'ఆపరేషన్ సిందూర్' - ఒక విశ్లేషణ 2
'ఆపరేషన్ సిందూర్' తదుపరి పాక్ బండారం మరింత బయటపడే విధంగా రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది, కావున గత నెల రచ్చబండ చర్చను ఈ నెలలో కొనసాగిద్దాం అని తీర్మానించాము. ఈ నెల చర్చలో భారత్ - పాక్ ప్రస్తుత సమస్యలకు ప్రవాసాంధ్రుడి కోణం నుండి కొన్ని పరిష్కార మార్గాలు, మరియూ నాలుగు రోజుల యుద్ధం పై కొత్త సమాచారాన్ని క్రోడీకరించి చర్చను ఒక కొలిక్కి లాకొచ్చే పూచీ నా నెత్తిమీద వేసుకున్నమాట వాస్తవం. కావున ముందుగా తాజా వార్తలపై కొంత చర్చ, రంధ్రాన్వేషణపై మరికొంత చర్చ జరిపి ఆపై కొన్ని రచ్చబండ తీర్మానాలు చేసి ఆనక వచ్చేనెలలో కొత్త విషయం పై చర్చకు ఉపక్రమిద్దాం!
తాజా వార్తలు
మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పుడు భారత్కు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. భారత యుద్ధ విమానాలు, మిస్సైళ్లు పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మే 7న పూర్తిగా ధ్వంసం చేశాయి; పాకిస్థాన్ మే 8న ప్రతిదాడులు ప్రారంభించింది. భారత్లోని లక్ష్యాలపై డ్రోన్ దాడులు నిర్వహించింది. గైడెడ్ మిస్సైల్స్ను కూడా ప్రయోగించింది. మే 8న ఐదు భారత వాయుసేన విమానాలు కూలిపోయాయి అని పాక్ ఘనంగా ప్రకటించుకుంది, కానీ ఈ కూలిపోయినవి విమానాలు కావని, అవి భారత్ వాయుసేన విమానాలుగా శత్రువును భ్రమింపజేసే డెకాయ్ (ఉత్తుత్తి) డ్రోన్లు అని భారత్ రక్షణ నిపుణులు వాదిస్తున్నారు. పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై మే 10న భారత్ దాడులు చేసిన సమయంలో పాక్ హ్యాంగర్లలో కొన్ని యుద్ధ విమానాలు ఉన్నట్లు వెల్లడైంది. బొలారి ఎయిర్ బేస్ పై భారత్ చేసిన దాడిలో ఎన్ని విమానాలు పాక్ కోల్పోయిందనే విషయాలను పాక్ ఇంతవరకు బయటపెట్టలేదు. అలాగే యుద్ధం సమయం నాటి శకలాలను సైతం ఇప్పటికీ పాక్ క్లీన్ చేయలేదని తెలుస్తోంది. దాడికి గురైన హ్యాంగర్ల పైకప్పులకు పట్టాలు కట్టడం ఉపగ్రహ చిత్రాలలో బయట పడింది. దాచిపెట్టిన నష్టాలను కూడా కలుపుకుంటే పాక్ కోలుకోలేని చావుదెబ్బతిందని యుద్ధ నిపుణులు అంటున్నారు. ఆపరేషన్ సిందూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచింగ్ ప్యాడ్లను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు ఉప్పందించాయి. ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కదా! భవిష్యత్తులో పెద్దగా శ్రమలేకుండా ఇవే ఉగ్రవాద శిబిరాలపై భారత్ మళ్ళీ దాడులు చెయ్యవచ్చు.
అంతర్లీన సమస్యలను పరిష్కరించడం
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం - 'పాకిస్తాన్ తన మనుగడను కొనసాగించాలంటే, ముందు అది తన ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలి' అని ప్రధానమంత్రి మోడీ ఇటీవలి ప్రసంగంలో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లోపల పనిచేస్తున్న ఉగ్రవాద కర్మాగారాలను నిర్మూలించడంలో భారతదేశం మరియు పాకిస్తాన్ పరస్పరం సహకరించుకోవడం చాలా అవసరం. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి భారతదేశం దీనిని నిర్దేశించిందో లేదో మనకు తెలియదు. ఇటీవలి ప్రకటనలో, మోడీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క అచంచలమైన వైఖరిని పునరుద్ఘాటించారు, ముఖ్యంగా పాక్ నుండి అణు దాడుల హెచ్చరికల నేపథ్యంలో పాక్ పై స్పందించే హక్కు భారత్ కు ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.
పాక్ అణ్వాయుధాల కట్టడి
ఇటీవల ఒక ప్రకటనలో, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆ దేశ ప్రవర్తన బాధ్యతారాహిత్యం మరియు మోసపూరితమైనది' అని అభివర్ణించారు. పాక్ అణు కార్యకలాపాలపై అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణ చేయాలని ఆయన అన్నారు. మే 10న జరిగిన దాడుల తరువాత, పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ కొంత మంది మాజీ భారత వైమానిక దళ పైలట్లు - పాకిస్తాన్ నూర్ ఖాన్ వైమానిక స్థావరాలలో తక్కువ శక్తి కలిగిన అణ్వాయుధాలను క్షిపణులకు లేదా యుద్ధ విమానాలకు అమర్చే ప్రయత్నంలో అవి భారత్ క్షిపణి దాడులకు గురి అయ్యి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వీటిని వ్యూహాత్మక అణ్వాయుధాలు అని కూడా పిలుస్తారు. అయితే ఇవి సాంప్రదాయ అణ్వాయుధాల కంటే తక్కువ శక్తివంతమైనవి. మే 10న జరిగిన దాడుల సమయంలో భారత క్షిపణులు పాక్ అణు నిల్వలకు దారితీసే సొరంగ మార్గాల ప్రవేశ ద్వారాలను కూల్చిందనే విషయం మనం చర్చించాము. ఈ దాడులు పాకిస్తాన్ అణ్వాయుధ నిల్వల సొరంగ మార్గాలను ధ్వంసం చేసే సామర్ధ్యం భారత్ కు ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేసాయి. ఉగ్రవాద నెట్వర్క్లతో సంబంధాలు కలిగి ఉన్న పాకిస్తాన్ సైన్యం, అణ్వాయుధ సామర్థ్యాలను పర్యవేక్షించే పాకిస్థాన్ సైన్యం ఒకటే కావడం విచారకరం. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ అణు సామగ్రిని పర్యవేక్షించడం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కు అత్యవసరం. విచారకరమైన విషయం ఏమిటంటే మిలటరీ అణు సామాగ్రి ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షించదు, దాని పరిధి కేవలం పౌర అవసరాలకు విద్యుత్తును ఉత్పత్తి చేసే అణు రియాక్టర్ల వరకే పరిమితం.
కాశ్మీర్ సమస్యకు సంబంధించి ఒక ఆపరేషన్ సిందూర్ ద్వారా ఖచ్చితమైన పరిష్కారం కుదరనప్పటికీ, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు కోసం పరస్పరం ఆమోదయోగ్యమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరం. జమ్మూ కాశ్మీర్ శాసనసభలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రతినిధుల కోసం 24 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అవి ప్రస్తుతం భర్తీ కాలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు తిరిగి రావడం తప్ప, జమ్మూ కాశ్మీర్ విషయంపై భారతదేశం ఇతర చర్చలను అనుమతించదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. పాక్ ఆక్రమించిన కాశ్మీర్ ను అది స్వచ్ఛందంగా భారతదేశానికి బదిలీ చేయడం వలన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలిక వివాదంకు నిస్సందేహంగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అయితే పాక్ తెలివిగా 1948 లో తాను ఆక్రమించుకున్న కాశ్మీరు ప్రాంతంలో ఇతర ప్రాంత పౌరులను చొప్పించింది. భారత్ ఈ ప్రాంతాన్ని తిరిగి తీసుకోవాలంటే వీరిని తిరిగి తమ తమ ప్రాంతాలకు పంపించివెయ్యాలి. కాశ్మీరు భాషకు, సంస్కృతికి ఉన్న ప్రత్యేకతను బట్టి పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఉన్న స్థానికేతరులను గుర్తించడం పెద్దగా కష్టం కాకపోవచ్చు.
పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం గురించి భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఉగ్రవాదం, చర్చలు మరియు వాణిజ్యం కలిసి ఉండలేవు. అదేవిధంగా నీరు మరియు రక్తం ఒకేసారి ప్రవహించలేవు" అని అన్నారు. జల సంఘర్షణలను నివారించడానికి రెండు దేశాల మధ్య నీటి వనరుల పంపిణీని నియంత్రించే సింధు జలాల ఒప్పందాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. సింధు నదీ పరీవాహక ప్రాంతం ప్రధానంగా భారతదేశంలోనే ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు 60 ఏండ్ల క్రితం జరిగిన నీటి కేటాయింపులు రెండు దేశాల మధ్య సమానంగా పంచుకోబడలేదు. ఈ ఒప్పందం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో గణనీయమైన జనాభా పెరుగుదల దృష్ట్యా సింధు నది నీటి పంపిణీని పరిష్కరించడానికి ఈ ఒప్పందంలో సవరణలు అవసరం. ప్రస్తుత జనాభా లెక్కల వాస్తవాల ఆధారంగా నీటి వినియోగాన్ని తిరిగి అంచనా వేయడం అనివార్యం. 1971 సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్ - పాక్ లు పరస్పరం సంప్రదించుకోవడం, ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించడానికి ప్రతిజ్ఞ చేయడం, పౌరుల మధ్య విశ్వశనీయతను ప్రోత్సహించడం మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించగలవు మరియు పరస్పర అనుమానాన్ని గణనీయంగా తగ్గించగలవు.
పహల్గామ్ ఊచకోత తర్వాత, భారతదేశం తన పౌరుల నుండి ఏకగ్రీవ మద్దతును పొందిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా కాశ్మీరీ స్వాతంత్ర్య సమరయోధులకు నైతిక మద్దతు ముసుగులో భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంపై పాకిస్తాన్ వైఖరి పట్ల బలూచిస్తాన్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ ప్రస్థుతం తన దేశాన్ని అదే సరిహద్దులతో కొనసాగించాలంటే, దేశీయ ఉగ్రవాద నెట్వర్క్లను నిర్మూలించడంతో పాటూ ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు కట్టుబడి, దృఢమైన అంకితభావాన్ని అంతర్జాతీయ సమాజానికి చేతలలో ప్రదర్శించడం అత్యవసరం.
కమ్యూనికేషన్ను తిరిగి పునరుద్దరించడం, మరియు ఇరు దేశాలమధ్య ఎగుమతులు - దిగుమతులను పెంచడం, దక్షిణ ఆసియాలో సహకారాన్ని పెంచడం వంటి చర్యలు రెండు దేశాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు అనుమానాలను తొలగించడానికి దోహదపడతాయి. ప్రారంభంలో, రెండు దేశాలలో అణ్వాయుధాల ఉనికి ఏదైనా సంభావ్య సంఘర్షణకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని, స్థిరమైన వ్యూహాత్మక వాతావరణాన్ని నిలబెట్టుకోవడం అవసరమని నమ్ముతారు. అయితే, నూర్ ఖాన్ వైమానిక స్థావరం మరియు ఇతర కీలక లక్ష్యాలపై ఇటీవల జరిగిన దాడులు పాకిస్తాన్ యొక్క అత్యంత ముఖ్యమైన ముప్పు భారతదేశం నుండి కాదు, దాని స్వంత అణ్వాయుధ సామర్థ్యాల నుండి ఉత్పన్నమవుతుందని సూచిస్తున్నాయి. భారతదేశం-పాకిస్తాన్ వివాదానికి పూర్తి పరిష్కారాన్ని సాధించడం దీర్ఘకాలిక ఆకాంక్ష అయినప్పటికీ, ఈ కీలకమైన రంగాలపై దృష్టి పెట్టడం వల్ల ఉద్రిక్తతలను నిర్వహించడంలో, ఘర్షణలను తగ్గించడంలో మరియు మరింత స్థిరమైన భవిష్యత్తును పెంపొందించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయత్నానికి రెండు దేశాల నుండి నిరంతర నిబద్ధత, బలమైన అంతర్జాతీయ మద్దతు మరియు ప్రమేయం అవసరం.
