Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు

"తాతగారూ! ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేయడ’మంటే ఏమీటీ!" అంటూ వచ్చాడు మనవడు.

"అసలీ మాట ఎక్కడ విన్నావో చెప్పు ముందు." అడిగారు తాతగారు.

"మా క్లాస్ మాధవ్ లేడూ! వాడి పుట్టిన రోజని చాక్లెట్స్ తెచ్చాడు. అందరికీ ఇమ్మన్నాడు. నేను ఒక్కటిస్తే బావోదని రెండేసి చొప్పున ఇచ్చాను. దానికి వాడు 'అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు' ఏరా! రేండేసి ఇచ్చావూ' అన్నాడు తాతగారూ!"

"ఓహ్ అంతే కదా! ఏదైనా ఒకరి వస్తువును మరొకరు ఇస్తుంటే సాధారణంగా వారు భావించిన దానికంటే ఎక్కువగా ఇస్తే ఈ మాట అంటూంటారు."

"కాస్త వివరంగా చెప్పరూ!"

"వివరం అంటే నీకు కధేగా! కూర్చో చెప్తాను." అంటూ మొదలెట్టారు తాతగారు.

ప్రశాంత పురం అనే గ్రామంలో లక్ష్మీపతి అనే ఒక రైతు ఉండేవాడు. ఆయనకు చాలా మెట్ట, మాగాణి పొలాలుండేవి. అన్ని రకాల ధ్యాన్యం పండేది. ఊర్లోకెల్లా పెద్ద ఆసామిగా పేరు తెచ్చుకున్నాడు. అతడి ఒక్కగానొక్క కొడుకును పట్నం పంపి బాగా చదివించాడు. ఇంజనీరై విదేశాలకు ఉద్యోగార్ధం వెళ్లాడు. అక్కడే తనతో పనిచేస్తున్న ఒక అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి తండ్రికి పల్లెలంటే ప్రీతి. అందువల్ల ప్రశాంతి పురంలోనే పెళ్ళి చేయాలని సంకల్పించాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రశాంతి పురంలో భూదేవంత తాటిపందిళ్ళూ, ఆకాశమంత ఈత చాపలూ వెలసి అమోఘంగా పెళ్ళి ఏర్పాట్లు అయ్యాయి. లక్ష్మీపతి చుట్టుపక్కల ఊర్లలోని తన బంధువులనూ, స్నేహితులందరినీ పెళ్ళికి పిలిచాడు. మూడు రోజులు నానా హంగామాతో ఘనంగా పెళ్ళైంది. మూడో రోజు పేదలందరికీ భోజనాలు ఏర్పాటయ్యాయి.

లక్ష్మీపతి ఊర్లో అందరినీ తనకు సాయం చేయమని కోరగా అన్న, మామ, బాబాయ్, పెదనాన్న వరుసలతో పిలుచుకునేవారంతానూ, అక్క, పిన్ని, అత్త, వదినా వరుసలవారూ నడుం బిగించి వచ్చారు. బారులు తీర భూపతులు అన్నట్లు విస్తళ్లముందు ఆవురావురుమంటూ, బారులు తీరి కూర్చున్న పేద సాదలకంతా వడ్డించసాగారు. రాత్రికి పెళ్ళికొడుకు స్నేహితులకోసమని అరచేయంత అరిసెలూ, పెద్ద ఆపిల్ పళ్ళంత లడ్డూలూ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకిచ్చేంత వడలూ చేయించాడు లక్ష్మీపతి. వంటవారు వాటిని కూడా తెచ్చి అన్నదానం చేసేచోట పెట్టి వెళ్ళారు. వడ్డించే వారంతా అవీ పేదల బంతికే అని భావించి వడ్డించసాగారు. భోజనాలు చేస్తున్న, భిక్షగాళ్ళూ, పేదలంతా ఏనాడూ చూడనీ, తినని ఆ పిండివంటలు చూసి ఆవురావురుమంటూ తినసాగారు. ఇంతలో లక్ష్మీపతి అటుకేసి వచ్చి వడ్డిస్తున్న వారితో 'అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు’ రాత్రి ప్రత్యేక భోజనానికి ఏర్పాటు చేసిన ఈ పిండివంటలు కూడా వడ్డిస్తారా!' అని గద్దించాడు. అతడికి కాస్త నోరు జాస్తి. వడ్డన చేస్తున్నవారు శిలాప్రతిమల్లా అవమానంతో నిల్చుండిపోయారు. తండ్రి మాట విని పెళ్ళికొడుకైన లక్ష్మీపతి కుమారుడు అక్కడికి వచ్చి "నాన్నా, ఇవన్నీ నా స్నేహితులెవరూ తినరు. వారికి వేరే వంటకాలు చేయిస్తున్నాను. అన్నీ వీరి కోసమే నేనే పంపాను. బాబాయ్! పిన్నీ మీరు వడ్డించేయండి" అని తండ్రిని దూరంగా తీసుకెళ్ళాడు.

అదిరా మనవడా ఒకరి సొమ్ము కదాని చూసుకోకుండా ఖర్చుచేసే వారి గురించి ఈ సామెత. ఈ కధలో లక్ష్మీపతి మనోభావానికి ఇది చక్కగా సరిపోతున్నది." అంటున్న తాతతో "తాతా ఈ రోజుకు నీకధ ఐపోయింది, నా ఆటల సమయమూ ఐంది. బై" అంటూ వెళ్ళాడు మనవడు.

Posted in September 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!