Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

ఆరు నెలలు సావాసం చేస్తే చాలు- వారు వీరవుతారు

అగ్రహారం అనే గ్రామంలో శ్యామశాస్త్రి , అనసూయమ్మ అనే దంపతులు ఉండేవారు. అనసూయమ్మ చాలా మడీ ఆచారాల మధ్య పుట్టి పెరిగిన మహిళ. అలాంటి సనాతన అగ్రహార కుటుంబంలోకే కోడలుగా వచ్చింది. నడిచేప్పుడు నీళ్ళు చల్లుకుంటూ నడుస్తారు ఆ ఇంటివారు. ఒక మారు వంటచేసిన నిప్పులను కడిగాకే ఆబొగ్గులు మళ్ళీ వాడుతారు. వారికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె.

అనసూయమ్మ అన్న అనంతం శ్యామశాస్త్రి తో మాట్లాడి "బావగారూ ! రానున్నకాలంలో మీ మడీ ఆచారాలు పనికి రావు. పక్కన పెట్టేయాల్సిందే. పిల్లల్ని మారుతున్న కాలంతో పాటు గా బాగా చదివించండి. లేకపోతే వారెందుకూ పనికిరారు." అని ఒప్పించి పిల్లలను ముగ్గురినీ తన దగ్గర నగరంలో ఉంచుకుని పెద్ద చదువులు చదివించాడు. ముగ్గురూ డాక్టర్లూ, ఇంజనీర్లూ, లాయర్లూ అయ్యారు. పిమ్మట పెద్ద చదువులకూ, ఉద్యోగార్ధం అమేరికా, కెనడా, ఇంగ్లాడులకు వెళ్ళి స్థిరపడ్దారు. వివాహాలు మాత్రం పెద్దలు నిశ్చయించిన వారితో ఇండియాలోనే చేసుకుని తిరిగి కుటుంబాలతో పాటుగా తమ ఉద్యోగ భూములకు వెళ్ళిపోయారు. తల్లులకు తప్పదు గనుక కూతురు కౌముది గర్భవతికాగా ఆమె కానుపుకోసం అనసూయమ్మ అమెరికా వెళ్ళక తప్పిందికాదు. ఎలాగో మడీదడీ పక్కన పెట్టేసి మొదటిసారిగా సప్త సముద్రాలు దాటి అమెరికా చేరింది.

కౌముది ముందే హెచ్చరించింది. “ఇక్కడ నేలంతా చెక్క, నీవు నీళ్ళుచల్లుకుంటూ నడిస్తే పడి నడ్డి విరుగుతుంది. రోజూ చిమ్మనూ కడగనూ అవదు. నీ ఆచారాలన్నీ ఇనప్పెట్టేలో పెట్టేసి రా” అని. వారి ఆచారం ప్రకారం సముద్రం దాటితే అపరాధం. కానీ తప్పలేదు అనసూయమ్మకు. కూతురి పురుడు హాస్పిటల్ లో ఐనా దగ్గరుండి అన్నీచూసుకుంది. అక్కడి వైద్యులు, నర్సులూ షేక హ్యాండ్ ఇస్తే తీసుకుంది. బంగారు రంగులో పుట్టిన చిన్నారి మనవరాల్ని ఒళ్ళోపెట్టుకుని మురిసిపోయింది. పురుడైన నాలుగవ రోజే ఇంటికి వచ్చారు. అక్కడ మన ఆచార వ్యవహారాలు సాగవని కౌముది చెప్పాక వాటికి ఒదిగిపోక తప్పలేదు అనసూయమ్మకు. ఇంటికి రాగానే తలారా స్నానం చేసి వండుకు తినింది. అల్లుడికి పెట్టింది. కూతురికి సిజేరియన్ కావటాన మనవరాలి పనంతా చూసుకోక తప్పలేదు. చిన్నారి స్నానపానాదులన్నీ ఆమే చూడాల్సి వచ్చింది. అత్తగారు కష్టపడుతున్నారని, అల్లుడు తానే వంట సాగించాడు, అనసూయమ్మ చెప్పినా వినక. తప్పనిసరై అదే తినేది. ఒక్కోమారు బయట శాకాహారం వండే వారు ఇంట్లో తయారు చేసిన కూరలు తెచ్చేవాడు. అదీ తినక తప్పలేదు అనసూయమ్మకు. వాటిని మైక్రోవేవ్ లో వేడి చేసుకుని తినేవారు. చపాతీలకట్ట తెస్తే అదీ వేడిచేసుకుని తినేది అనసూయమ్మ. అల్లుడే గిన్నెలు కడిగి డిష్ వాషర్ లో వేస్తుంటే విస్తుబోయి చూసింది. మొదట్లో బట్టలన్నీ వాషింగ్ మెషీన్ లో అతడే వేసేవాడు. ఇల్లు ఊడ్చను ఒక మిషన్ ఉండేది. కాఫీ చేయనొక మెషీన్, అన్నం వండనొక మెషీన్. ఉదయాన్నే లేచి చలికి ఒణుకుతూ చన్నీళ్ళస్నానం చేసి తడి బట్టతో వండే తానేనా ఇలా మారింది అని ఆశ్చర్యమేసింది ఆమెకు. వెచ్చటి ఇల్లు. శుభ్రంగా ఉండే నేల. ఇలా మేషీన్ల మధ్య ఎలాగో ఆరునెలలు గడిచాయి అనసూయమ్మ గారికి. అసలుకంటే వడ్డీ ముద్దని మనవరాల్ని వదల్లేక వదల్లేక వదిలి ఇండియా విమానం ఎక్కింది. అగ్రహారం వచ్చాక అంతా కొత్తగానే అనిపించింది. 'ఈ ఇల్లేంటి? ఈ కట్టెలపోయ్యేంటి? బట్టలిలా బండకేసి బాదడమేంటి? చలికాలంలోనూ చన్నీళ్ళ స్నానాలేంటి? ఇల్లు ఊడ్చుకోడమేంటి? పేడతో అలుక్కోడమేంటి?’ వెంటనే అన్న ను పిలిపించి ఇల్లంతా ఆధునికంగా మార్పించమంది. రేపు అల్లుడూ కోడళ్ళూ వస్తే ఎలాఉంటారంది. నిర్ఘాంతపోయి చూస్తున్న శ్యామశాస్త్రి తో బావమరిది అనంతం "బావగారూ! అందుకే అన్నారు ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని. మా చెల్లాయ్ ఆ సామెత నిరూపించింది." అన్నాడు. అంతా పకపకా నవ్వుకున్నారు. భార్య ప్రతిపాదన సమంజసమే కనుక శ్యామశాస్త్రి అంగీకరించారు. అదండీ ఆరునెల్ల సావాసం ప్రభావం సామెత.

Posted in July 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!