ఇటీవల భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదం తరువాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సియాల్కోట్ మరియు పస్రూర్లోని వైమానిక స్థావరాలను సందర్శించారు. భారతదేశంలోని పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరానికి సీ-130 హెర్క్యులస్ విమానంలో వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భిన్నంగా, షరీఫ్ జీపులో ప్రయాణించడానికి ఎంచుకున్నారు, ఇది వివిధ చర్చలు మరియు ఊహాగానాలకు దారితీసింది. పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలు, ముఖ్యంగా సియాల్కోట్ మరియు పస్రూర్లోని రన్వేలు, భారత క్షిపణి దాడుల వల్ల గణనీయమైన నష్టాన్ని చవిచూశాయని, అవి విమాన కార్యకలాపాలకు పనికిరాకుండా పోయాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఆధునిక పద్ధతులను ఉపయోగించి వారంలోపు అటువంటి నష్టాన్ని సరిచేయవచ్చని అనేక మంది భారతీయ పైలట్లు పేర్కొన్నప్పటికీ, దాడులు గరిగిన ఒక వారం తర్వాత కూడా ఈ వైమానిక స్థావరాల కార్యాచరణను పునరుద్ధరించ లేకపోవడం బట్టి వారి వ్యవస్థలు నిర్వీర్యమయ్యయని తెలుస్తుంది. ఏతావాతా పాక్ పరిస్థితి వారికి "అగ్రహారాలన్నీ పోతే పోయాయి చట్టం బాగా తెలిసింది" అన్న సామెతను గుర్తుతెస్తుంది. అంతేకాకుండా, ప్రధాని మోడీ పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించడంతో భరత ఎస్-400 క్షిపణి బ్యాటరీ మరియు సుఖోయ్ విమానాలకు నష్టం వాటిల్లినట్లు పాకిస్తాన్ సైన్యం చేసిన వాదనలు సోదిలో లేకుండా పోయాయి. ఎందుకంటే మోడీ ప్రసంగ వీడియోలో అదంపూర్ వైమానిక స్థావరంలో ఎస్-400 మరియు సుఖోయ్ చిత్రాలు స్పష్టంగా కనిపించాయి.
యుద్ధ విశ్లేషకుల తీర్పు
సింధూరం అనేది హిందీ పదం, ఇది ఎర్రటి పొడి. వివాహిత హిందూ మహిళలు నుదిటిపై దీనిని ధరిస్తారు. స్త్రీ, పురుషులు అగ్ని ముందు ప్రమాణాలు చేసినప్పుడు, పురుషుడు స్త్రీ నుదిటిపై సింధూరం పూయడం ఒక ఆచారం. పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్ మరియు వైమానిక స్థావరాలపై జరిగిన నష్టాన్ని నిర్ధారించే కొత్త ఉపగ్రహ చిత్రాలు మరియు వీడియోలు ప్రతిరోజూ విడుదలవుతున్నందున, ఆపరేషన్ సింధూరం పాకిస్తాన్ త్వరలో మరచిపోలేని ఒక గుణపాఠంగా పనిచేస్తుందని ఏ నిష్పాక్షిక పరిశీలకుడికైనా స్పష్టంగా తెలుస్తుంది. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్లోని అర్బన్ వార్ఫేర్ స్టడీస్ చైర్ జాన్ స్పెన్సర్ "అంతర్జాతీయ మీడియా మరోసారి పాకిస్తాన్ ఉపయోగించిన 'ఫస్ట్ లై' (మొదట అబద్దం చెప్పడమనే) వ్యూహానికి లొంగిపోయిందని" హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సూటిగా విశ్లేషణ చేస్తూ అతను 'కేవలం నాలుగు రోజుల సైనిక చర్య తర్వాత, నిష్పాక్షికంగా స్పష్టంగా భారతదేశం గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇది కేవలం ప్రతీకార శక్తి ప్రదర్శన కాదు; ఇది భారత్ యొక్క నిర్ణయాత్మక సైనిక శక్తి ప్రదర్శన, సమర్థవంతంగా అమలు చేయబడింది' అని పేర్కొన్నాడు. ఆస్ట్రియన్ యుద్ధ విశ్లేషకుడు మరియు రచయిత టామ్ కూపర్ కూడా భారతదేశం యొక్క ఆపరేషన్ సిందూర్ ను "స్పష్టమైన విజయం"గా అభివర్ణించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ వైపు అడుగులు వేయాలనే నిర్ణయం భారతదేశం యొక్క ఉన్నతమైన సైనిక ప్రతిస్పందన యొక్క ప్రత్యక్ష ఫలితం అని సోషల్ మీడియాలో కూపర్ నొక్కిచెప్పారు. భారతదేశం యొక్క విజయానికి దాని అధునాతన యుద్ధ సామగ్రి మరియు దాని ధుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థలు కారణమని ఆయన పేర్కొన్నారు. యుద్ధ తంత్రాలు, విశ్లేషణలపై యాభైకి పైచిలుకు పుస్తకాలు రాసిన కూపర్, ఆపరేషన్ సిందూర్ పిదప పాక్ లో పరిచయమున్న స్థానిక యుద్ధ నిపుణులు తనకు ముఖం చాటువేసారని చెప్పారు. కేవలం పాక్ లో ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే సరిపోదని, వాటిని పాక్ తిరిగి పునరుద్దరిస్తుంది అని, పాక్ సైనిక స్థావరాలపై భారత్ దాడులు చెయ్యాలని తాను మే 7న పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేసినప్పుడు తాను స్పస్టంగా చెప్పానని, చివరికి మే 10న భారత్ ఆ పని చేసిందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ యొక్క ఏకైక విజయం సమాచార యుద్ధంలో ఉంది అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ 'ఫస్ట్ లై' (మొదట అబద్దం చెప్పడమనే) వ్యూహాన్ని మరియు పాకిస్తాన్ సైనిక ప్రాయోజిత ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ను అంతర్జాతీయ మీడియా ప్రధానంగా నమ్ముతుంది. మొత్తం మీద ఆపరేషన్ సిందూర్ ను ఒక 'డ్రోన్ యుద్ధం'గా చిత్రీకరించి, ఆనక పాకిస్తాన్లో దాదాపుగా గగనతల వైమానిక రక్షణ వ్యవస్థలు భారత్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్నాయనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంతర్జాతీయ మీడియా - చివరికి తటస్థ యుద్ధ నిపుణులు రంగప్రవేశం చేసి వారి ఇచ్చిన నివేదికలు, పాక్ కు జరిగిన భారీ నష్టం ఉపగ్రహాల చిత్రాలతో బయటపడడంతో, సదరు మీడియా తల దించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. చివరికి పలు ఏఐ సెర్చ్ ఇంజన్లు కూడా ఈ విషయం నిర్ధారణ చేసాయంటే ఈ అంతర్జాతీయ మీడియా సంస్థల నిజాయితీ - నిబద్ధత విలువలు పాతాళంలో ఉన్నాయని ఊహించవచ్చు.
