Menu Close
వీక్షణం-152వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-152

వీక్షణం152వ అంతర్జాల సాహితీ సమావేశం ఏప్రిల్ 18, 2025న అత్యంత ఆసక్తికరంగా సాగింది. అతిథులకు, కవిమిత్రులకు సమూహ అధ్యక్షురాలు డా.కె.గీతా మాధవి గారు, సాహితీ ప్రేమికులు శ్రీ మృత్యుంజయుడు తాటిపామలగారు, సమూహ భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు తొలుత స్వాగతం పలికారు. 152 నెలలుగా నిరంతరాయంగా జరుగుతున్న వీక్షణంలో ప్రతిసారీ ఒక ప్రముఖ వ్యక్తిని సభకు పరిచయం చేసి వారి ద్వారా ఎన్నో సాహితీ ప్రక్రియా విశేషాలను తెలియజేయడం ప్రత్యేకత. ఈరోజు ముఖ్య అతిథిగా విశ్వపుత్రిక డా.విజయలక్ష్మీ పండిట్ గారిని సభకు పరిచయం చేశారు.

డా.విజయలక్ష్మిపండిట్ గారు పూర్వ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందినవారు. వారు PhD చేసి డాక్టరేట్ పొందారు. గజల్ ప్రక్రియలో నిష్ణాతులు కావడమే కాకుండా, అనేక సాహితీ ప్రక్రియలలో విశేషమైన కృషి చేశారు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

డా.విజయలక్ష్మిగారు తమ ప్రధాన ప్రసంగంలో గజల్ పుట్టు పూర్వోత్తరాల నుండి నేటి గజల్ రచనాశైలి గురించి వివరించారు. మత్లా, ముక్తా, కాఫియా, రధీఫ్ పదాలను సోదాహరణంగా వివరించారు. ప్రధానంగా ప్రేమను వస్తువుగా తీసుకుని గజళ్ళు వ్రాస్తారనీ, చక్కగా కొన్ని గజళ్ళు వినిపించి ముగ్ధులను చేశారు. గతులను విధిగా పాటించాలని నియమేమీ లేదని, భావం ముఖ్యమని తెలిపారు. దాదాపు గంటకు పైగా వారి ఉపన్యాసం ఆసక్తిదాయకంగా సాగింది.

తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యాన కవిసమ్మేళనం జరిగింది. గీత గారు 'ఒదిగిన మనసున' అనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతాన్ని, "ఆమని గీతం పాడనా" అనే స్వీయ గీతాన్ని శ్రావ్యంగా గానం చేశారు. వారి మధురమైన గాత్రానికి ప్రశంసల జల్లు కురిసింది. డాక్టర్ అరవా రవీంద్ర గారు తడిసి తడిసి ముద్దైతిని అనే గజల్ చక్కగా పాడి వినిపించారు. అరుణ కీర్తి పతాకరెడ్డి గారు మరో గజల్ ను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ ఉప్పలపాటి వెంకట రత్నం గారు వెన్నెల రేయంతా అనే గజల్ చదివి వినిపించారు. శోభాదేశ్ పాండే గారు ద్విచక్ర వాహనం అనే కవితను హాస్యాస్పోరకంగా చదివారు. డాక్టర్ కోదాటి అరుణ గారు కొరుప్రోలు మాధవరావు గారి గజల్ పాడి వినిపించారు. రామాయణం ప్రసాదరావు గారు నేను "వెళ్ళిపోతాను"అనే కవితలో ఈ కుళ్లిన జనారణ్యం విడిచి ప్రకృతితో మమేకమై పోతాను అనే కవితను చదివారు.

కమర గారు చితిరవ్వలు అనే కవిత చదివి అందరిచేత కన్నీరు కార్పించారు. కొత్తూరు వెంకట్ గారు 'మా అమ్మాయి సీమంతం' అనే కవితను నీవుండేది ఆకొండపై శైలిలో పాడారు. శ్రీ సాధనాల వేంకటస్వామి నాయుడు గారు గాలిలో దీపం అనే కవితను వినిపించారు. శ్రీ రామకృష్ణ చంద్రమౌళి గారు ఒయాసిసులు అనే కవితా చదివి వీక్షకులను మంచినీరు త్రాగించారు. డాక్టర్ మోటూరు నారాయణరావు గారు గోడగడియారం అనే కవితను చక్కగా ఆలపించారు. అవధానం అమృతవల్లి గారు మరో గజల్ పాడి వీనులకు విందునిచ్చారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు ఆవకాయ కవితను పాడి అందరికి తెలుగు వారి పచ్చడి ఆవకాయ రుచి అందించారు. శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు ఒకే కొమ్మ పువ్వులం అనే కవితను చదివి అక్కలను గుర్తుకు తెచ్చారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు రెండు చిటికినవెళ్ళు అనే కవితను రెండోసారి చదివారు. పరాంకుశం కృష్ణవేణి గారు చదివిన 'వేకువ కిరణాలు' అనే కవిత సభికులను ఆకర్షించింది. డాక్టర్ చీదేళ్ల సీతాలక్ష్మి గారు సీతారాముల కల్యాణం అనే గజల్ పాడి అలరించారు. వి కె సుజాత గారు ఆలోచనకు అక్షరాలకు మధ్య అనే కవితను వినిపించారు. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు మౌనరాగం అనే కవితలో మౌనం ఓ దివ్యాస్త్రం అన్నారు. డాక్టర్ ఎం.ఎన్. బృంద గారు రససింధూరం అనే కవితలో ఎండాకాలంలో నిప్పు ఎరుపు ఎలావుంటుందో వర్ణించారు. కట్టా శ్యామలాదేవి గారు యువతా మేలుకో అనే కవితను చదివారు. ఖమ్మంజిల్లా యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి గారు నేటి జీవితం అనే శీర్షికతో చక్కని కవిత చదివారు. జోరు పవిత్రక్రిష్ణ గారు డబ్బు అనే కవితను చదివారు. డాక్టర్ రవీంద్రబాబు గారు మౌనపు గదిలో అనే గజల్ ను శ్రావ్యంగా పాడారు.

చివరగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు కొత్తగా గజళ్ళు వ్రాయాలనుకునే వారు మొదట వివిధ గతులు నేర్చుకొని వ్రాయటం మొదలు పెట్టాలన్నారు. గజళ్ళు గానయోగ్యం అయినవి మరియు విన సొంపైనవి అన్నారు. వారు చూస్తున్నా అంటూ పాడిన గజల్ సమావేశానికి పరాకాష్టకు తీసుకెళ్ళింది.

డాక్టర్ గీతా మాధవి గారు అందరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు. కవితలన్నీ బాగున్నాయని, సమావేశం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురు చూస్తున్నామని కవులు సంతోషం వ్యక్తంజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉత్సాహంగా పాల్గొని, అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in May 2025, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *