన్నాడు.
ప్రణవిలో కోపం కట్టలు తెంచుకుంది. "మాట్లాడదామని పిలిచారు. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారే?" నిలదీసింది ప్రణవి.
"నీకు ఆలస్యం అవుతుంది ఏమో అని అన్నాము. సరే ఆటోఎక్కు," అన్నాడు రాజన్.
ప్రణవి వాళ్లతో పాటు ఆటో ఎక్కింది.
***సశేషం***
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.