దేశీయ ఉత్పత్తి: పాక్ X మహారాష్ట్ర
2023-24 ఆర్థిక సంవత్సరంలో, మహారాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి పాకిస్తాన్ స్థూల దేశీయ ఉత్పత్తి కంటే చాలా ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర జీడీపీ $490 బిలియన్లుగా అంచనా వేయబడింది. అయితే పాకిస్తాన్ జీడీపీ $338 బిలియన్ల నుండి $373 బిలియన్ల మధ్య ఉంటుందని ఒక అంచనా. 2004-05 ఆర్థిక సంవత్సరంలో, పాకిస్తాన్ జీడీపీ $132 బిలియన్లుగా ఉంది. అయితే ఆ సమయంలో మహారాష్ట్ర జీడీపీ $92 బిలియన్లు ఉండడం గమనార్హం. పహల్గామ్ ఊచకోత సమయంలో, ఉగ్రవాదులు ఎం-4 రైఫిల్స్ను ఉపయోగించారు అని ఒక అంచనా, అయితే 2000 సంవత్సరం ప్రారంభంలో, వారు సాధారణంగా ఇటువంటి ఉగ్ర దాడులకు పాత ఏకే-47లను ఉపయోగించారు. ఈ ధోరణి ప్రకారం, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్ర పురోగమిస్తుంటే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా తిరోగమనాన్ని ఎదుర్కొంది, అదే సమయంలో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మరింత అధునాతన ఆయుధాలు కలిగి ఉన్నారు. దీన్నిబట్టి పాక్ ప్రాధాన్యతలను మనం అర్ధం చేసుకోవచ్చు.
పాక్ ఒప్పుకోలు
పహల్గామ్ ఊచకోత తర్వాత ఆస్ట్రేలియా మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, గత ముప్పై సంవత్సరాలుగా తమ దేశం ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని అంగీకరించారు. సుమారు ఒక వారం తర్వాత, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీ, పాకిస్తాన్కు ఉగ్రవాద గ్రూపులతో చరిత్ర ఉందనేది 'రహస్యం కాదు' అని వ్యాఖ్యానించారు. స్కై న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు, 'అయితే, మా అనుభవాల ఫలితంగా, మేము విలువైన పాఠాలు కూడా నేర్చుకున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము అంతర్గత సంస్కరణలను అమలు చేసాము', అని ఆయన చెప్పారు. అయితే, విమర్శకులు ఈ అంతర్గత సంస్కరణలకు సంబంధించిన బిలావల్ వాదనలను సవాలు చేస్తున్నారు. పాకిస్తాన్ భూభాగం నుండి ఉగ్ర మూకలు భారతదేశంపై నిరంతర చేస్తున్న ఉగ్రవాద దాడులను ఎత్తి చూపుతున్నారు.
పాక్ భట్రాజులు
ఇదిలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలం అయి చావు తప్పి కన్ను లొట్టపొయిన చందాన ఆగమేఘాల మీద అమెరికాను ఆశ్రయించి కాల్పుల విరమణ కోరితే, ఏదో సాధించామని అటు పాక్ అధ్యక్షుడు షరీఫ్, ఇటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫైవ్ స్టార్స్ కలిగిన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ హోదాను మునీర్ కు షరీఫ్ కట్టబెట్టగా, ప్రతిగా మునీర్ ఒక చిత్రాన్ని పాక్ భారత్ పై చేసిన "ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్" గుర్తుగా షరీఫ్ కు ఇచ్చారు. చోద్యం చూస్తూ పాక్ పౌరులు ఊరుకున్నారు, కానీ భారత నెటిజన్లు ఊరుకుంటారా? తక్షణం రంధ్రాన్వేషణ చేసి సదరు చిత్రం 2019లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక డ్రిల్కు సంబంధించిన ఒక పాత ఫోటో అని వారు గుర్తించారు. ఈ ఫోటోలో చైనీస్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ ఉంది. పైగా ఈ చిత్రం ఐదేళ్ల నుంచి ఆన్ లైన్ లో ఉంది. ఈ పాత ఫోటో ని తాజాగా "ఆపరేషన్ బున్యాన్ అల్-మర్సూస్"కు సంబంధించినదిగా చిత్రీకరించారని వారు ఎగతాళి చేస్తున్నారు. ఓడిపోయిన యుద్ధానికి ఫీల్డ్ మార్షల్ హోదాను మునీర్ పొందడాన్ని చూసి ప్రపంచం అంతా ముక్కున వేలు వేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. మొత్తానికి షెహబాజ్ షరీఫ్,అసిమ్ మునీర్ ఇద్దరూ కలసికట్టుగా స్వంత దేశాన్ని మోసం చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. వీరు ఇద్దరూ ఒకరినొకరు ఇంతగా పొగడుకోవడం చూస్తుంటే, "గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట" అనే సామెత గుర్తుకురాలా? ఒక వ్యక్తి యొక్క ఘనత,శౌర్యం,వీరత్వాన్ని,దాతృత్వాన్ని అధికంగా వర్ణిస్తూ పొగిడే వాళ్ళను భట్రాజులు అంటారు. వీరు తమ కళా నైపుణ్యంతో రాజులను, ఇతర ప్రముఖ వ్యక్తులను పొగడడం ద్వారా జీవించేవారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లు పోటీలుపడి ఒకరినొకరు పొగడుకోవడం, సత్కారాలు చేసుకోవడం చూసి మన తెలుగు భట్రాజులు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఉందనేది నిజం!
ముగింపు
భారత్ ఆపరేషన్ సిందూర్ పగ, ప్రతీకారానికి బదులుగా న్యాయానికి ప్రతీక అని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. పాక్ లో విరాజిల్లుతున్న ఉగ్రవాద స్థావరాలు, వాటిపై భారత్ జరిపిన దాడి, పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టం, పాక్ అణ్వాయుధాల భద్రత, సింధు నదీ పరీవాహ ప్రాంత ప్రజల ఆందోళనలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాద సంస్థలకు శాశ్వత మద్దతును కొనసాగించే విషయంలో పాక్ పౌర సమాజం ఒక దృఢ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒంటరి అయిపోయిన తరువాత పాకిస్తాన్ ఎదుట ప్రత్యామ్నాయాలు పరిమితంగానే ఉన్నాయి. పాకిస్తాన్ అణు ఆయుధాగారం దాని స్వంత ప్రజలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుందని, పాక్ అణ్వాయధాల బూచి చూపి భారత్ ను ఇక ఏమాత్రం భయపెట్టలేదని ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం పాకిస్తాన్ చేపట్టగల అత్యంత ముఖ్యమైన చర్య ఏమిటంటే, దాని వైమానిక సామర్ధ్యంపై, స్వంత అణ్వాయుధ భద్రత గురించి కఠినమైన వాస్తవాలను అర్థం చేసుకోవడమే. ఉగ్రవాదానికి పాక్ చారిత్రక మద్దతును ఆపివేయడం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశానికి తిరిగి ఇవ్వడం, 1947 నాటి స్థితికి సమర్థవంతంగా తిరిగి రావడం మరియు దక్షిణాసియా ప్రాంతంలో శాంతిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటూనే సింధు జలాల ఒప్పందాన్ని సవరించడానికి భారతదేశంతో కలిసి పనిచేయడం ద్వారా శాశ్వత శాంతి వైపు అడుగులువేసే సువర్ణావకాశం ఇప్పుడు పాక్ ఎదుట ఉంది. ఈ అవకాశాన్ని పాక్ సమర్ధవంతంగా ఉపయోగించుకుందో లేదా యధాప్రకారం ఉగ్ర మూకలను భారత్ పైకి ఉసిగొల్పుతూ పైకి అమాయకత్వాన్ని నటిస్తూ, తన అస్తిత్వాన్ని పణంగా పెడుతుందో కాలమే నిర్ణయించాలి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, పాక్ సాధారణ ప్రజానీకం ఈ నిర్ణయంలో భాగస్వాములు కాకపోవడం. పాక్ ఆర్మీ ఉక్కు పిడికిలి నుండి పాక్ ప్రజానీకం బయటపడినప్పుడు మాత్రమే పాక్ కు మంచి రోజులు మొదలవుతాయని భావించవచ్చు.
ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో ఆపరేషన్ సిందూర్ రచ్చబండ చర్చపై మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం